Saturday, May 21, 2011

వేదపాఠశాల - 3



.....వేధింపులు

స్వామి చర్చకులచేత నిజాలు మాట్లాడిస్తున్నా, మళ్లీ మళ్లీ గుడుగుడు గుంచం అంటూ మొదటికే వచ్చి, 'గోరంతల్ని కొండంతల్ని' చెయ్యడం అంటూనే మాట్లాడారు.

వేదాలు పవిత్రమైనవి, తిరుమల, తిరుపతి పవిత్రమైనవి, వేద పాఠ శాల కూడా పవిత్రంగా వుండాలి కదా? అక్కడ తప్పు జరుగుతోంది అంటే, ఆ పవిత్ర వాతావరణం అక్కడ లేదు.....కల్పించబడలేదు అనే కదా?

మరి పవిత్ర పాఠశాల పేరుతో ఇలాంటివాటిని చాపక్రిందకి తోసెయ్యాలనా? (సత్యసాయి మీద హత్యా ప్రయత్నం జరిగి, బులెట్లు ఆయన వాటర్ బెడ్ ని చీలిస్తే, కొన్ని హత్యలు జరిగితే, అప్పట్లో ఇన్ని ఛానెళ్లు లేక, అవన్నీ చాపక్రిందకి తోసేశారు. అప్పుడు చర్యలు తీసుకొనుంటే, ఇప్పుడు ట్రస్టు మీదా, కొంతమంది మీదా ఆరోపణలకి ఆస్కారమే వుండేది కాదు. చరిత్ర మరోలా వుండేది!)

ఆం. భూ. వారు, అసలు వాళ్లకి కంప్యూటర్లు యెందుకండీ అనీ, ఇంకో ఆయన సెల్ ఫోనులెందుకు అనీ, ఇంకో ఆయన సెల్ ఫోనులు బ్లాక్ & వైట్ వి అయితే సరిపోతాయి, కలర్లూ కెమేరాలూ నిషేధించాలి అనీ--ఇలా!

అంటే, వేద విద్యార్థులు (వేదం మాత్రమే) చదువు పూర్తి చేసుకొని, జీవితంలో ప్రవేశించేవరకూ కూపస్థ మండూకాల్లా వుండాలనా? నలందా, తక్షశిల వగైరాల్లో అలాగే జరిగిందా?

గర్భాష్టమం లో వుపనయనం చేసి, విద్యార్జనకి పంపితే, ఆరేళ్లలో 15 వ పుట్టినరోజు నాటికి "సకల శాస్త్రాలూ" చదివి, కొలువులు వెతుక్కోడానికి విద్యాలయాన్ని వదిలేవారు. మరి ఇప్పుడు 9 యేళ్లనించీ, 10 యేళ్లనించీ వేదం మాత్రమే పూర్తి చెయ్యలేకపోతున్నారంటే, ఆ సిలబస్ లో లోపమా? లేక అధ్యాపకులదా?

ఇంకా, ఈవో గారు చక్కగా వ్యవహరించారు అనీ, బయటపెట్టకపోయినా వెంటనే దర్యాప్తు చేయించి "ఇద్దరు విద్యార్థులని" టీసీలు ఇచ్చి పంపించారు అనీ అన్నారు. ఓ కుటుంబంలో యెవరైనా ఓ చిన్న తప్పు చేస్తే, యజమాని వెంటనే మీడియావాళ్లని పిలవరుగా? అనీ, ఈవోగారు క్యూలైన్లూ వగైరా వ్యవహారాలే చూసుకుంటాడా, వేదపాఠశాలని కాపలా కాస్తూ కూచుంటాడా? అని కూడా అన్నారు. 

యెంత విడ్డూరం! 845 మంది విద్యార్థులు (ఈ అంకె వాళ్లు చెప్పిందే) కొన్ని సంవత్సరాలుగా అక్కడే వుంటూ, తింటూ, చదువుకుంటుంటే, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దేవస్థానం వారు, ఆ పాఠశాల నిర్వహణకి తగిన యంత్రాంగాన్ని యేర్పాటు చెయ్యలేదు అని స్పష్టం అవుతోంది కదా? దీనికెవరు బాధ్యులు?

నిన్న (20-05-2011) న స్థానిక రెండో పట్టణ పోలీసులు ఓ విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదుపై, ముగ్గురు విద్యార్థులమీదా, ప్రథానాచార్యుల మీదా కేసు నమోదు చేసి, ప్రథానాచార్యులు రామ మూర్తిగారిని స్టేషనుకి పిలిపించి విచారించారు అనీ ఇవాళ పేపరులో వార్త!

ఇంకా యెందుకు దాపరికాలు?

ప్రతీదానికీ దేవస్థానం యేమిచేస్తుంది? అని ఓ వెక్కిరింపు! టిక్కెట్లు బ్లాకులో అమ్మేసుకున్నా, వీఐపీలకి గంటలతరబడి క్యూలు ఆపేసి ధ్యానాలకీ, దర్శనాలకీ యేర్పాట్లు చేసినా, రాజకీయులు ర్యాలీలూ వగైరా చేసినా, అన్యమత ప్రచారం జరిగినా, లడ్డూ ప్రసాదాల్లో పంచదార బదులు వుప్పు వేసేసినా, ప్రసాదాలు హొటళ్లలో అమ్ముకున్నా.....ఇలా యేమి జరిగినా అన్నింటికీ దేవస్థానాన్ని అనేస్తారా?! అన్నట్టు లేదూ?

.....తరువాయి మరోసారి.

No comments: