.......మాధవ సేవ!
మా సిబ్బంది అస్తమానూ మసిలే ఓ ప్రదేశం లో ఓ గోడమీద ప్రముఖం గా కనిపిస్తూ అంటించబడి వుంటుంది ఓ చిన్న బ్రోచర్--దానిమీద ఓ ప్రముఖ స్వామీజీ ఫోటో, ఆ ప్రక్కనే "మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ" అని వ్రాసి వుంటుంది--యెన్నేళ్ళక్రితం యెవరు అంటించారో!
బుర్రలో మరేమీ ఆలోచనల్లేనప్పుడు, దాన్ని చూసి, 'ఈ స్వామికి చాతుర్మాస్య వ్రతాలూ, అనుగ్రహ సంభాషణలూ తప్ప, సేవ చెయ్యడానికి సమయం వుంటుందా? వున్నా చెయ్య నిస్తారా?' అనుకుంటూ వుండేవాణ్ణి మనసులో!
33 కుటుంబాలకి సరిపోయేలా వసతి కల్పించడానికి నిర్మించబడ్డ, శిథిలమైపోయిన 'వేయికాళ్ళ మంటపాన్ని ' తొలగిస్తే, 'ఆగమ శాస్త్ర ప్రకారం దాన్ని అలాగే అక్కడే పునర్నిర్మించవలసిందే'--అంటూంటే, అనవసరం గా ఈయన యెందుకిలా ప్రవర్తిస్తాడు--అనుకొనేవాణ్ణి.
ఆయనెవరో కాదు--మీరు వూహించే వుంటారు--శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయరు స్వామి!
ఆయన విజయనగరం లోని జీయర్ ట్రస్ట్ నిధులతో, అంధ విద్యార్థులకోసం 'నేత్ర విద్యాలయాన్ని ' నిర్వహిస్తూ, దాన్ని జూనియర్ కాలేజ్ స్థాయికి పెంచి, విద్యార్థులకి 'ల్యాప్ టాప్' లు ఉచితం గా ఇచ్చి వారిచేత పరీక్షలు వ్రాయించడానికి బోర్డుని ఒప్పించి, వాళ్ళు ఉత్తీర్ణులయ్యేలా చేశారంటే--అంతకన్న మాధవ సేవ యేముంటుంది!
స్వామీ! నమోవాకాలు!
మిగిలిన గడ్డాల మీసాల కాషాయ స్వాములు కూడా--ఆశ్రమాలూ, గుళ్ళూ, గోపురాలూ, గీతా మందిరాలూ, ధ్యాన మందిరాలూ కట్టించడం మానేసి--ఇలాంటి మాధవ సేవకి పూనుకొంటే...............!
ఆ విధం గా మనం ఆశిద్దామా?