Friday, September 10, 2010

శ్రీగిరి శ్రీపతి

అదే తీరు


చిరుతపులి తన మచ్చల్ని మార్చుకోగలదా? 

యెడం చేయి తీసి పుర్ర చెయ్యి పెడితే యేమైనా తేడా వుంటుందా?

ముల్లూపోయి కత్తీ వచ్చే......లో యెన్ని పోతే కథ పూర్తవుతుంది?

పాలక మండలి పోయి, సాధికార మండలి వస్తే యేమైనా మారుతుందా?

యేమో మరి!

ఏకగవాక్ష విధానం కోసం "శ్రీ-సేవ" పేరుతో ఓ నాలుగంతస్తుల భవనాన్ని నిర్మిస్తారట. రాష్ట్రం లో వివిధ ప్రాంతాలతోపాటు, తమిళనాడు, కర్ణాటకల్లో మొత్తం ఓ 50 శ్రీ-సేవ కేంద్రాలు యేర్పాటు చేస్తారట!

కొండమీద ధ్యాన మందిరాలు కట్టిస్తారట!

(భద్రాచలం లో కొండమీదే ఆలయం ప్రక్కన కట్టిన "శ్రీ రామదాసు ధ్యాన మందిరం" ఇప్పటివరకూ యెందుకూ వుపయోగపడిన దాఖలాలు లేవు--అలాగే శిధిలం అయిపోతూంది.)

అయినా అభివృధ్ధికల్లా మూలం బిల్డింగులు కట్టడమేనా?

సరే--మహాలఘువుని రేపు ఒకటో తారీకు నించీ రద్దు చేశామని ఇప్పటికే ప్రకటించారు కదా? మళ్లీ ఇప్పుడు దర్శనాలపై "పునః సమీక్ష" చేస్తామనడం యేమిటి?

కొన్ని రోజుల్లోనే ఈ మార్పుకి కారణం యేమిటి?

యేమీ లేదు--వీళ్లు రోశయ్యగారితో సమావేశం లో పాల్గొన్నారట. ఇంకా అందులో మంత్రులు గాదె వెంకట రెడ్డి, దానం నాగేందర్, ప్రథాన కార్యదర్శి ఎస్ వీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారట!

ఇదేదో విక్రమార్కుడి సిం హాసనం కథ లాగ.....!

అదండీ సంగతి!



Friday, September 3, 2010

శ్రీగిరి శ్రీపతి

సామాన్యుడికి కాస్త వూరట

కొన్ని నిర్ణయాలు క్షణాల్లోనే జరగాలి. సంవత్సరాల తరబడి లాక్కుంటూ, పీక్కుంటూ కూర్చుంటే ప్రయోజనం వుండదు.

సాధికార మండలి మొదటి సమావేశం లోనే మంచి నిర్ణయాలు వెలువడ్డాయి.

మొదటిది--మహాలఘు దర్శనం రద్దుచెయ్యాలని.

సామాన్యులకి మూడురకాల దర్శనాలు అమల్లో వున్నాయి ఇన్నాళ్లూ.

లఘు దర్శనం--అంటే, స్వామికి దగ్గరగా వుండే మొదటి ద్వారం కాకుండా, రెండో ద్వారం దగ్గర దర్శనం కలిగించి, పంపించెయ్యడం.

మహాలఘు దర్శనం--అంటే, రెండోది కూడా కాకుండా, జయ విజయులు కాపలా వుండే మూడో ద్వారం దగ్గరనించే పంపించివెయ్యడం.

మహావీర లఘు దర్శనం--అంటే, మూడో ద్వారం దగ్గరకూడా నిలబడనియ్యకుండా, నెట్టేయడం/ఈడ్చెయ్యడం.

ఇప్పుడు మహా లఘువుని రద్దు చేస్తే, మహావీర లఘువు కూడా ఆటోమేటిగ్గా రద్దవుతుంది.

ఇక మిగిలేది లఘువు మాత్రమే! 

చూద్దాం, ఇదెలా వుంటుందో!

ఇక ఆర్జితసేవల కరెంటు బుక్కింగ్ మొదలెడతారట రేపు ఒకటో తారీఖు నించీ.

సుప్రభాతం, కల్యాణోత్సవం, నిజపాద దర్శనం లకి, ఒక్కోదానికీ 100 చొప్పున 300 టిక్కెట్లు వుదయం 8.00 నించీ, ముందు వచ్చినవారికి ముందు పధ్ధతిలో జారీ చేస్తారట.

ఊంజల సేవకి 10, సహస్రదీపాలంకరణకి 70, ఆర్జిత బ్రహ్మోత్సవానికి 25, వసంతోత్సవానికి 25 వంతున 135 టిక్కెట్లు జారీ చేస్తారట.

గుడ్డిలో మెల్లగా, డబ్బులు చెల్లించగల సామాన్యులకి ఇది మేలేగా?

ఇక ఆన్ లైన్ బుకింగులు మామూలేననుకుంటా.

సాధికార మండలి కొంచెం ముందుకెళ్లి, ఈ సేవల్ని పూర్తిగా రద్దుచేసే రోజొస్తే బాగుండును.

ఇంకా, ఈ ప్రమాణ స్వీకారాలు గుడిలో జరగకుండా నిరోధిస్తే ఇంకా బాగుండును.

ఇలా చేస్తే, లఘువుని కూడా రద్దు చేసి, మొదటి ద్వారం (కులశేఖరపడి) నుంచే అందరికీ, వీ ఐ పీ లతో సహా, చక్కగా దర్శనం కల్పించవచ్చు.

స్వామి ఇంకెప్పుడు కరుణిస్తాడో సామాన్యుల్ని!