Saturday, November 5, 2011

శ్రీగిరి శ్రీపతి

లడ్డూల వితరణ 


తి తి దే వారి బుధ్ధి వెర్రితలలు వేస్తోంది అనడానికి ఇంకో వుదాహరణ--లడ్డూ విక్రయానికి "ఏ టీ ఎం"లు యేర్పాటు చేస్తారట! 

అదికూడా యెలాగ? 

చూపుడువ్రేలి ముద్రని "సేకరించి" ఆ చాయాచిత్రాన్ని భద్రపరుస్తారట. అక్కడే లడ్డూలకి నగదు చెల్లింపు కూడా చెయ్యాలట! 

అదయ్యాక, ఏటీఎం కి వెళ్లి, వ్రేలిముద్ర వెయ్యగానీ, అది లడ్డూలని "విసర్జిస్తుందట!" 

అదికూడా, పర్యావరణ హితం కోరి, "కాగితరహిత" విధానాన్ని ప్రవేశ పెట్టడానికేనట! 

యేమన్నా బాగుందా? 

లక్షలో, కోట్లో ఖర్చుపెట్టి, మరిన్ని కుంభకోణాలకి తెరలేపడానికి కాకపోతే.....? ఇంత దివ్యమైన అవిడియా ఇచ్చినవాళ్లకి యెవార్డు కూడా సిఫార్సు చేస్తారేమో! 

ఇప్పటి పధ్ధతిలో, ప్లాస్టిక్ కవర్లు బ్యాంకు కవుంటర్లలో కొనుక్కోవాలి. వాటిని లడ్డూ కవుంటర్లో ఇస్తే, వాటిలో లడ్డూలు నింపి, మన చేతికి ఇస్తారు. అంతకు ముందే, ఇంకో కవుంటర్లో నగదు చెల్లించి పొందిన రసీదుని వారికి ఇవ్వాలి. 

ఈ పధ్ధతిలో, చక్కగా కొన్నివేల లడ్డూల వితరణ జరుగుతోంది! ఇంకా త్వరగా జరగాలంటే, కవుంటర్లనీ, సిబ్బందినీ పెంచాలి. 

నాకు తెలీకడుగుతా, డబ్బు తీసుకొని, వ్రేలి ముద్ర సేకరించి, నిక్షిప్తం చెయ్యడానికి, (రసీదు ఇవ్వకుండా) యెంత సమయం పడుతుంది? 

ఏటీఎం లో లడ్డూలు ఒకదాని తరవాత ఒకటి విసర్జింపబడడానికి యెంత సమయం పడుతుంది? తీరా వస్తే, అవి యే షేపులో వుంటాయి? 

క్రింద "ట్రే" యే ఆకారంలో వుంటుంది? పడిన లడ్డూలు దొర్లుకొంటూ ఇంకో ట్రే లో పడతాయా? 

లేక మనం ఆ క్రింద తట్ట పట్టుకొని సిధ్ధంగా వుండాలా? 

నగదు వితరణ జరిగే ఏటీఎం లలోనే, ఖాతా నిల్వ సరిచూసుకోడానికీ, తరవాత నగదు పొందడానికీ, రసీదు, కార్డు పొందడానికీ యెంతలేదన్నా ఐదు నిమిషాల పైనే పడుతోంది. 

మరి ఈ ఏటీఎం లు రోజంతా పనిచేసినా, యెంతమందికి యెన్ని లడ్డూలు వితరణ చెయ్యగలవు? 

ఒకవేళ అవి "మొరాయిస్తే" దిక్కెవరు? 

ఇంకెవరు! యేడుకొండలవాడే......యెప్పుడూ మన భక్తులకి!

Saturday, September 3, 2011

దర్శనాలూ



తరించేలా సేవలూ

"శ్రీవారి భక్తులకి విశేషమైన సేవలందించి వారి ఆత్మీయతను అందుకుంటాను.
ఉడతాభక్తిగా శ్రీవారి సేవలో పాల్గొని యాత్రికుల కష్టాలను తొలగిస్తాను.
వసతి సౌకర్యం కల్పనలో ఎదురవుతున్న సమస్యలను తొలగిస్తాను.
భక్తులే దేవుళ్లుగా సేవలందిస్తానని హామీ ఇస్తున్నాను.
అలిపిరి నుంచి తిరుమలకి వచ్చి, శ్రీవారిని దర్శించి, తరించి, తిరిగి అలిపిరి చేరేవరకు నేను పూచీగా వుంటాను"
"ముఖ్యమంత్రి కి కు రె విశ్వాసాన్ని వమ్ముచేయకుండా నడుచుకుంటాను.
సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాను"

......ఇవన్నీ క్రొత్తగా తి తి దే పాలకమండలి అధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేసిన బుగ్గమీసాల బాపిరాజుగారి వువాచలు!

మరి ఈయన వొరగబెట్టింది యేమిటి?

బంగారువాకిలిలోని గరుడాళ్వారు ముందు ప్రమాణస్వీకారం చేశాడు ఇతర సభ్యులందరితోనూ, ప్రతీ సభ్యుడి వెనకా మూకలతోనూ!

3 గంటలకి పైగా భక్తుల దర్శనాన్ని నిలిపేశారుట! భక్త దేవుళ్ల "సేవకి" అలా శ్రీకారం చుట్టాడన్నమాట!

200 మంది అనుచరగణం బంగారువాకిలి లోకి చేరుకొన్నారట. ఇంకో 400 మంది బయట వెండివాకిలివరకూ ఆక్రమించారట! అందరూ బంగారువాకిలిలో దూరడానికి తోసుకున్నారట. సిబ్బందితో వాగ్వాదం చేశారట. యెలాగైతేనేం, ప్రమాణస్వీకారం అయ్యాక, అందరూ లోపల చొరబడ్డారట!

అదీ శ్రీవారిమీద ఆయనకీ, అనుచరులకీ వున్న గౌరం, భక్తీ!

భార్యతో శ్రీవారి కళ్యాణోత్సవం లో పాల్గొన్నారట. రాత్రి మళ్లీ "అనుచరగణానికి" వీ ఐ పీ దర్శనానికి యేర్పాట్లు చేశారట! ఇదీవారి "ఉడతాభక్తి"!

పద్మావతి నగర్లో అతిథిగృహాలు ఖాళీలేకుండా పోయాయట!

ఇవీ ఆయన వసతి సౌకర్యాల కల్పనలో సమస్యలని తొలగించే, భక్తులే దేవుళ్లుగా సేవలందించే, దర్శించి తరించేవరకూ పూచీపడే--పధ్ధతులు! 

ఈవోగారిమీద ఇదివరకే యేవో ఆరోపణలున్నాయన్నారు. మరి ఇప్పుడు వీళ్లిద్దరూ కలిస్తే, యెన్నికొండలని కరిగించడానికి ప్లాన్లు వేస్తారో!

బాగుంది కదూ రాజుగారి పాలన!

Tuesday, August 23, 2011

శ్రీవారి ఆలయం-2



దర్శనాలూ

రావులపర్తి భద్రిరాజుగారేమో.....ఖచ్చితంగా నాకు తెలీదు....."యేడుకొండల శ్రీనివాసా......." అనే పాటలో వ్రాశారు.......

"కోటికీ పడగెత్తినా ధనవంతుడూ.....నీ గుడి ముంగిటా సామాన్యుడు....."(గుడి ముంగిట అన్నారుగానీ, గుడిలోపల అనలేదు చూడండి!)

"కూటికోసం శ్రమ పడే నిర్భాగ్యుడూ.....నీ కృపకెప్పుడు సమపాత్రుడు....." (కృపకి సమపాత్రుడు --అంటే అర్హత వున్నవాడు అన్నారుగానీ--ఆ కృపని అందుకుంటాడని గ్యారెంటీగా చెప్పలేదు!).

ఇవన్నీ యెంత నిజాలూ.....!

Monday, August 22, 2011

శ్రీవారి ఆలయం



దర్శనాలూ

మొన్నేదో "డయల్ యువర్ ఈవో" నో ఇంకేదో కార్యక్రమంలో, భక్తులు చెప్పినమేరకు, శ్రీవారి వెండివాకిలి నుంచి బంగారు వాకిలి వరకూ, భక్తుల నడక ఒకే యెత్తులో వుండేలా (మరి  ఇన్నాళ్లూ భక్తులు దేవుణ్నే చూశారా, తమకాళ్లు యెక్కడ వేస్తున్నమో చూసుకొంటున్నారా?) "చెక్క బెంచీల" యేర్పాటు చేస్తామని సెలవిచ్చారు. ఇన్నాళ్లూ చెక్కలు లేవా? వున్నాయి కానీ గుమ్మాలెక్కడం దిగడంలో యెగుడుదిగుడుగా--యెత్తుగా, వాలుగా, ఇంకోలా (జనాలు బోల్తా కొట్టేలా!)

ఇప్పుడు చేస్తామన్న యేర్పాటు బాగానే వుంది గానీ, ఇన్నాళ్లూ వారికి తెలియదా ఈ సంగతి? కొన్ని లక్షలో యెన్నో ఖర్చుపెట్టడానికి కాకపోతే, జనాల చెవుల్లో పువ్వులు పెట్టడానికి కాకపోతే, ఈ యేర్పాటు యెందుకు? మరి పాత చెక్కలు యేమి చేస్తారు?

వీటన్నింటికీ బదులుగా, వాకిళ్లని సన్నగా వుండే వాళ్లయితే ఇద్దరు, మీడియంగా వుండేవాళ్లయితే, 1న్నర మంది, కాస్త లావు వాళ్లయితే ఒక్కరే పట్టేలా మార్పు చేస్తే, ఇంక తోపులాటలు వుండవు కదా? దానికి ఖర్చు కూడా యెక్కువ కాదు--ఇంకా వెండి, బంగారు తాపడాల్లో బోళ్లు మిగులుతుంది!

చేస్తారా? చూద్దాం!

Wednesday, May 25, 2011

శ్రీవారి ఆలయం



సేవలూ, పురావస్తు

శ్రీసేవ "ప్రాజెక్ట్" నిపుణుల సూచనలు వివాదాస్పదమౌతున్న నేపధ్యంలో ప్రాజెక్టుని సమీక్షించి, తుదిమెరుగులు దిద్దడం, అనుమానాలని నివృత్తి చెయ్యాలని సాధికార మండలి భావిస్తోంది(ట) 07-02-2011 న.

శ్రీవారికి విరాళాలు ఇచ్చే 'భక్తులకు ' ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావాలని "తి తి దే" (అంటే సాధికార మండలి అని కవి హృదయం!) నిర్ణయించింది(ట). దాతలనుంచి విరాళాలు అందినవెంటనే, వారికి ప్రత్యేక "పాసు పుస్తకాలు" జారీ చేస్తారు(ట). 

తిరుమలలో క్రొత్తగా నిర్మిస్తున్న నిత్య అన్నదాన సముదాయాన్ని ఉగాదినాటికి అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు(ట). "రోటీ"లు వడ్డించడానికి కూడా యేర్పాట్లు చేస్తున్నారు(ట). (పులిని చూసి నక్క వాతలు పెట్టుకొంటే, వాతలు లేని నక్కని చూసి పులి తన చారలు "డిటర్జెంట్" తో తొలగించుకుందామనుకుందిట!). అంటే, షిరిడీ & తిరుమల ఆర్ హేండ్ ఇన్ హేండ్! (మన బుర్రోవాదుల ఆలోచనలు ఇలాగే వుంటాయి మరి!)

"మూడువేలమంది" (ఇదేదో అప్పుతచ్చు అనుకుంటా!) భోజనం చేసే సౌకర్యం వున్న నేపధ్యంలో, ఆ మేరకు సిబ్బంది నియామకం పై కూడా 'సమీక్షించారు'(ట). 

ఇంతవరకూ బాగానే వుంది. 

శ్రీవారి ఆలయాన్ని పురావస్తు శాఖవారికి అప్పగిస్తాము అని నిశ్చయించిన, (మళ్లీ "థూ నా బొడ్డు" అనుకొన్నారు!) సందర్భంలో, పురావస్తు శాఖ సంచాలకుడు, "నిత్యపూజలూ, వుత్సవాల్లో తమ జోక్యం వుండబోదు" అని ప్రకటించారట--"వొకవేళ ఆ దేవాలయం తమ పరిథిలోకి వచ్చినా"--అని! (ఆలూ లేదు, చూలూ లేదు, కొడుకు పేరు....అన్నట్టు!)

ఒకవేళ అలా జరిగినా, "ఆలయంలో ఓ మేకు కొట్టాలన్నా, తమ అనుమతి తీసుకోవాలంటూ జరుగుతున్న 'ప్రచారంలో' యేమాత్రం నిజం లేదని కూడా చెప్పారట వారు. (పురావస్తు శాఖవారి అధీనంలో వున్న యే నిర్మాణంలో అయినా, యెవరైనా, వాళ్లిష్టం వచ్చినట్టు మేకులు కొట్టుకోవచ్చా? అనే విషయం యెవరూ ఆయనని అడగలేదు మరి.) 

ఇంకా, ఆలయ పాలకమండలి ఛైర్మన్లు మారినప్పుడల్లా వాళ్ల ఇష్టానుసారంగా ప్రాచీన నిర్మాణాలని 'ధ్వంసం' చేస్తున్నారనీ, వేయికాళ్లమంటపం, వాహన మండపాల కూల్చివేతే ఇందుకు నిదర్శనమనీ కూడా అన్నారు(ట).

.....తరువాయి మరోసారి.

Tuesday, May 24, 2011

"అనంత.....




......సమస్యలమయం"!

ఆదికేశవుడి మానస (గర్భజనిత) పుత్రిక "ఆనంద......మయం" కార్యక్రమానికి 95 కిలోల బంగారం, 12 కోట్ల నగదూ వచ్చిందట--హైకోర్టు తీర్పు ఇచ్చేటప్పటికి.

12 కొట్ల నగదుకి సంబంధించిన దాతల/భక్తుల వివరాలు వున్నాయట. కానీ, బంగారానికి సంబంధించి, చాలావరకు వివరాలు లేవట. ఆదికేశవుడికి వ్రాసినా, వ్యతిరేక సమాధానమే వచ్చిందట!

సాధికార మండలి నిర్ణయం ప్రకారం, ఆ పథకం విరాళాలు ఇచ్చినవారికే తిరిగి ఇచ్చెయ్యడం గానీ, వారి "అనుమతితో" వేరే పథకాలకి మళ్లించడం గానీ చెయ్యాలట.

మరి పేర్లు వున్నా చిరునామాలు లేనివాళ్లనీ, పేర్లు కూడా లేనివాళ్లనీ యెలా 'సంప్రతిస్తా'రబ్బా? ఒక్క రిలయన్స్ సంస్థ మాత్రమే తన విరాళం గురించి సమాధానం ఇచ్చిందట. మిగిలినవాళ్లందరూ "నస్మరంతిగాళ్లు"!

మరి ఆ బంగారం అంతా యెవరిచ్చారో, యెందుకు, యెలా ఇచ్చారో, వసూలు చేసినవాళ్లు యెంతకి యెంత జమకట్టారో.....దర్యాప్తు చెయ్యాలా, అఖ్ఖరలేదా?

(ఈవోగారు యేమైనా చేస్తున్నారా, తట్టా బుట్టా సర్దుకొంటున్నారా?!)

లేక, "పవిత్రత" అనే చాపక్రిందకి నెట్టేద్దామా?  

Sunday, May 22, 2011

వేదపాఠశాల - 5



.....వేధింపులు

సోకాల్డ్ చర్చ గురించి ఇంకా చాలా వున్నా, ఈ మాత్రం చాలనుకుంటా. 

ఇంక చర్చా నిర్వాహకుడూ, చర్చకులూ "కన్వీనియెంట్" గా మరిచిపోయిన విషయాలు :

1. జరిగాయి అని ఆరోపించబడిన సంఘటనల పూర్వాపరాలు. అసలు యేమి జరిగింది అన్నదాని గురించి ఆయన యేమనుకుంటున్నాడో  ఈవోగారిని ప్రశ్నించి, ఆయన సమాధానాన్ని క్లిప్పింగు చూపించకపోవడం.

2. బాధితుడి/అతడి తండ్రి, బయటపెట్టిన మీడియా వాళ్ల--విజువల్స్ చూపించకపోవడం.

3. 150 మందికి మాత్రమే వుద్దేశించిన పాఠశాలలో 845 మందిని యెలా చేర్చుకొన్నారు? ఓ పెద్దగదికి 10 మంది చొప్పున వున్నా, మొత్తం 85 గదులూ, వుపాధ్యాయులకి--వందమంది విద్యార్థులకి ఒక వుపాధ్యాయుడు లెఖ్ఖవేసుకొన్నా, 9 గదులూ, ప్రథానాచార్యుడికో గదీ ఇలా లెఖ్ఖవేసినా, 100 గదులు కనీసం వుండాలి. అన్ని వున్నాయా? పోనీ పెద్ద పెద్ద హాళ్లు వున్నా, కనీసం ఓ యేడంతస్తుల భవనమైనా వుండాలి కదా? మరి వుందా?

4. విద్యార్థులకి నిద్రించడానికి డార్మెటరీల్లాంటి యేర్పాటు యేమైనా వుందా? నేలమీదే నిద్రిస్తున్నారా?

5. విద్యార్థులు యే క్లాసులవాళ్లు యే గదుల్లో/హాళ్లలో నిద్రించాలో యెవరు నిర్దేశించారు? లేక యెవరిష్టం వాళ్లదా?

6. హాస్టళ్లకి వార్డెన్లు యెవరైనా వున్నారా? వంట, భోజన శాలలనీ, క్లాసు రూములనీ, స్టడీ రూములనీ, లైబ్రరీలనీ యెవరు పర్యవేక్షిస్తున్నారు?

7. విద్యార్థుల అటెండెన్సు సంగతేమిటి? వాళ్లు చూపించిన విజువల్స్ ప్రకారం ఓ క్లాసులో గురువుతో వేదం వల్లెవేస్తున్నవాళ్లు 15 నుంచి 20 లోపు మంది మాత్రమే కనిపించారు. ఆ లెఖ్ఖన రోజూ కనీసం 400 కి పైగా క్లాసులు జరుగుతూ వుండాలి. మరి 9 యేళ్లుగా, 10 యేళ్లుగా విద్యార్థులు యెన్నిరోజులపాటు వేదాన్ని పఠించారు?

8. ఇకనుంచీ "ఎడ్మిషన్లు" రద్దుచేస్తున్నాము అని ఈవోగారు స్పష్టంగా ప్రకటించారు. మరి "ఎడ్మిషన్లు కొనసాగుతాయి. యెట్టి పరిస్థితుల్లోనూ ఆగవు" అని చర్చాపకుడు శ్రీనివాస్ కాలర్స్ కి హామీ పదే పదే యెలా ఇచ్చారు? జరుగుతున్నది యేమిటి? జరగబోయేది యేమిటి?

ఇలా వ్రాస్తూపోతే, అనేక ప్రశ్నలు. 

కొన్నిటికైనా సమాధానాలు రాబట్టగలమేమో చూద్దాం!

(యిప్పటికింతే!)


Saturday, May 21, 2011

వేదపాఠశాల - 4



.....వేధింపులు

బాధిత బిడ్డ తండ్రి మీడియావారిముందు ఆక్రోశిస్తే, మీడియావాళ్లు ఈవోగారిని ప్రశ్నిస్తేనే--ఆయనకి ప్రకటన చెయ్యక తప్పలేదు అని స్పష్టం అవలేదూ?

అలా అని విలేఖరులు యెవరినీ "సూటిగా" ప్రశ్నించకూడదు అనో, "వేలికేస్తే కాలికేసి...." యెలాగైనా "నిజాన్ని" రాబట్టడానికి ప్రయత్నించకూడదు అనో అంటే యెలాగ?

యెమర్జెన్సీ విధించాక, మన దేశంలో పత్రికల సెన్సార్ అమల్లో వుండగా, (వీటిగురించి వివరించాలంటే ఇప్పుడు జరిగేపని కాదు గానీ, తెలుసుకోడానికి యెవరి ప్రయత్నాలు వాళ్లు చెయ్యండి--యువకులు) బీబీసీ రిపోర్టరు మార్క్ టులీ ఇందిరాగాంధీని అలాగే ఇంటర్వ్యూ చేస్తూ, గుచ్చి గుచ్చి ప్రశ్నించేదాకా ఆవిడ "అవును. కొంతమంది నాయకులని నిర్బంధించాం" అని చెప్పేదాకా ప్రపంచానికి తెలీదు--జేపీ, మొరార్జీ వగైరాలు యేమయ్యారో!

మీడియాకి ఆ స్వేచ్చ లేకపోతే, ఇన్నిన్ని కుంభకోణాలూ గట్రా యెప్పటికైనా వెలుగు చూసేవా?

ఆం. భూ. వారే అనుకుంటా--టీవీవాళ్లు తమ టీపీఆర్ రేటింగులు పెంచుకోడానికి--అని దాఋణమైన ఆరోపణ చేశారు. చర్చకుల్లో యెవరు ఈ ఆరోపణ చేసినా అది వారి స్థాయికి తగదు. 

24 గంటల వార్తా ఛానెళ్లు కొంత "అతి" చేస్తున్న మాట నిజమే. కానీ, వాళ్లు మాత్రం కొత్తవార్తలే రాకపోతే యేమి చేస్తారు? పాడిందేపాటరా అంటారు. ఓ వార్తకి సంబంధించి ఓ ముఖ్యమైన విజువల్ 10 సెకండ్లదే వుంటే, వార్తాకథనం ఓ 40 సెకండ్లది వుంటే, ఆ విజువల్నే 4 సార్లు రిపీట్ చెయ్యక తప్పదుకదా?

మీడియా ప్రతినిధిగా ఆం.భూ.వారే యెందుకు ముందుకు వురికినట్టు? వారికి టీవీ ఛానెల్ లేదుకాబట్టా? వొకవేళ వుండి వుంటే వాళ్లు ఇంకేమైనా పొడిచేవారా?

ఇంకో కాలర్ అయితే, "మీరు ఈ చర్చ నిర్వహించడమే తప్పు. రేపు మీడియావాళ్లందరూ మీమీద దాడికి వస్తారు....ఇంకా రచ్చ అవుతుంది" అనే అర్థం వచ్చేలాగ మాట్లాడడం, నిర్వాహకుడు శ్రీనివాస్ పదే పదే "ఇది మీడియావాళ్లకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్నది కాదు......కేవలం నిజ పరిస్థితులని ప్రతిబింబించడం, పరిష్కారాలు సూచించడం" కోసమే నిర్వహిస్తున్నాము అనీ ప్రకటించారు.

చివరికి వాళ్లు సూచించిన పరిష్కారాలు....హళ్లికి హళ్లి, సున్నకి సున్న!

ఇంకో "పెద్ద" విషయం.....ఆ విద్యార్థులకి "బయటనించి" యెక్కువగా డబ్బు అందుతూండడంతో, సినిమాలూ అవీ చూస్తున్నారు అనీ, ఇంటర్నెట్లూ, డౌన్లోడ్లూ చేస్తున్నారు అనీ, సెల్లుల్లో ఫోటోలూ, వీడియోలూ గట్రా చూస్తున్నారు అనీ వెల్లడించారు. అంటే యెవరో "బయటి వ్యక్తుల" ప్రమేయం వున్నట్టేకదా? వాళ్లెవరో బయటపడడానికైనా దర్యాప్తులు జరగాలి కదా? 

పవిత్రమైనచోట దర్యాప్తులేమిటి అంటారా?
  
.....తరువాయి మరోసారి.

వేదపాఠశాల - 3



.....వేధింపులు

స్వామి చర్చకులచేత నిజాలు మాట్లాడిస్తున్నా, మళ్లీ మళ్లీ గుడుగుడు గుంచం అంటూ మొదటికే వచ్చి, 'గోరంతల్ని కొండంతల్ని' చెయ్యడం అంటూనే మాట్లాడారు.

వేదాలు పవిత్రమైనవి, తిరుమల, తిరుపతి పవిత్రమైనవి, వేద పాఠ శాల కూడా పవిత్రంగా వుండాలి కదా? అక్కడ తప్పు జరుగుతోంది అంటే, ఆ పవిత్ర వాతావరణం అక్కడ లేదు.....కల్పించబడలేదు అనే కదా?

మరి పవిత్ర పాఠశాల పేరుతో ఇలాంటివాటిని చాపక్రిందకి తోసెయ్యాలనా? (సత్యసాయి మీద హత్యా ప్రయత్నం జరిగి, బులెట్లు ఆయన వాటర్ బెడ్ ని చీలిస్తే, కొన్ని హత్యలు జరిగితే, అప్పట్లో ఇన్ని ఛానెళ్లు లేక, అవన్నీ చాపక్రిందకి తోసేశారు. అప్పుడు చర్యలు తీసుకొనుంటే, ఇప్పుడు ట్రస్టు మీదా, కొంతమంది మీదా ఆరోపణలకి ఆస్కారమే వుండేది కాదు. చరిత్ర మరోలా వుండేది!)

ఆం. భూ. వారు, అసలు వాళ్లకి కంప్యూటర్లు యెందుకండీ అనీ, ఇంకో ఆయన సెల్ ఫోనులెందుకు అనీ, ఇంకో ఆయన సెల్ ఫోనులు బ్లాక్ & వైట్ వి అయితే సరిపోతాయి, కలర్లూ కెమేరాలూ నిషేధించాలి అనీ--ఇలా!

అంటే, వేద విద్యార్థులు (వేదం మాత్రమే) చదువు పూర్తి చేసుకొని, జీవితంలో ప్రవేశించేవరకూ కూపస్థ మండూకాల్లా వుండాలనా? నలందా, తక్షశిల వగైరాల్లో అలాగే జరిగిందా?

గర్భాష్టమం లో వుపనయనం చేసి, విద్యార్జనకి పంపితే, ఆరేళ్లలో 15 వ పుట్టినరోజు నాటికి "సకల శాస్త్రాలూ" చదివి, కొలువులు వెతుక్కోడానికి విద్యాలయాన్ని వదిలేవారు. మరి ఇప్పుడు 9 యేళ్లనించీ, 10 యేళ్లనించీ వేదం మాత్రమే పూర్తి చెయ్యలేకపోతున్నారంటే, ఆ సిలబస్ లో లోపమా? లేక అధ్యాపకులదా?

ఇంకా, ఈవో గారు చక్కగా వ్యవహరించారు అనీ, బయటపెట్టకపోయినా వెంటనే దర్యాప్తు చేయించి "ఇద్దరు విద్యార్థులని" టీసీలు ఇచ్చి పంపించారు అనీ అన్నారు. ఓ కుటుంబంలో యెవరైనా ఓ చిన్న తప్పు చేస్తే, యజమాని వెంటనే మీడియావాళ్లని పిలవరుగా? అనీ, ఈవోగారు క్యూలైన్లూ వగైరా వ్యవహారాలే చూసుకుంటాడా, వేదపాఠశాలని కాపలా కాస్తూ కూచుంటాడా? అని కూడా అన్నారు. 

యెంత విడ్డూరం! 845 మంది విద్యార్థులు (ఈ అంకె వాళ్లు చెప్పిందే) కొన్ని సంవత్సరాలుగా అక్కడే వుంటూ, తింటూ, చదువుకుంటుంటే, కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న దేవస్థానం వారు, ఆ పాఠశాల నిర్వహణకి తగిన యంత్రాంగాన్ని యేర్పాటు చెయ్యలేదు అని స్పష్టం అవుతోంది కదా? దీనికెవరు బాధ్యులు?

నిన్న (20-05-2011) న స్థానిక రెండో పట్టణ పోలీసులు ఓ విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదుపై, ముగ్గురు విద్యార్థులమీదా, ప్రథానాచార్యుల మీదా కేసు నమోదు చేసి, ప్రథానాచార్యులు రామ మూర్తిగారిని స్టేషనుకి పిలిపించి విచారించారు అనీ ఇవాళ పేపరులో వార్త!

ఇంకా యెందుకు దాపరికాలు?

ప్రతీదానికీ దేవస్థానం యేమిచేస్తుంది? అని ఓ వెక్కిరింపు! టిక్కెట్లు బ్లాకులో అమ్మేసుకున్నా, వీఐపీలకి గంటలతరబడి క్యూలు ఆపేసి ధ్యానాలకీ, దర్శనాలకీ యేర్పాట్లు చేసినా, రాజకీయులు ర్యాలీలూ వగైరా చేసినా, అన్యమత ప్రచారం జరిగినా, లడ్డూ ప్రసాదాల్లో పంచదార బదులు వుప్పు వేసేసినా, ప్రసాదాలు హొటళ్లలో అమ్ముకున్నా.....ఇలా యేమి జరిగినా అన్నింటికీ దేవస్థానాన్ని అనేస్తారా?! అన్నట్టు లేదూ?

.....తరువాయి మరోసారి.

Friday, May 20, 2011

వేద పాఠశాల - 2



.......వేధింపులు

(మధ్యాహ్నం 12-00 నించి సాయంత్రం 5-00 వరకూ తీసెయ్యడం వల్లనేమో, రాత్రి 8-00 నించి 9-30 వరకూ కరెంటు పోలేదు. చర్చా కార్యక్రమాన్ని పూర్తిగా చూశాను.)

చర్చ బాగా.....నే....జరిగింది--మధ్య మధ్యలో ఆవేశపరుల కాల్స్ తో.

అసలు చర్చా విషయం--"సున్నితమైన.....కలిగించచ్చా?" అన్నదే "బయస్డ్" గా వుంది. 

చర్చకి వచ్చినవాళ్లు వుద్దండులే. ఆంధ్ర భూమి పత్రిక యెడిటరూ, దేవాలయ పరిరక్షణ కమిటీనో యేదో--దాని 'సమ్‌థింగ్' సౌందర రాజన్ అనే ఆయనా, ఓ మానసిక వైద్యుడూ, వైఖానస ట్రస్టు 'సమ్‌థింగ్' ఓ ఆచార్యులవారూ. 

అందరూ "కన్వీనియెంట్"గా మరిచిపోయిన విషయాలు కొన్ని వున్నాయి. అవి చివర్లో.

ముందు ఆ విషయం మీద దర్యాప్తు చెయ్యడానికి ఈవోగారిచేత నియమితుడైన డీయెస్పీ గారి ఫోన్ కోసం ప్రయత్నించారు కానీ "సాంకేతిక" కారణాలతో లైన్ కట్ అయ్యింది.

చర్చని ప్రారంభిస్తూ ఆం.భూ. వారు, సాధారణంగా ఇలాంటివి అన్ని హాస్టళ్లలోనూ జరుగుతూనే వుంటాయి అనీ, అయినా పత్రికల్లో ఆ సంస్థల పేర్లూ, బాధితుల పేర్లూ వ్రాయము అనీ, అనవసరంగా మీడియా "చిన్న"విషయాన్ని పెద్దది చేసింది అనీ అన్నారు. 

(మూడు నెలల క్రితమో యెప్పుడో జరిగిన విషయాన్ని, ఓ బాధితుడి తండ్రి బయటపెడితే, దాంట్లో "స్పెసిఫిక్"గా వేదపాఠశాలనీ, నిందితులనీ పేర్కొంటే, ఇంక "హిందువులకి చాలా పవిత్రమైన ఓ స్వామి గుడికి సంబంధించిన వేదపాఠశాలలో....." అంటూ రిపోర్టు చెయ్యవలసిన అవసరం యేమి వుంది? పైగా, ఇది కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకి సంబంధించిన విషయమాయె!)

అంతలో డీయెస్పీగారి కాల్ వచ్చింది. ఆయన ఖచ్చితంగా చెప్పారు--ఈవోగారు వెళ్లి దర్యాప్తు చెయ్యమంటే వెళ్లాననీ, అక్కడ జరిగిన విషయాన్ని రిపోర్టు చేశాను అనీ, బాధితుడి తండ్రి మాత్రం రిపోర్టు వ్రాసి ఇవ్వలేదు అనీ, తాను 'ఆధ్యాత్మిక వాతావరణాన్ని' కల్పించాలి అనీ, అన్ని వయసులవాళ్లనీ కలిపి ఒకే చోట నిద్రింపచేసే పధ్ధతిని మానుకోవాలనీ, కొంతమందిని కొత్తగా కడుతున్న భవనం లోకి మార్చాలనీ--వగైరా రికమెండేషన్లు చేశాను అనీ చెప్పుకొచ్చారు.

సౌందరరాజన్ గారు హాస్టలు మేనేజ్ మెంట్ మీద ఓ పుస్తకాన్ని కూడా వ్రాశారట. చూపించారు. ఆయన చక్కగా చెప్పాడు--హాస్టలు విద్యార్థులలో అసలు లైంగిక భావనలు తలెత్తకుండా వుండే "పవిత్ర" వాతావరణం కల్పించవలసిన బాధ్యత ఆ వుపాధ్యాయులమీద వుంటుంది అని. 

మానసిక వైద్యులు కూడా, "ఎడొల్సెంట్" వయసులో విద్యార్థులందరిలోనూ అలాంటి వికారాలు తలెత్తడం సహజమేననీ, వాటిని కంట్రోలు చెయ్యవలసిన బాధ్యత ఆ హాస్టలు వగైరా యాజమాన్యాలదేననీ చెప్పారు.

వైఖానస ఆచార్యులవారు ఈ వేదపాఠశాలకి వందేళ్లకి పైగా చరిత్ర వుంది అనీ, పదివేలకి పైగా విద్యార్థులు చదివి వెళ్లారనీ, 'యెప్పుడూ ఇలాంటివి జరిగినట్టు' వినలేదు అనీ, కాబట్టి ఇప్పుడు కూడా అలాంటివి జరిగినట్టు నమ్మఖ్ఖర్లేదు--అన్నట్టు చెప్పుకొచ్చారు.

మధ్యలో, ఓ వుపాధ్యాయుడు "ఇది వేదాలమీదా, హిందూ సంస్కృతి మీదా, దేవుడి మీదా జరుగుతున్న దాడి"--ఇలాంటి అర్థం వచ్చేలా మాట్లాడుతూ, ఇంకో ఆయన "నేనిక్కడే చదివి, వుపాధ్యాయుడిగా పని చేస్తున్నాను, అప్పటి ప్రిన్సిపాల్, అప్పటి అధ్యాపకులే వున్నారు, యేమీ మార్పులేనప్పుడు "అలాంటివాటికి" ఆస్కారమేలేదు అంటూ--క్లిప్పింగులు చూపించారు.

ఇంక కాలర్లయితే, తెగ ఆవేశపడిపోతూ, మా అబ్బాయి యేడాది నుంచీ, మా అబ్బాయి 9 యేళ్లనుంచీ--ఇలా అంటూ, ఒకళ్లయితే, మీఅబ్బాయికూడా అలాగేనా అని అందరూ అడుగుతున్నారు అంటూ, మీడియా వల్లే ఇదంతా, గోరంతలు కొండంతలు చేశారు అంటూ వాపోయారు. 

వీళ్లెవరూ ఒక్క విషయం ఆలోచించినట్టు లేదు--వాళ్ల పిల్లలు కూడా అలాగే వేధింపులకి గురయివుండీ చెప్పడానికి భయ పడ్డారేమో అనిగానీ, ఇన్నాళ్లూ జరగలేదు, ఇకముందు వాళ్లకీ జరిగితే మన పరిస్థితి యేమిటి అనిగానీ! (పాపం బాధితుడి తండ్రి 'మా అబ్బాయినీ, వాడి చెల్లెలినీ ఇంట్లో వదిలి బయటికి వెళ్లలేకపోతున్నామండీ' అని బాధపడ్డాడంటే, ఆయన పరిస్థితికి వీళ్ల జవాబేమిటో ఆలోచించారా?)

పైగా "పవిత్ర" పాఠశాలమీద అనవసర ప్రచారం అంటారు! (అదేదో సెంటిమెంటల్గా ఫీలయిపోతూ!)

.....తరువాయి మరోసారి.

Thursday, May 19, 2011

వేద పాఠశాల




"......క" వేధింపులు

తిరుమల "వేధ" (ఇలాగే అంటున్నారు ప్రతీ వి & ఎం న్యూస్ రీడర్లూ, రిపోర్టర్లూ!) పాఠశాలలో విద్యార్థులపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయట. 

ఇప్పుడు బయటికి వచ్చిందిగానీ, ఓ మూడు నెలల క్రితమే మన ఈవో కృష్ణారావుగారు దర్యాప్తు చేయించి, నలుగురు సీనియర్ విద్యార్థులనీ, ఓ అధ్యాపకుణ్నీ ఇంటికి పంపించేశారట! క్లైమాక్స్ అయిపోయాక వచ్చే పోలీసుల్లా మన మీడియావారూ తయారయ్యారు! ఆ తండ్రిని అలా ప్రశ్నించి, ఆయన గుడ్లనీళ్లు కుక్కుకుంటుంటే, జాలి తప్ప మనం యేమి పడగలం?

అసలు 150 మందికి సరిపోయే పాఠశాలలో 800 మందికి పైగా యెలా చేర్చుకొన్నారు? "ఇకనుంచీ" ప్రవేశాలు యెందుకు ఆపేశారు? ఇప్పుడు వున్నవాళ్ల సంగతేమిటి?

కృష్ణారావు ని యెక్కడికి పంపించాలా అని ఆలోచిస్తూందట ప్రభుత్వం--ఇవాళే టీవీలో విన్నాను.

మరింకేం! మీ తైనాతీనొకణ్ని వేస్తారో, మళ్లీ బోర్డుని పునరుధ్ధరించి, కావూరి నే వేస్తారో--కానివ్వండి! 

మా సామాన్యులకి పోయేదేమీ లేదు--శ్రీవారి దర్శనం తప్ప! (ఆ తరవాతేమి చేస్తారో మీ యిష్టం!)

(సున్నితమైన విషయాలని పబ్లిసిటీ చేసి, పసివాళ్లమీద ప్రభావం కలిగించచ్చా? అంటూ ఇవాళ (20-05-2011) రాత్రి 8-00 గంటలకి భక్తి ఛానెల్లో ఓ కార్యక్రమం ప్రసారం చేస్తారట. అందులో యేమి చెబుతారో చూడాలి మరి. సరిగ్గా ఆ సమయానికే మాకు కరెంటు పోతుంది!)


Saturday, May 7, 2011

శ్రీగిరి శ్రీపతి



.....దర్శనాలు

మూడేళ్లకి పైగా మనం మొత్తుకుంటూంటే, ఇప్పుడు ఈవోగారు స్వయంగా అదేదో "మూవింగ్ ప్లాట్ ఫామ్" (తెలుగులో కదిలే తివాచీ అంటున్నారు) ని స్వయంగా పరీక్షించారట--శ్రీవారి "నమూనా" దేవాలయంలో! 

ఆ తివాచీ మీద 12 మంది వెళ్లి, (వాళ్లే దాన్ని నడుపుకొంటూనో....డ్రైవరు వుండాలో?) కేవలం 10 నుంచి 20 సెకన్లలో శ్రీవారి దర్శనం చేసుకోవచ్చట. "మహాలఘు" రోజుల్లో దీన్ని ప్రవేశపెట్టచ్చేమో అని వారి ఆలోచనట!

దాని ఖరీదెంతో, ఓ లక్ష మందికి దర్శనం కల్పించడానికి అలాంటివి యెన్ని కావాలో, ఒకటే అనేక "ట్రిప్పులు" వేస్తుంటే, ఓ ఇరవై గంటల్లో (ఓ నాలుగ్గంటలు శ్రీవారిని నిద్రపోనిచ్చినా) యెంతమంది దర్శనం చేసుకోగలరో......వగైరాల లెఖ్ఖలకి మీ క్యాలిక్యులేటర్లు బయటికి తీయండి. (కేవలం 37,200 మంది మాత్రమే అని జవాబు వస్తుంది!)

పైగా, దాన్ని యెక్కడనుంచి యెక్కడవరకూ ప్రవేశపెడతారో తెలీదు. మహర్ద్వారం నుంచా, ధ్వజ స్థంభాలనుంచా, ఆళ్వారులనించా, అదేదో పడి నుంచా, జయవిజయులనుంచా.....యేమో!

మరి దారిలో వుండే యెత్తుపల్లాలమాటేమిటి? మెట్ల మాటేమిటి? ద్వారాల తలుపులు మూయవలసి వస్తే మాటేమిటి? 

ఈవోగారు కాదేమోగానీ, యెవరో యెవరితోనో "కుమ్మక్కయ్యారు" అనిపించడంలేదూ?

అప్పుడే టీవీలవాళ్లు అది "ఆగమ శాస్త్రానికి విరుధ్ధమా?" అని చర్చ. కొంతమంది పండితులు ఖచ్చితంగా విరుధ్ధమే--యెందుకంటే, శ్రీవారి దర్శనం "భూమి మీద నిలబడే" చేసుకోవాలి అంటూ! (అక్కడికి ఆ ప్లాట్ ఫామ్ యెక్కినవారు యేదో అంతరిక్షంలోకి వెళ్లిపోయినట్టు!)

అసలు "ఆగమ శాస్త్రాలకీ", దర్శనం చేసుకొనే భక్తులకీ సంబంధం యేమిటి?

ఈవోగారూ! ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలకి అనుమతించవద్దు. 

మాక్కావలసింది--ఓ "కన్వేయర్ బెల్ట్" లాంటిది--మహర్ ద్వారం గుండా--అవసరమైతే, వెయ్యికాళ్ల మండపం వుండే స్థానంలో బహుళ అంతస్తుల అండర్ గ్రవుండ్ క్యూలైన్లు కట్టి అయినాసరే! (దీంట్లో వున్న సౌలభ్యం ఇంకోటి తెలుసా? భక్తులు తమ "పృష్ట" భాగాన్ని శ్రీవారికి చూపించరు! మహమ్మదీయులు తమ "దర్గా"లలో ఇలా యెవరినీ అనుమతించరు! భక్తులు "వెనక్కి" నడవాల్సిందే!)

యెన్ని గంటలూ, యెంతమందీ లెఖ్ఖలు కాదు. 

వెంటనే ప్రణాళిక రచించండి. లేదా రచింపచెయ్యండి! (చేతకాకపోతే--సో కాల్డ్ ఆగమ పండితుల్ని కాదు--ఎల్ & టీ వారినో, జీ ఎం ఆర్ వారినో సంప్రదించండి! ఆ మాత్రం ఖర్చు స్వామి భరించగలడు!)

వింటారా?

Tuesday, April 12, 2011

శ్రీగిరి శ్రీపతి




......వుత్సవాలు


"పార్వేట" వుత్సవాలు నిషేధించాలి.

శ్రీనివాసుడు క్షత్రియుడు. ఆయన ఆ రోజుల్లో, కౄర మృగాలని వేటాడేవాడు. "కౄర" అంటే ఇప్పటి ఇంగ్లీషులో "వైల్డ్" అని. యేనుగు కౄర మృగమా? అప్పట్లో అవును. యెందుకంటే, యెంత శాకాహారి అయినా, మదం యెక్కినప్పుడు విచక్షణలేకుండా అందర్నీ తొక్కేస్తుంది. అందుకని దాన్ని వేటాడవచ్చు!

మరి ఇప్పుడు? కలప అక్రమ రవాణాతోపాటు, నేటి "క్షత్రియులు" (ఆ కులాన్ని అనడం లేదు) కుందేళ్లనీ, నెమళ్లనీ, లేళ్లనీ, నీటి కొంగల్నీ--ఇలా అన్నిటినీ వేటాడి, ఆనందిస్తున్నారే! వీళ్లకేమి రోగం?

నిస్సహాయుల్నీ, అసహాయుల్నీ వేటాడడం తప్పు. అందుకనే ఈ "పార్వేటల్ని" నిషేధించాలి.

రేపు రాయపాటి వస్తే యేమి జరుగుతుందో చూస్తూనే వుందామా? లేక "ఈజిప్టు" తరహా యేమైనా.......?

(ప్రతీవాడికీ ఇదొకటి లోకువ అయిపోయింది. ప్రతీచోటా "ఈజిప్టు" తరహాకి అమెరికా అన్ని కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టగలదా??!! అని ఆలోచించరు!)

==> తితిదే "దాస సాహిత్య" ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పగడాల ఆనందతీర్థాచార్యులు ప్రతి జిల్లాలో భజన మండళ్లు, కోలాట బృందాలు యేర్పాటు చేస్తారట. బృందంలోని వారికి ధోవతి, పంచె (!!??), భజన సామాగ్రి అందజేస్తారట. కర్ణాటకలో ఇప్పటికే యెక్కువ సంఖ్యలో భజన మండళ్లు యేర్పాటు చేశారట! దేవుడిసొమ్ము--పిచ్చి ప్రాజెక్టుల పాలు అనాలేమో!

Wednesday, January 12, 2011

శ్రీగిరి శ్రీపతి

(ప్రసాద) లడ్డూలు

ఆ మధ్య శ్రీవారి లడ్డూలు "వుప్పు కషాయం"గా వున్నాయని ఓ ఫిర్యాదు రాగా, ఓ 600 లడ్డూల్లో ఆ విషయం నిజమేనని తేల్చి, అమ్మకం ఆపేశారట. సంబంధిత కాంట్రాక్టరు, ఓ ఇరవై పైగా యేళ్లనించీ లడ్డూలు చేయిస్తున్నా, ఇలా యెప్పుడూ జరగలేదు అన్నాడట. సరే.

సంబంధిత అధికారులు కొంతమంది, 'వుగ్ర్తాణం లోంచి పొరపాటున చక్కెరకి బదులు వుప్పు తెచ్చివుంటారు' అనీ, 'వుగ్రాణంలో వుప్పు ప్రసక్తిలేదు....గోవిందస్వాములు తమ ఇరుముడిల్లో తెచ్చిన వుప్పునే ఆ లడ్డూల్లో వాడి వుంటారు' అనీ--ఇలా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు.

వుగ్రాణంలో 'రాళ్ల'వుప్పు వుంటుందా? పొడి వుప్పు వుంటుందా? చక్కెర 'ముడిగా' వుంటుందా, పొడిగా వుంటుందా? 20 యేళ్లకి పైగా లడ్డూలు చేస్తున్నవాళ్లకి--రాళ్ల వుప్పుకీ, ముడి చక్కెరకీ, మెత్తటి వుప్పుకీ, మెత్తటి చక్కెరకీ తేడాలు తెలియవా? 

సరే.....గోవిందస్వాములు యెన్ని కేజీల వుప్పుని సమర్పించారు? యెక్కడ? అది వుగ్రాణానికి యెలా చేరింది? అలాకాదు అంటే, నేరుగా ఆ పోటు కాంట్రాక్టరుకెలా చేరింది? లడ్డూల్లోకెలా చేరింది? ఇవన్నీ ప్రశ్నలే!

ఇవాళ లడ్డూల్లో 'మేకులు' వచ్చాయంటున్నారు! సంబంధిత కాంట్రాక్టరు, 'లవంగాలనుకొని, మేకులు తెచ్చారు' అంటాడేమో!

చూద్దాం! 

ఈవోగారూ! నాలుగుకళ్లతో పరిశీలిస్తారా?

Saturday, January 8, 2011

శ్రీగిరి శ్రీపతి

.....దేవస్థాన లీలలు

తిరుపతి-షిర్డీ భాయి భాయి బాగానే కొనసాగిస్తున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా (టిక్కెట్టు తీసుకునే) ప్రత్యేక దర్శనాలని రద్దు చేశారు.

అన్నట్టు సాయి మందిరానికి రూ.32 కోట్ల విలువైన ఆభరణాలు వున్నట్టు ఆడిట్ వాళ్లు తేల్చారట. వార్షిక అదాయం 164 కోట్లట!

గత కొన్నేళ్లుగా మాత్రమే ఆభరణాలు వస్తున్న సాయికే 32 కోట్లు వుంటే, కొన్నివందలయేళ్లుగా వున్న స్వామికి కేవలం 51 కోట్లే మరి! 

సంతోషిద్దాం.....ఇప్పటికైనా అని.

శ్రీవారి బంగారు తాపడం చేసిన రథానికి వుండే స్వచ్చమైన బంగారంతో చేసిన, కోటి రూపాయలు విలువ చేసే 'గొడుగు' ని, రథం వున్న రేకుల మండపం దక్షిణవైపు రేకుని 'కత్తిరించి' యెవరో దొబ్బేశారట! అదికూడా, ఆ ప్రక్కనే జరుగుతున్న పెద్దజీయర్ మఠం కార్మికులు చెపితే, అధికారులకి తెలిసిందట! యెంత భద్రతో కదా?!

పైగా, నిన్న 07-01-2011 న, 'మహా అయితే ఆ రేకుల గొడుగు విలువ ఓ నలభై వేలే వుంటుంది.....రేపు రథ సప్తమికల్లా ఓ కొత్త గొడుగు చేయించి పారేస్తామంటున్నారు అధికారులు!' అని హామీ ఇస్తూ, పుండుమీద కారం చల్లుతున్నాడు రాష్ట్ర శాసన మండలి 'హామీల కమిటీ' అధ్యక్షులు బత్యాల చెంగల్రాయుల వారు! (యెన్ని కోట్లతో చేయిస్తారో చెప్పలేదు.....మామూలుగానే!)

యేడూ కొండల స్వామీ.......!

....................................................................................................................................................................

ప్రకటన :

శ్రీ దత్త చరితం

తొలి జగద్గురువు, విఙ్ఞానపు కాంతులను విరజిమ్మిన క్రాంతి పుంజం, అత్రి, అనసూయల గర్భ సుక్తి ముక్తాఫలం--శ్రీ దత్తాత్రేయుడు. ఆపురూప గురుహారం ఈ శ్రీ దత్త చరితం. 

ఈ డాక్యుమెంటరీ కి నిర్మాత, కెమేరామన్ : చిట్టావఝల కృష్ణ; వ్యాఖ్యనం/దర్శకత్వం : చక్రావధానుల రెడ్డప్ప ధవేజీ; సంగీతం/గానం : గోగులమండ రాజు & మోహిని కుమారి; సహ నిర్మాత : సవరం కృష్ణానందం. ప్రవచనం : 'భారతీపుత్ర ', కడిమెళ్ల వర ప్రసాద్ 'గురు సహస్రావధాని '. 

(దత్తచరిత్ర యథాతథంగా, కూర్పులూ, చేర్పులూ లేకుండా చెప్పబడింది--అనుచిత వ్యాఖ్యలు లేకుండా! దత్తపీఠలూ, క్షేత్రాలూ వగైరలు కూడా చూడండి.) 

ఈ సీడీలు కొనండి....ఒక్కొక్కటీ రూ.59/- మాత్రమే! ఈ ప్రకటన చూసి, ఆర్డరు ఇచ్చినవారికి రూ.54/- మాత్రమే. 

చిట్టావఝల కృష్ణ పేరున "మాకు అందేలా" కేరాఫ్ నర్సాపూర్ బ్రాహ్మణ సమాఖ్య, నరసాపురం, ప.గో.జిల్లా, 534275 కి (మనియార్డరు/పోస్టల్ ఆర్డరు/డీడీ) యెలాగైనా పంపించండి....ఓ సీడీ సొంతం చేసుకోండి! (ఇందులో వ్యాపారం లేదు.)

మీరు కోరితే, మీ మెయిల్ ఐడీ కి వీడియో పంపించడానికి ప్రయత్నిస్తాము.