Monday, July 27, 2009

శ్రీగిరి శ్రీపతి

డైరీ

తఱచుగా శ్రీవారికి భక్తులు సమర్పించే విలువైన కానుకల్ని తేదీలవారీగా ఈ డైరీలో అప్ డేట్ చేస్తూ వుంటాను. చదువరుల సౌకర్యం కోసం! 10-02-1513

శ్రీకృష్ణ దేవరాయల చే కెంపులు, పచ్చలు, నీలాలు, మాణిక్యాలు, వైడూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్ర కిరీటం

02-05-1513 నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణ ఖడ్గం, భుజకీర్తులు, 30 తీగల పతకం

తంజావూరు రాజు పాండ్యన్ ఓ కిరీటం

మైసూరు మహారాజు, తదితరులు--108 బంగారు పుష్పాలు, 32 కిలోల సహస్రనామహారం, నాలుగు కిలోల చతుర్భుజ లక్ష్మీ హారం, 7 కిలోల రత్నాల మకరకంఠి 13.6 కిలోల నవరత్న కిరీటం, 500 గ్రాముల అరుదైన గరుడ మేరు పచ్చ ఆభరణం

రతన్ టాటా, అంబానీలు, విజయ్ మాల్యా, గోయెంకా మొదలైనవారు--1940 లో వజ్ర కిరీటం, 1954 లో వజ్రాల హారం, 1972 లో వజ్రాల శంఖు చక్రాలు, కర్ణపత్రాలు, 1974 లో కటిహస్తం

1986 లో 5 కోట్ల విలువైన వజ్రాల కిరీటం తి.తి.దే వారు చేయించారు.

ఇప్పటికి మూలబేరానికి 8 కిరీటాలు, ఉత్సవ బేరాలకి 7 కిరీటాలు వున్నాయి.

13-11-2008

ఆపోలో ఆస్పత్రుల అధిపతి శ్రీ ప్రతాప్ సి. రెడ్డి చేత, 5 కిలోల బరువూ, 80 లక్షల విలువా చేసేఅభయ, కటి హస్తాలు. 18-11-2008 తిరుపతి శాసన సభ్యులు వెంకటరమణ--పద్మావతి అమ్మవారికి--ఇరవై లక్షల విలువైన 2 కేజీల బంగారంతో తాపడం చేసిన 'అశ్వ వాహనం' (ఇంతకు ముందు రెండు మూడు రోజుల క్రితం, ఇంకో కానుక యెవరో ఇచ్చారు గాని, వివరాలు వెదక లేక పోయానుఅందుకే, ఇదే మొదటి నమోదు!) 17-1-2009ఫాబ్ టెక్ కంపెనీ వారు రూ. ఒక కోటి విరాళం. ఇంతకుముందు రూ. రెండు కోట్లు విరాళమిచ్చిన స్విస్ మహిళ ఎలిజబెత్ జెయిగ్లర్. 09-03-2009 --వీరెంద్ర మహేష్ గౌడ్ అనే ఆయన ముంబాయి నించి--51 లక్షల నగదు--అన్నదానం ట్రస్టు కోసం వినియోగిస్తామని ఈ వో ప్రకటన! (ఈ మధ్యలో కొన్ని కానుకలు వచ్చాయి గానీ, వాటిని యెప్పటికప్పుడు ఇందులో చేర్చలేకపోయాను! మీకెవరికైనా తెలిస్తే, నాకుచెప్పెనాసరే, కామెంట్ లో వ్రాసినా సరే!--మీ యిష్టం) 11-06-2009--కర్ణాటక ఎమ్మెల్యే, ఇనుపఖనిజం ఫేం 'గాలి జనార్దన రెడ్డి ', 45 కోట్ల ఖర్చుతో, ఓ సరికొత్త బంగారు, వజ్ర కిరీటం!

25-07-2009--నవీన్ జిందాల్ దంపతులు--రూ.46 లక్షల విలువ చేసే బంగారు శంఖుచక్రాలు, తిరుచానూరు పద్మావతీ అమ్మవారుకి ఎస్ ఆర్ కన్నన్ అనే ఆయన రూ.1.50 లక్షల విలువ చేసే బంగారు హారం.

01-08-2009

న్యూఢిల్లీ కి చెందిన అజయ్ మోడీ దంపతులు ప్రతిపాదిత కంటి ఆస్పత్రి కోసం రూ. 50 లక్షలు విరాళం

Monday, July 13, 2009

ఆపధ్ధర్మం

నీ కొండకు నీవే రప్పించుకో—11
ఇంతకు ముందు టపాల్లో (నీ. కొం. నీ. ర--4 లో) ఓ సూచన (హింట్) ఇచ్చాను—ఓ ఘోరమైన నిజం మీకు చెపుతాను అని—గుర్తుందా?
ఇప్పుడు చెపుతున్నాను!
నేను మొదటిసారి శ్రీపతికి వెళ్ళినప్పుడు (1975 లో) ప్రత్యేక దర్శనం టిక్కెట్టు 25 రూపాయలని గుర్తు. కొత్తగా పెల్లైన మా జంట, మా అమ్మగారితో వెళ్ళామని చెప్పానుగా!
అప్పట్లో నా వుద్యోగం విజయవాడలో—తిరుమల ఎక్స్ ప్రెస్ లో కొండ మీది దాకా టిక్కెట్ లు ఇచ్చేవారు—అలా శ్రీపతి చేరి, అక్కడ వెంటనే దేవస్థానం వారి మినీ బస్సు లో (అప్పుడు టిక్కెట్ 3 రూపాయలు అని గుర్తు!) రైల్వే వారి టిక్కెట్ తోనే కొండ మీదికి చేరాము.
(అంతకు కొద్ది రోజుల ముందే రెండో ఘాట్ రోడ్డు—పైకి వెళ్ళే ఇప్పటి మొదటి ఘాట్ రోడ్డు ప్రారంభించబడిందట).
బస్సు దిగగానే యెదురుగా దేవస్థానం వారి ‘ఉచిత సత్రం’, (అందులో వుండడానికే కాదు, వండుకోడానికి పొయ్యీ, కట్టెలతోసహా పాత్రలూ ఉచితం గా ఇచ్చేవారు—బియ్యమూ, సంబారాలూ మనమే తీసుకెళ్ళాలి), యెడం పక్కన ఓ చిన్న బూత్—అక్కడ ముగ్గురు, నలుగురు వున్న క్యూ—అక్కడ కాటేజీ లు కేటాయించేవారు—మాకు ఆ పక్కనే వున్న ‘శేషాద్రినగర్’ లో ఓ కాటేజీ కేటాయించి, ఒక రోజుకి 5 రూపాయలు అద్దెగా వసూలు చేశారు.
ఆ ప్రక్కనే ఇంకో క్వార్టరు దగ్గర ఒక పెద్ద గాడ్రెజ్ తాళం కావాలంటే, 20 రూపాయలు ‘డిపాజిట్’ కట్టమన్నారు—యెమో! మనం దైవ దర్శనానికి వెళ్ళిన సమయం లో యెవరైనా మన సామాన్లు దొబ్బేస్తారేమో అని భయపడి, డిపాజిట్ చెల్లించి, తాళం కప్పా, దానికి వున్న రెండు తాళాలూ (డూప్లికేట్ కీస్ అన్నమాటా) తీసుకొని ‘ఈ కాటేజ్ యెక్కడా?’ అని కనిపించినవాళ్ళందరినీ అడుగుతూ, పక్కనే ఓ యాభై అడుగుల దూరం లో వున్న కాటేజీ కి చేరాము.
స్నానాలు ముగించి, పెళ్ళిలో ధరించిన పసుపు బట్టలు కట్టుకొని, ఈ పక్కా ఆపక్కా వున్న చిన్న చిన్న దుకాణాల మధ్య సన్నని దారిలో, అందరు భక్తులతో గుడి దగ్గరకి బయలుదేరాము.
కోనేరులో కాళ్ళు కడుక్కొని, పైకి రాగానే, పంచే, చొక్కా వేసుకొన్న ఓ పెద్దమనిషి మా వెంట పడ్డాడు—ముగ్గురికీ త్వరగా దర్శనం చేయిస్తాను—పాతిక రూపాయలిప్పించండి—లడ్డూలు కూడా మీకెన్ని కావాలంటే అన్ని ఇప్పిస్తాను (అప్పట్లో లడ్డు ధర 2 రూపాయలు!).
‘నమ్మకమేనా?’ అని అడిగితే, ‘అన్నీ అయిన తరవాతే డబ్బులివ్వండి సార్!’ అన్నాడు. సరే అనగానే, గుళ్ళో మిమ్మలని అడిగితే, ‘నెల్లూరు నించి వచ్చామనీ, ఫలానా రెడ్డిగారి తాలూకా’ అని చెప్పమన్నాడు!
అలాగే అనగానే, మహర్ద్వారం లోపలకి తీసుకెళ్ళి అక్కడ అప్పటికే వేరే క్యూలో వున్న ఓ పదిమంది వెనకాల మమ్మల్ని నిలబెట్టాడు. ఈ క్యూని, సర్వదర్శనం క్యూలో కలిపేస్తున్నారు! మాముందువాళ్ళు కొంతమంది క్యూలోకి వెళ్ళిపోయారు.
కొంతమందిని బయటికి గెంటేశారు—అక్కడ వున్న దేవస్థానం వుద్యోగి వాళ్ళ సమాధానాలు విని, ‘అబద్ధం ఆడకండి—దేవుడి ముందు వున్నారు!' అని డబాయించగానే, నీళ్ళు నమిలారని!
నా వంతు వచ్చింది—చెప్పమన్నట్టు చెప్పగానే, ‘ఆ రెడ్డిగారు యెలా తెలుసు?’ అనడిగాడు—‘మా నాన్నగారి స్నేహితుడు’ అన్నాను. ‘నెల్లూరులో వాళ్ళ ఇల్లు యెక్కడ?’ అని అడిగితే, ‘బస్ స్టాండ్ దగ్గర పళ్ళకొట్టు ప్రక్కన రోడ్డులో వెళితే, తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాము!’ అన్నాను—‘సరే, వెళ్ళండి అని మమ్మల్ని క్యూలో కలిపేశాడు!
తరవాత, నిక్షేపం గా లడ్డూలు కూడా కొనుక్కొని, బయటకి వచ్చి, వాడికి పాతికా చేతులో పెట్టాను.
ఇదేదో ‘చేసిన పాపం చెపితే పోతుందని’ చెప్పలేదు—యెందుకంటే, అది పాపం కాదు—ఆపద్ధర్మం గా ఓ అబద్ధం ఆడినా, అది స్వామిని చూడడానికే కదా? పైగా, అక్కడున్నవాళ్ళు రకరకాల మార్గాల్లో ఆ క్యూలో చేరిపోతున్నప్పుడు, మనం మాత్రం దానికి విరుగుడు యెందుకు ప్రయోగించ కూడదు? ఆని!
అదీ సంగతి!

Sunday, July 5, 2009

......దర్శనాలు

సర్వ ‘సుదర్శనం’
సర్వదర్శనం సమయాలు ఓ నాలుగు ఐదు గంటలైనా పెంచాలని దేవస్థానం ఆలోచిస్తోందట!
యేకాంత సేవల కి అవకాశం కల్పిస్తారట!
ఆ ప్రకటనలో ఒక్క మాట అర్థం అయితే ఒట్టు!
అన్నట్టు మన కొత్త ఈ వో సామాన్యుడిలా వైకుంఠం కాంప్లెక్స్ లో ప్రయాణించి, భక్తుల సాధక బాధకాలు తెలుసుకున్నారట!
అది ఆదర్శం గా తీసుకొని, మిగిలిన దేవస్థానం వుద్యోగులు కూడా, అదే క్యూ కాంప్లెక్స్ లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నారట!
ఇక ఆ కాంప్లెక్స్ లోని భక్తుల్ని కూడా ఆ శ్రీపతే రక్షించాలి!