Sunday, October 24, 2010

శ్రీగిరి శ్రీపతి

శ్రీవారి డాలర్లు

శ్రీవారి డాలర్ల కొరత త్వరలో తీరనుందట. తి తి దే ఆర్థిక సలహదారు, ముఖ్య నిఘా భద్రతాధికారీ ముంబాయిలోని మింట్ కు వెళ్లి, 600 కిలోల బరువుగల డాలర్లని సరఫరా చెయ్యడానికి యేర్పాట్లు చేసి వచ్చారట.

ఆంధ్రా బ్యాంకు ద్వారా 10, 5, 2 గ్రాముల డాలర్ల విక్రయానికి యేర్పాట్లు చేశారట. మరో రెండు సంవత్సరాల అవసరాలకి అవి సరిపోతాయట.

హుండీకి చేరే బంగారాన్ని స్టేట్ బ్యాంకులో వడ్డీకి డిపాజిట్ చేస్తున్నారనీ, అలా ఇప్పటికి 'వెయ్యి కిలోల' బంగారాన్ని డిపాజిట్ చేశారనీ వార్త వచ్చింది. అది ఆభరణాల రూపం లోనా, ఇటుకలూ, బిస్కెట్ల రూపం లోనా తెలియరాలేదు!

Tuesday, October 12, 2010

శ్రీగిరి శ్రీపతి

"కంచి" కిరీటం

మన కంచి పీఠం స్వామికి బాగా "డబ్బు" చేసేసిందనుకుంటా--యెలా తగ్గించుకోవాలో యెవరూ చెప్పట్లేదేమో!

2.5 కోట్లతో, 14.5 కిలోల బంగారం, వజ్రాలతో వెంకన్నకి ఓ కిరీటం చేయించారట.

రేపు 21 న అందజేస్తారట.

(మళ్లీ రేపు తి తి దే నుంచి యే పథకం కోసం యెంత టెండరు పెడతారో?)

Sunday, October 10, 2010

శ్రీగిరి శ్రీపతి

డాలర్ల కొరత

తి తి దే వద్ద నిల్వలు లేకపోవడం తో రెండు నెలలుగా ఐదు గ్రాముల డాలర్లు విక్రయించడంలేదట.

గతం లో శ్రీవారి హుండీ ద్వారా వచ్చిన చిన్నా చితకా ఆభరణాలని, రాళ్ళు అవీ తొలగించి, బంగారాన్ని కరిగించి మింట్ లో డాలర్ల ముద్రణా, సరఫరా జరిగేవి.

ఇప్పుడు బంగారం కరిగింపులో అక్రమాలు జరుగుతున్నాయని, ఈ వో కృష్ణారావుగారు బంగారాన్ని బ్యాంకుల్లో వడ్డీకి డిపాజిట్ చెయ్యడానికే మొగ్గు చూపారట. అందుకే కొరత అంటున్నారు.

మరి అన్ని వేలో, లక్షలో చిన్నా చితకా ఆభరణాలని యే యే బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తున్నారో, వాటి వివరాలు యెక్కడ యెలా నమోదు అవుతున్నాయో--పత్రికలు వ్రాయలేదు.

బంగారం ఇవ్వఖ్ఖర్లేకుండా, మింట్ వారే వారి బంగారం తో డాలర్లు తయారు చేసి సరఫరా చేసేలా వొప్పందాలకి ప్రయత్నాలు జరుగుతున్నాయట.

ఈ ప్రయత్నాలు ఫలించకపోతే, డాలర్ల విక్రయం పూర్తిగా నిలిచిపోయే అవకాశం వుందట!

అసలు ఈ డాలర్ల పథకం యెవరిని వుధ్ధరించడానికి?

యేమో! స్వామికే తెలియాలి!

Friday, October 1, 2010

ఆర్జితపాపం

ఆరు పిడికెళ్లే

ఆర్జిత సేవల టిక్కెట్ల కుంభకోణం లో "ఆ ముగ్గురిదే" హవా అని దేవస్థానం నిఘా సంస్థ నిగ్గు తేల్చిందట. వీళ్ల హవా
కూడా--చైర్మన్ గారి తరవాతేట! (పాపం ఆయన్నేమీ అనకూడదట లెండి--వీళ్ల ముగ్గురిమీదే చర్యలు తీసుకోవాలట.)

గత రెండేళ్లలో 14 మంది బోర్డు సభ్యులకి విచక్షణకోటా క్రింద లభించే టిక్కెట్లలో, ఆది కేశవుడు 16,463 టిక్కెట్లు
మంజూరు చేయించుకోగా, సుబ్రహ్మణ్యం 8,800; అంజయ్య 8,539; యాదయ్య 6,962; మాత్రమే మంజూరు చేయించుకొని, యేజంట్ల ద్వారా అమ్ముకునేవారట.

వాళ్ల పీయే ల ద్వారా, యేజంట్లనించి ప్రతీ నెలా లక్షల్లో ముట్టేవట వీళ్లకి ఈ సేవా టిక్కెట్ల రూపం లో!

ఇక బ్రేక్ దర్శనాల్లో, ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు, ఎం పీలు, ఎమ్మెల్యేలూ వగైరా అందరి కోటా కలిపి 600 కి మించలేదట. కానీ సాయంత్రం బ్రేక్ కి మొత్తం 14 మంది సభ్యులూ 1,33,974 టిక్కెట్లు మంజూరు చేయించుకుంటే,
ఆదికేశవుడితో సహా ఈ ముగ్గురికీ 73,823 మంజూరయ్యాయట.

వుదయం బ్రేక్ కి అయితే, రెండేళ్లలో ఈ నలుగురి కోటాలోనూ వరుసగా 71,624; 31,779; 27,369; 24,611 మంజూరయ్యాయట!

వెంకన్నా! ఈ లెఖ్ఖలన్నీ అర్థమవుతున్నాయా? కుబేరుడికి వడ్డీ యెక్కువ కట్టేస్తున్నావేమో చూసుకో!

ఈ మధ్యనే సెంట్రల్ సర్వీసుకి వెళ్లడానికి వొప్పుకొన్న రాష్ట యెన్నికల ప్రథానాధికారి ఐ వీ సుబ్బారావు, గతం లో
దేవస్థానం ఈ వో గా పనిచేసిన అనుభవం తో, "సుదర్శన కంకణాన్ని తిరిగి ప్రవేశపెట్టాలనీ", "సుపథం పేరుతో
'కదిలే తివాచీ' యేర్పాటుచేసి, మహర్ద్వారం ముందుభాగం నించి సన్నిధిని కలుపుతూ తిరిగి వెలుపలకి చేరుకొనేలా
అమర్చాలనీ, అవసరాన్నిబట్టి వేగాన్ని తగ్గించడం పెంచడం చేయచ్చనీ," రెండు విలువైన సూచనలు చేశారు.

(ఇవన్నీ ఇదివరకు మనం అనుకున్నవేకదా?)

మరి ఆలకించేవాడేమంటాడో?