Monday, August 31, 2009

శ్రీగిరి శ్రీపతి....


స్వామి 'భక్తి చానెల్ '


విన్నారా? శ్రీవారి భక్తి చానెల్ 100 కోట్లకుపైగా నష్టాల్లో వుందట! 98 ధార్మిక సంస్థలకి కోట్లాది రూపాయలు ధారాదత్తం చేస్తోందట మన తి తి దే బోర్డు!  


గత 30 యేళ్ళుగా అందరికీ తెలిసున్నవే! యెన్ని ప్రభుత్వాలు వచ్చినా అన్నీ ఆ తానులో ముక్కలే! యెగబడి అన్నివూళ్ళలోనూ 'కళ్యాణ మండపాలు ' కట్టించేశారు! (వాటితో గుత్తదారులు బాగుపడ్డారు!) ఇప్పుడవన్నీ శిథిలావస్తలో వున్నాయి (కట్టుబడిలో అవినీతి మూలంగా)--నిర్వహణ సరిగ్గాలేక, ఇప్పుడు 'ప్రైవేటు 'కి అప్పగిస్తామన్నారు--టెండర్లు పిలిచారు! (ఇక్కడ ఇంకోరకం అవినీతి)  


యవడబ్బ సొమ్మని? (రాజుల సొమ్ము రాళ్ళపాలైనా, ఇప్పటికీ ఆ రాళ్ళైనా నిలిచి వున్నాయి--మరి దేవుడి సొమ్ము? పొట్టలు పెంచడానికా? ఆ పొట్టలు నిలుస్తాయా?)  


భక్తి చానెల్ మొదలెట్టే ముందు యేమి చెప్పారు? సినిమాలూ, సీరియళ్ళూ నిర్మిస్తాము--స్పాన్సర్లు వస్తారు--ఇన్ని కోట్ల లాభం వస్తుంది--పైగా స్వామికార్యం కూడా నెరవేరుతుంది--అని! మరిప్పుడు?  


చెపితే నవ్వుతారు (దేంతోనో మీ ఇష్టం!)  


క్రితం వార్షిక బ్రహ్మోత్సవాల్లో 'ప్రత్యక్ష వ్యాఖ్యానం' చేసిన ఓ ప్రముఖ వ్యక్తికి, పదమూడువందలో యెంతో (రెండువేల లోపు) చెక్కు ఇచ్చారు శ్రీ భక్తి చానెల్ వారు! తీరా ఆయన బ్యాంకుకి వెళ్ళి ఆ చెక్కుని తన ఖాతా లో జమ చేయమని అడిగితే--శ్రీ 'చానెల్ ' వారి ఖాతాలో వున్న సొమ్ము అక్షరాలా 'పందొమ్మిది రూపాయలు '! మరి ఖాతాలో సరిపడిన సొమ్ము లేకుండా చెక్కులు ఇవ్వడం నేరం! (దానిమీద ఆయన కోర్టుకి వెళ్ళలేదు--స్వామి భక్తుడు కాబట్టి!)  


మొన్న, పీ సీ సీ అధ్యక్షుడు శ్రీ ధర్మపురి శ్రీనివాస్ తన అనుచరులు కేవలం నలభయ్యే మందితో వెళితే, గంటన్నరపాటు క్యూలని ఆపేసి, రాజుగారినీ, వారి మంత్రులనీ సేవించడంలో సిబ్బంది తరించారట! పైగా, శ్రీ శ్రీనివాస్ 'వికలాంగుడు ' కాబట్టి, అది సమంజసమే అంటున్న ఆదికేశవుడు! {ఆయన వికలాంగుడనే ఇప్పటివరకు తెలియదు--యెలాంటి వికలాంగుడో యెవరికీ తెలియదు! పోనీ (ఆయనకి యేదో అంగం లోపించిందని) వొప్పుకున్నా, ఆ వెనక 40 మందికీ కూడా అవయవాలు లోపించాయా?}  


విలేఖరులు వచ్చేసరికి, సిబ్బంది పరుగులు పెట్టి, సెల్ ఫోన్లకి పని చెప్పి, వైకుంఠం 17 నించి--వైకుంఠం 1 కి భక్తులని పంపించమని హడావుడి చేశారట!  


నిజంగా మన మీడియా తలుచుకుంటే, ఓ క్రమ పద్ధతిలో వాళ్ళ సుకుమారమైన దున్నపోతుచర్మాలని వలిచెయ్యచ్చు!  


మన మీడియా అందుకు పూనుకుంటుందా?  


(అబ్బే! యెవరి సొంత ఎజెండాలు వాళ్ళకున్నాయి--అని యెవరో అంటున్నారు--అవునా?)  


యేమో!  


ఆ పైవాడికే తెలియాలి మరి!


తాజా కలం :-- శ్రీ వారి భక్తి చానెల్ ని (యెవరైనా తీసుకునేవాళ్ళుంటే), లీజుకి ఇచ్చేస్తారట! చూ. ఈనాడు సెప్టెంబరు 1, 2009--పే. 11



Thursday, August 27, 2009

రామస్వామి నగలు


బడాచోర్లు


‘….రెండుకాదు…11’ అంటోంది ఈనాడు!  


డి ఎస్పీ గంగరాజు, దర్యాప్తు అధికారి సీ ఐ సుధాకర్ రెడ్డి, విలేకర్ల సమావేశం లో ‘పదిహేనురోజుల క్రితం—3 లక్షలు చెల్లించి 3 నగలు పూజారి విడుదల చేయించినట్లు, వడ్డీ వ్యాపారి నుంచి 1.408 కేజీల బరువున్న 8 నగలు స్వాధీనం చేసుకొన్నట్లు, వాటిలో రెండు శుక్రవారమే స్వాధీనం చేసుకోగా, ఆరు శనివారం చేసుకున్నట్లు—డీ ఎస్పీ చెప్పగా, ఆర్చకుడి ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేకపోవడం వల్ల హాజరుపరచలేకపోయామని పోలీసులూ—తెలిపారట.  


స్వాధీనం చేసుకున్నట్టు చెపుతున్న నగల్ని ప్రదర్శించకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయట. ఇటీవల విడుదల చేయించిన నగలు భద్రం గా వున్నాయా అనే విషయం ఇంకా తేలాలట.  


మరి టీవీలో ఆ రాత్రి, 8 ఆభరణాలని స్వాధీనం చేసుకున్నారంటూ, అవేవో రంగు రంగుల రాళ్ళున్న ఆభరణాలని కొన్నింటిని చూపించారు! (బహుశా లైబ్రరీ షాట్లనుకుంటా!) మరి ఈ మీడియాల విశ్వసనీయత యేమిటి? యెవరి ఎజెండాలు వారికున్నాయనా?  


ఇక, డాలరు శేషాద్రి పేరు మొదటిసారి మొన్నీమధ్య కొండకి వెళ్ళినప్పుడు మా జర్నలిస్ట్ మిత్రుడి నించి విన్నాను. తరవాత మొన్న పేపర్లో చదవడమే! ఆయన్నెప్పుడూ చూడలేదు—ఒకవేళ గుడిలో చూశానేమో గానీ ఆయనే ‘ఫలానా’ అని తెలియదు.  


టీవీ లో ఆయన కళ్ళనీళ్ళతో, ‘నా జీవితమంతా రాత్రీ పగలూ స్వామివారికీ భక్తులకీ సేవ చెయ్యడానికే అంకితం చేశాను—బొక్కసం అంటే యేమిటో తెలియనివాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు—బొక్కసం లో గానీ, నాదగ్గరగానీ డాలర్లు వుండవు—నాకు పిల్లలు లేరు—స్వంత ఇల్లు కూడా కట్టుకోకుండా నా భార్యతో అద్దె ఇంట్లో వుంటున్నాను—యెవరికోసం సంపాదించాలి—అదీ అవినీతితో!’ అని వాపోతుంటే, నిజం చెప్పొద్దూ—హృదయం ద్రవించింది!  


వారెన్ బఫెట్ ‘నా సంతానం రోడ్డున పడక్కర్లేనంత మాత్రమే వాళ్ళకి ఇచ్చి, మిగిలినదంతా సేవా సంస్థకి ఇచ్చేస్తున్నాను’ అని ప్రకటించాడు ఇదివరకు.  


మరి మన టాటా, బిర్లా, అంబానీలూ, బచ్చన్లూ, రెడ్డిలూ యెందుకు ఆలోచించరో!  


శ్రీ శేషాద్రి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం వీరందరికీ, మీడియాకీ లేదా?



Saturday, August 22, 2009

కూష్మాండాలు కుక్కబడతాయా?

మారణహోమమా?
పాపం….మహాయోగి రామకృష్ణ పరమహంస లా వున్నాడు చూడడానికి!
ఆ ముఖం చూస్తే, 8 లక్షలు—పెళ్ళిళ్ళకీ, అనారోగ్యానికీ అయితే మాత్రం—ఖర్చుపెట్టగలదిగా కనిపిస్తోందా?
2007 లో కనీసం 11 లక్షల విలువచేసే నగలు పట్టుకెళ్ళి తాకట్టు పెడతానంటే, అవి ఆయన స్వంతమే అని యెవరైనా నమ్మేటట్టుందా?
అసలు తాకట్టు యెందుకు—యే చిత్తూరో, చెన్నయ్యో తీసుకెళ్ళి అమ్మేస్తే పోలా—అనే అలోచనైనా వచ్చే తెలివి కనిపిస్తోందా?
ఆయనెవరంటారా!
శ్రీపతి పట్టణం లోని కోదండ రామస్వామి ఆలయం ప్రధానార్చకుడు శ్రీ చిన్న వెంకటరమణ దీక్షితులు!
ఆలయ మూల విగ్రహం మీద వుండే నగలని తాకట్టు పెట్టాడనే అరోపణమీద ఆయననీ, ఆయన భార్యనీ కూడా ‘అరెష్టు’ చేశారట!
ఆయనే తాకట్టు పెట్టినట్టు వొప్పుకోవడం, ఫలానా బంగారం షాపు యజమాని కొడుకు దాన్ని ధృవీకరించడం, అరెష్టులూ, టీవీల్లో వార్తలూ, పేపర్లకి వార్తలూ వచ్చేశాయట!
కొన్ని ప్రశ్నలు---
కొండమీది శ్రీవారినే, ఆభరణరహితం గా వారానికి ఓ రోజు దర్శనానికి అనుమతిస్తూండగా, రామాలయం లో 11 లక్షల విలువైన ఆభరణాలని 2007 వరకూ 365 రోజులూ అలంకరించే వుంచేవారా?
2007 లో కొన్నాళ్ళు 6 లక్షల విలువైన ఆభరణం ఒకటే వుండి, రెండోది కనిపించక పోయినా, యెవరికీ అనుమానం రాలేదా?
ఆ తరవాతైనా రెండూ లేనప్పుడు కూడా రాలేదా?
అనుమానం రాకుండా ఆయనేమయినా అలాంటివే గిల్టు నగలు తయారుచేయించి అలంకరించాడా?
కోదండ రాముడికి 47 రకాల స్వర్ణాభరణాలూ, 600 కిలోలకి పైబడి వెండి ఆభరణాలూ 70 కిలోల వరకూ వెండి కవచాలూ వున్నాయట. అవన్నీ ఒక చోట వుండి వుంటాయి కదా? గత రెండు సంవత్సరాల్లో అవేవీ స్వామికి అలంకరించలేదా? ఒకవేళ అలంకరిస్తే, మళ్ళీ అవి భద్రపరచబడాలికదా? అది దేవస్థానం వుద్యోగుల పనేగా? వాళ్ళెవరికీ అనుమానం రాలేదా?
‘పారుపత్తేదారు’ అంటే శ్రీవారి బొక్కసానికి సంబంధించిన ‘గుమాస్తా’ ట. ఆ పదవీ విరమణ చేసినాయన శ్రీ పి శేషాద్రి అట. (ఆయన్నే డాలరు శేషాద్రి అంటారట--మరి ఆయన ఇప్పుడు పొడిగింపు మీద ప్రత్యేకాధికారిగా కొనసాగుతున్నారట!) పదవీ విరమణ చేశాక కూడా, శ్రీవారి బొక్కసం తెరవగల ‘రెండు’ తాళాలూ ఆయనదగ్గరే వుంటున్నాయట. బొక్కసం నించి 300 బంగారు డాలర్లు మాయం అయ్యాయట.
ఈ విషయాలన్నీ నిఘా, భద్రతాధికారి శ్రీ బి వి రమణ కుమార్ క్షుణ్ణం గా పరిశీలించి తీసుకోవలసిన చర్యల్ని సూచిస్తూ, 2008 లోనే నివేదిక సమర్పించారట!
‘……యేమడిగారూ?.......అరెష్టా! ఇంకా నయం—ఆయనేమయినా ఓ పిచ్చి అర్చకుడా—భార్యా సమేతం గా అరెష్టుకీ, వుద్యోగం పీకెయ్యడానికీ……’ అంటున్నారెవరో!
మరి ఇవన్నీ గమనిస్తే, మొదలైన మారణహోమం లో ఇంకా చాలామంది సమిధలవుతారేమోనని నాకొచ్చిన ఆలోచన తప్పని యెవరైనా అనగలరా?
నడుస్తున్నది ‘దేవుడి’ పాలన అంటున్నారు మరి.

Friday, August 21, 2009

శ్రీగిరి శ్రీపతి

శ్రీ వారికోసం.....బంగారు ముష్టి
శ్రీ డీ కే ఆదికేశవులు నాయుడు శ్రీగిరి శ్రిపతి దేవస్థానం (ప్రస్తుత తి తి దే) పాలకవర్గ చైర్మన్ అయ్యాక ప్రవేశపెట్టిన ‘వినూత్న’ పథకం—“శ్రీవారి……..! అనంత స్వర్ణమయం!” అనే శ్రీవారి బంగారు ముష్టి కార్యక్రమం.
ఈ పథకం ప్రకారం, శ్రీవారి గుడి లోపల గోడలనీ, స్థంభాలనీ, బంగారం తో తాపడం చేయిస్తారట! (ఆ క్రమం లో శిల్ప కళ దెబ్బతినకుండా, పలచగానే పామిస్తామని కూడా హామీ ఇచ్చారు!) దానికి ఓ 35 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందట! అందుకోసం అందరూ విరివిగా బంగారం విరాళం ఇవ్వండి! అని ఆయన విఙ్ఞప్తి చేశారు!
ఆ తరవాత కొన్నాళ్ళకే ‘అంచనా వ్యవం 48 కోట్లకో యెంతకో చేరిపోవడం చేత, ఇంకా విరివిగా విరాళాలు ఇవ్వండి—అన్నారు!
ఇక చూసుకోండి—చెన్నై లోనూ, బెంగుళూరులోనూ, చిత్తూరు నించి నెల్లూరు—గుంటూరు మీదుగా మిగిలిన జిల్లాలలోనూ—వీర వసూళ్ళు మొదలయ్యాయట! దీనికేమైనా లెఖ్ఖా పత్రమా? ప్రతీవాడూ ‘ఫలానా కార్యక్రమం కోసం’ బంగారం ముష్టి అడిగేవాడే! వసూలు చేశేవాడే! (వాళ్ళల్లో చాలా మంది ‘ఆది కేశవుడి’ మనుషులే అని కూడా చెవులు కొరుక్కున్నారు!
తరవాత ‘ఆది కేశవుడు’ వాళ్ళని కోప్పడ్డాడు—‘మేమెవ్వరికీ అలా వసూలు చెయ్యమని అధికారం ఇవ్వలేదు’—అంటూ!
అప్పుడే నా బ్లాగులో ఈ ప్రశ్న లేవనెత్తాను—శ్రీవారికి ముష్టి యెత్తాల్సిన ఖర్మ యేమిటి? అని.
ఆయనకి గత 500 సంవత్సరాలుగా వస్తున్న బంగారు మొక్కుబడులూ, బహుమతులూ (వాటిలో దిగమింగినవాళ్ళు మింగెయ్యగా మిగిలినవైనా) చాలకనా?
1980 లలో అనుకుంటా, శ్రీవారికి వచ్చిన కానుకలు బస్తాలకొద్దీ పోగుబడిపోతే, దేవస్థానం వాళ్ళు, ప్రభుత్వ అనుమతితో, ఆ బంగారాన్ని కరిగించి, ఇటుకలుగా పోత పోయించి, వాటిలోని పెద్ద పెద్ద రాళ్ళనీ, వజ్రాలనీ వేరుగా, చిన్న చిన్న రాళ్ళని వేరుగా చేసి, ముంబాయిలో వేలం వేశారు! ఆ ఇటుకల్ని ఓ బ్యాంకులాకరులో భద్రపరిచారు—ముంబాయి లోనే!
మరి ఆ బంగారమంతా యేమయినట్టు? ఆ తరవాత వచ్చినవాటి మాటేమిటి?
ఈ రోజున హైకోర్టు అడిగితేనే, జాబితా ఇవ్వడానికి 2 నెలలు సమయం అడిగారు—పైగా సిగ్గులేకుండా ‘రహస్య విచారణ’ జరిపించమంటున్నారు!
ఇవన్నీ చూసికూడా, ఆదికేశవుడి ముష్టి పథకం శ్రీ వారికే చెందుతుంది అంటారా? అందుకే అంత పెద్ద బ్రాకెట్టేశాను!
ఓ నా హిందూ సోదరులారా—ఆ జాబితాల్నీ, ఇంటి, బయటి, రాజకీయ, అరాచకీయ దొంగల్నీ బయట పెట్టిస్తారా—యెవడి పాపానికి వాడే పోతాడు అని వూరుకుందామా?
ఆలోచించండి!

Wednesday, August 19, 2009

శ్రీగిరి శ్రీపతి

డైరీ

తఱచుగా శ్రీవారికి భక్తులు సమర్పించే విలువైన కానుకల్ని తేదీలవారీగా ఈ డైరీలో అప్ డేట్ చేస్తూ వుంటాను. చదువరుల సౌకర్యం కోసం! 10-02-1513

శ్రీకృష్ణ దేవరాయల చే కెంపులు, పచ్చలు, నీలాలు, మాణిక్యాలు, వైడూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్ర కిరీటం

02-05-1513 నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణ ఖడ్గం, భుజకీర్తులు, 30 తీగల పతకం

తంజావూరు రాజు పాండ్యన్ ఓ కిరీటం

మైసూరు మహారాజు, తదితరులు--108 బంగారు పుష్పాలు, 32 కిలోల సహస్రనామహారం, నాలుగు కిలోల చతుర్భుజ లక్ష్మీ హారం, 7 కిలోల రత్నాల మకరకంఠి 13.6 కిలోల నవరత్న కిరీటం, 500 గ్రాముల అరుదైన గరుడ మేరు పచ్చ ఆభరణం

రతన్ టాటా, అంబానీలు, విజయ్ మాల్యా, గోయెంకా మొదలైనవారు--1940 లో వజ్ర కిరీటం, 1954 లో వజ్రాల హారం, 1972 లో వజ్రాల శంఖు చక్రాలు, కర్ణపత్రాలు, 1974 లో కటిహస్తం

1986 లో 5 కోట్ల విలువైన వజ్రాల కిరీటం తి.తి.దే వారు చేయించారు.

ఇప్పటికి మూలబేరానికి 8 కిరీటాలు, ఉత్సవ బేరాలకి 7 కిరీటాలు వున్నాయి.

13-11-2008

ఆపోలో ఆస్పత్రుల అధిపతి శ్రీ ప్రతాప్ సి. రెడ్డి చేత, 5 కిలోల బరువూ, 80 లక్షల విలువా చేసేఅభయ, కటి హస్తాలు. 18-11-2008 తిరుపతి శాసన సభ్యులు వెంకటరమణ--పద్మావతి అమ్మవారికి--ఇరవై లక్షల విలువైన 2 కేజీల బంగారంతో తాపడం చేసిన 'అశ్వ వాహనం' (ఇంతకు ముందు రెండు మూడు రోజుల క్రితం, ఇంకో కానుక యెవరో ఇచ్చారు గాని, వివరాలు వెదక లేక పోయానుఅందుకే, ఇదే మొదటి నమోదు!) 17-1-2009ఫాబ్ టెక్ కంపెనీ వారు రూ. ఒక కోటి విరాళం. ఇంతకుముందు రూ. రెండు కోట్లు విరాళమిచ్చిన స్విస్ మహిళ ఎలిజబెత్ జెయిగ్లర్. 09-03-2009 --వీరెంద్ర మహేష్ గౌడ్ అనే ఆయన ముంబాయి నించి--51 లక్షల నగదు--అన్నదానం ట్రస్టు కోసం వినియోగిస్తామని ఈ వో ప్రకటన! (ఈ మధ్యలో కొన్ని కానుకలు వచ్చాయి గానీ, వాటిని యెప్పటికప్పుడు ఇందులో చేర్చలేకపోయాను! మీకెవరికైనా తెలిస్తే, నాకుచెప్పెనాసరే, కామెంట్ లో వ్రాసినా సరే!--మీ యిష్టం) 11-06-2009--కర్ణాటక ఎమ్మెల్యే, ఇనుపఖనిజం ఫేం 'గాలి జనార్దన రెడ్డి ', 45 కోట్ల ఖర్చుతో, ఓ సరికొత్త బంగారు,వజ్ర కిరీటం!

25-07-2009--నవీన్ జిందాల్ దంపతులు--రూ.46 లక్షల విలువ చేసే బంగారు శంఖుచక్రాలు,తిరుచానూరు పద్మావతీ అమ్మవారుకి ఎస్ ఆర్ కన్నన్ అనే ఆయన రూ.1.50 లక్షల విలువ చేసే బంగారు హారం.

01-08-2009

న్యూఢిల్లీ కి చెందిన అజయ్ మోడీ దంపతులు ప్రతిపాదిత కంటి ఆస్పత్రి కోసం రూ. 50 లక్షలు విరాళం

{17-08-2009

బెంగుళూరు నగరానికి చెందిన విమల తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం 16 లక్షల విలువైన 'కిలో బంగారాన్నీ 'అనంత స్వర్ణమయం' కోసం ఇచ్చారు. ఇది శ్రీ వారి తరఫున 'ఆది కేశావుడి ' ముష్టి లో భాగం కాబట్టి, శ్రీ వారికి చెందని కానుక కాబట్టి అంత పెద్ద బ్రాకెట్టేశాను!}

Sunday, August 16, 2009

గోవిందా....!

వీ పీ లకి బ్రేక్
మొన్న శుక్రవారం (14-08-2009) మధ్యాన్నం నించి విపరీతం గా వర్షం కురిసి, శ్రీవారి ఆలయం లో రెండడుగుల లోతున నీరు నిలిచి, దాన్ని తొలగించడానికి దేవస్థానం వారు అష్టకష్టాలు పడ్డారట. భక్తులు తీవ్ర ఇక్కట్లు యెదుర్కొన్నారట.
అదలా వుంటే, రాష్ట్ర మంత్రివర్యుడు ఎం. ముఖేష్ గౌడ్, ఓ నలభై అయిదు మంది పరివారం తో వచ్చి పడ్డాడట!
భక్తుల రద్దీ కారణం గా రాత్రికి వీ ఐ పీ బ్రేక్ దర్శనం వుండదని, శనివారం ఉదయం స్వామి దర్శనం చేసుకోవాలని తితిదే అధికారులు తేల్చి చెప్పారట.
అంగీకరించినట్లే వుండి, ఆఖరికి తమకు రాత్రి బ్రేక్ దర్శనం కావాల్సిందేనని మంత్రి పట్టుబట్టారట! విధిలేని పరిస్థిలో అధికారులు మంత్రి కోసం, వాడి పరివారం కోసం, వీ ఐ పీ బ్రేక్ దర్శనం యేర్పాటు చేశారట!
ఇలా ముఖేష్ లాంటి ఎల్ కే అద్వానీలని భక్తులు తన్ని తగిలేసే రోజు యెప్పుడొస్తుందో!

Friday, August 14, 2009

శ్రీ కృష్ణపరమాత్మా!

………మరే!
కృష్ణాష్టమి సందర్భంగా మన ఎలక్ట్రానిక్ మీడియా—శ్రీ కృష్ణుడు ‘ఉత్తముండ ' గు మేనేజిమెంటు గురు’; ‘మార్కెటింగు గురు’; అన్ని కులాలనీ ప్రేమించే ‘సమానత్వ గురు’; ‘మానవ వనరుల అభివృద్ధి గురు’ ఇలా పేలుతూ, ‘కృష్ణుడి గుడి అంటే ఇస్కాన్ గుడే’ అన్నట్టు గుర్తింపు వచ్చింది’ అంటున్నప్పుడు—నా అభిప్రాయం వ్రాయాలనిపించింది!
మా అమ్మాయి బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా వుద్యోగం చేస్తూండగా (అప్పటికింకా పెళ్ళి చెయ్యలేదు) పోరు పెడుతుంటే, రెండోసారి మహబూబ్ నగర్ నించి బెంగుళూరు వెళ్ళాము—మా కారులో!
{మొదటి సారి—నా అలవాటు ప్రకారం—ట్రెయినులో వెళ్ళి, గవర్నమెంటువారి టూరిజం బస్సుల్లో సిటీ సైట్ సీయింగ్ చేసెయ్యడం, చూడవలసిన (గుళ్ళూ గోపురాలూ తప్ప) ప్రదేశాలని గుర్తుంచుకోవడం—(మళ్ళీ వెళ్ళినప్పుడు తీరికగా చూడడానికి)—అయిపోయింది--ఈ విధం గా మనదేశం లోని--కొలకత్తా తప్ప--అన్ని మహానగరాలూ, ఇతర కొన్ని పెద్ద పట్టణాలూ తిరిగేశాము!}
ఓ ఆదివారం, ఇస్కాన్ కి వెళ్ళాము (దాన్ని నేను గుడిగా గుర్తించలేదు--పర్యాటక కేంద్రం గా తప్ప).
క్యూలో వెళుతున్నాము—ముందు మా అమ్మాయి, వెనుక మా ఆవిడ, మధ్యలో నేను—ఒక చోట ఇరవై ఒకటో, నూట యెనిమిదో చిన్న చిన్న తిన్నెల లాంటివి వుంటాయి—‘హరేరామ హరేరామ రామ రామ హరే హరే! హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే’ అని మైకుల్లోంచి వినపడుతూ వుంటుంది—మనం కూడా, ఒక్కో తిన్నె మీదా నిలబడి, అలాగే ఇరవయ్యొక్క సార్లో, నూట యెనిమిది సార్లో అంటూ వెళ్ళాలన్నమాట!
సరే, నేను నోరు మూసుకుని, మనసులో నవ్వుకుంటూ ఒక్కొక్క తిన్నెనీ దాటుతున్నాను—మిగిలినవాళ్ళందరూ తూ.చ. తప్పకుండా ఆఙ్ఞల్ని పాటిస్తున్నారు.
ఇంతలో, యెదురుగా ఓ బాల్కనీ లాంటి చోట ప్రత్యక్షమయ్యాడొకడు—ఖాకీ నిక్కరూ, కాషాయరంగు లాల్చీ, గుండూ, ఓ రెండు మూడు మిల్లీమీటర్ల అప్పుడప్పుడే మొలుస్తున్న జుట్టుతో, లావుగా—పరేష్ రావల్ లాంటి గుండ్రని గుమ్మడికాయ ముఖంతో—యాక్షన్ చేస్తున్నాడు—గుప్పెళ్ళు బిగించి, ముందునించి నెత్తిపైకి చేతులు బలవంతంగా లాగుతున్నట్టు అభినయిస్తూ, శబ్దం రాకుండా—కమాన్, కమాన్, అనండి—హరేరామ………ఇలా యాక్షన్ చేస్తూ!
నన్ను గమనించనే గమనించాడు—నేను పెదాలు కదపక పోవడం, నవ్వుకుంటూండడం గమనించి, నన్ను చూస్తూ మరింత రెచ్చిపోతున్నాడు!
నాకూ సరదా పుట్టింది—చాలా నెమ్మదిగా మొదలుపెట్టాను—హరే అల్లా హరే అల్లా అల్లా అల్లా హరే హరే! హరే క్రీస్తు హరే క్రీస్తు క్రీస్తు క్రీస్తు హరే హరే—అంటూ!
మొదట మా అమ్మాయి—‘డాడీ!’ అంటూ! తరవాత కుడి, యెడమ పక్కవాళ్ళు—‘హా’ అనే ఎక్స్ప్రెషన్లతో! వెనక నించి మా ఆవిడ ‘యెందుకండీ అలాగ!’ అంటూ!
మళ్ళీ నోరు మూశేశాను. పైనున్నవాడికివేమీ తెలియదుకదా? ముఖం కందగడ్డలా చేస్కొని వెళ్ళిపోయాడు!
భక్తి అన్నది మనసులోంచి రావాలి గానీ, ఈ బలవంతపు బ్రాహ్మణార్ధాలేమిటీ?

Saturday, August 8, 2009

ఓ అమృతం కొఱత

తాజా వార్త
గుళ్ళలో ప్రసాదాలు చెయ్యడానికి కూడా నెయ్యి లేదుట!
కృష్ణా మిల్క్ యూనియన్ ఆధ్వర్యంలో నడిచే విజయ డెయిరీ నెలకి సగటున 150 టన్నుల నెయ్యి ఉత్పత్తి చేస్తోందట—ఈ నెయ్యి గోదావరి, కృష్ణా జిల్లాలలో దేవస్థానాలకి సరఫరా చేస్తోందట.
ఇప్పుడు కరువు పరిస్థితులవల్ల నెయ్యి ఉత్పత్తి బాగా పడిపోయి, ప్రసాదాలు తయారు చెయ్యడానికి కూడా నెయ్యి నిండుకుందట.
శ్రీపతివారికి కర్ణాటక నెయ్యి దిగుమతి చేస్తున్నారట—అందులోనే ముష్టిలో వీర ముష్టిగా మిగిలిన గుళ్ళకి కూడా పంపిస్తారట!
మన పిచ్చిగానీ, ఊరూరా వీధి వీధినా ప్రతీ గుళ్ళోనూ శత సహస్ర గుండాల తో వరుణ యాగాలూ, శాంతి హోమాలూ చేసేసి, చివరికి మోహన బాబు తో సహా అందరూ శక్తిమేరకి ప్రత్యేకం గా వరుణ యాగాలు చేసేస్తే—ఇంకా నెయ్యెక్కడుంటుంది!
నెయ్యి లేకపోతే ప్రసాదాలకి లోటేముంటుంది—వనస్పతో, మరో ప్రత్యామ్నాయమో వుండనే వున్నాయి!
కానీ – జరుగుతున్న ‘క్రిమినల్ వేష్ట్’ ని అరికట్టే మార్గాలెవరైనా కనిపెడితే బాగుండును!

Friday, August 7, 2009

శ్రీగిరి శ్రీపతి ఉత్సవాలు

శ్రీవారి పవిత్రోత్సవాలు—1
మొన్న ఒకటో తారీకున ఈ ఉత్సవాలు వైభవం గా ప్రారంభమయ్యాయట.
తెల్లవారుజామునించి స్వామికి (మూలబేరానికి) వరుసగా, సుప్రభాతం, తోమాల, కొలువు, అర్చన, నైవేద్యం పూర్తైన తరవాత, శ్రీ దేవి, భూదేవి సమేతం గా శ్రీ మలయప్ప స్వామిని పల్లకీలో పవిత్రోత్సవ మండపానికి తరలించారట.
మండపం లో యేడు హోమ గుండాల్లొ అగ్నిని ప్రతిష్ఠించి, వీటి మధ్య ఓ వేదిక పై నవకలశాన్ని, మరో వేదిక పై ప్రాయశ్చిత్త కలశాన్ని ప్రతిష్ఠించారట.
వీటికి ముందు స్నాన పీఠం పై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామిని ఆశీనుల్ని చేశారట.
పట్టుదండలను యాగ శాలలో ప్రతిష్ఠించి, వైఖానస ఆగమ శస్త్రోక్తం గా హోమాలు చేశారట.
అనంతరం ఉభయ దేవేరులతో సహా స్వామికి కంకణధారణ చేసి, హోమ తిలకం పెట్టిన అనంతరం ‘తిరుమంజనం’ ప్రారంభించారట.
అయ్యాక, స్వామివారిని సర్వాభరణాలతో పుష్పమాలలతో అలంకరించి, రాత్రి తిరుమాడ వీధుల్లో ఉరేగించారట.
తరవాత, పవిత్రోత్సవ మండపానికి దేవేరులతో స్వామివారు చేరుకున్నారట.
మూడు రొజుల పాటు ఉత్సవ మూర్తులను యాగ శాలలోనే వుంచనున్నారట.
ఇదీ మొదటిరోజు జరిగింది!
రెండో రోజు (02-08-2009) యేమి జరిగిందో, ఈనాడు లో వ్రాయలేదు—బహుశా భక్తుల కష్టాలకీ, వీ ఐ పీ ల ప్రత్యేక దర్శనాలగురించీ—ఇలా మెయిన్ హెడ్డింగుతోసహా దాదాపు అరపేజీకి పైగా కేటాయించడం తో స్థలాభావం వల్ల కావచ్చు!
మూడో రోజు (03-08-2009) న కూడా యేమి జరిగిందో వ్రాయలేదు—బహుశా శ్రీవారి ఆభరణాల జాబితా సమర్పించమని ఆదేశించిన మన రాష్ట్ర వున్నత న్యాయస్థానం ఇచ్చిన అదేశాలని వివరించడం తో స్థలాభావం వల్ల కావచ్చు!
(మిగతా ఇదే టపాలో తరవాత వ్రాస్తాను!)