Wednesday, September 16, 2009

శ్రీగిరి శ్రీపతి....


సామాన్యుల, బ్లాగర్ల విజయం!


తనకొండకు తానే రప్పించుకొనే శ్రీవారు, తన దర్శనం సామాన్యులకి సులభం గా అయ్యేలాగ తానే పాలక మండలికి సద్బుధ్ధిని ప్రసాదించాడు!  


కీలక నిర్ణయాలు వెలువడ్డాయి.  


మొదటిది శ్రీవారి మూలబేరానికి వారానికోసారి చేస్తున్న సహస్ర కలశాభిషేకం రద్దు--(గతంలో లాగానే) యేడాదికొకసారే జరిపిస్తామని ప్రకటన.  


పరోక్షం గా వొప్పుకున్నారు--మూలబేరం అరిగిపోతోందనీ, రంగు మారిపోతోందనీ! సంతోషం!  


అష్టదళపద్మారాధనని కూడా సంపంగి ప్రాకారం లో జరిపిస్తామని--సామాన్యుల దర్శనానికి ఆ సమయం పెరుగుతుంది!  


రెండో ముఖ్యమైనది--సెల్లార్, అర్చనానంతర, నిజపాద దర్శనాల రద్దు! మధ్యలో వచ్చినవి మధ్యలోనే పొవాలి, పోతాయి! కదా!  


గతం లో లాగే శీఘ్ర దర్శనం టిక్కెట్ల అమ్మకం--రూ. 300/- కి ఒకటి చొప్పున. అదికూడా యేరోజుకారోజు దర్శనం సమయం లోనే విక్రయించడం! చాలా బాగుంది!  


మూడోది--సేవల పై కమిటీ నియామకం.  


మొత్తానికి మా మొన్నటి శ్రీపతి యాత్ర శుభమే కలిగించింది--సామాన్యులకి!  


మన టపాలు మనం లింకులు పంపినవాళ్ళందరూ--ముఖ్యం గా 'చదవలసినవాళ్ళు' చదివారు! ఖచ్చితం గా ఇది బ్లాగర్ల విజయమే!  


మనం కృతఙ్ఞతలు చెప్పవలసింది శ్రీ పీ వీ ఆర్ కే ప్రసాద్ గారికీ, ఇదివరకటి ఈ వో (ప్రస్తుత పాలక మండలి సభ్యుడు) శ్రీ రమణాచారి గారికీ, చివరగా మా జర్నలిష్ట్ మితృదు 'రమేష్' కీ!  


స్వామి ఇంకా సద్బుధ్ధిని ప్రసాదించి, ఇంకొన్ని కీలక నిర్ణయాలు కూడా త్వరలో ప్రకటించబడు గాక!



Sunday, September 13, 2009

స్వాములూ........


.......మాధవ సేవ!


మా సిబ్బంది అస్తమానూ మసిలే ఓ ప్రదేశం లో ఓ గోడమీద ప్రముఖం గా కనిపిస్తూ అంటించబడి వుంటుంది ఓ చిన్న బ్రోచర్--దానిమీద ఓ ప్రముఖ స్వామీజీ ఫోటో, ఆ ప్రక్కనే "మాధవ సేవగా సర్వ ప్రాణి సేవ" అని వ్రాసి వుంటుంది--యెన్నేళ్ళక్రితం యెవరు అంటించారో!  


బుర్రలో మరేమీ ఆలోచనల్లేనప్పుడు, దాన్ని చూసి, 'ఈ స్వామికి చాతుర్మాస్య వ్రతాలూ, అనుగ్రహ సంభాషణలూ తప్ప, సేవ చెయ్యడానికి సమయం వుంటుందా? వున్నా చెయ్య నిస్తారా?' అనుకుంటూ వుండేవాణ్ణి మనసులో!  


33 కుటుంబాలకి సరిపోయేలా వసతి కల్పించడానికి నిర్మించబడ్డ, శిథిలమైపోయిన 'వేయికాళ్ళ మంటపాన్ని ' తొలగిస్తే, 'ఆగమ శాస్త్ర ప్రకారం దాన్ని అలాగే అక్కడే పునర్నిర్మించవలసిందే'--అంటూంటే, అనవసరం గా ఈయన యెందుకిలా ప్రవర్తిస్తాడు--అనుకొనేవాణ్ణి.  


ఆయనెవరో కాదు--మీరు వూహించే వుంటారు--శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయరు స్వామి!  


ఆయన విజయనగరం లోని జీయర్ ట్రస్ట్ నిధులతో, అంధ విద్యార్థులకోసం 'నేత్ర విద్యాలయాన్ని ' నిర్వహిస్తూ, దాన్ని జూనియర్ కాలేజ్ స్థాయికి పెంచి, విద్యార్థులకి 'ల్యాప్ టాప్' లు ఉచితం గా ఇచ్చి వారిచేత పరీక్షలు వ్రాయించడానికి బోర్డుని ఒప్పించి, వాళ్ళు ఉత్తీర్ణులయ్యేలా చేశారంటే--అంతకన్న మాధవ సేవ యేముంటుంది!  


స్వామీ! నమోవాకాలు!  


మిగిలిన గడ్డాల మీసాల కాషాయ స్వాములు కూడా--ఆశ్రమాలూ, గుళ్ళూ, గోపురాలూ, గీతా మందిరాలూ, ధ్యాన మందిరాలూ కట్టించడం మానేసి--ఇలాంటి మాధవ సేవకి పూనుకొంటే...............!  


ఆ విధం గా మనం ఆశిద్దామా?


Tuesday, September 1, 2009

శ్రీగిరి శ్రీపతి

ధర్మ దర్శనం


మొన్నీమధ్యనే, సామాన్యులకి దర్శన సమయం 23.5 గంటలు పెరిగే ప్రతిపాదనలకి, పాలక సభ్యులు 'ససేమిరా' అన్నారు!  


మళ్ళీ ఈ నెల మొదటివారం లో జరగబోయే పాలకమండలి సమావేశంలో 'కొన్ని కీలక నిర్ణయాలూ తీసుకోవచ్చట! 


వాటికి ప్రాతిపదిక--తి తి దే మాజీ కార్య నిర్వహణాధికారీ, ప్రస్తుత సలహా సంఘ సభ్యుడూ శ్రీ పీ వీ ఆర్ కే ప్రసాద్ ఇచ్చిన నివేదికట.  


ఆయన చెప్పిన (బుద్ధున్నవాడెవడైనా చెప్పే) విషయాలు--  


1. తోమాల, అర్చన సేవల్లో పాల్గొనేవాళ్ళు--కూర్చొని కాకుండా, నిలబడి వుంటే, ఆ సమయం లో దాదాపు 5 వేల మందికి దర్శనం కల్పించవచ్చుట.  


2. ఆర్జిత సేవలని తెల్లవారుజామున 3.30 నుంచి 6.30 లోపల పూర్తిచేసి, ఆ సమయం లోనే ప్రత్యేక దర్శనాలూ చేయించాలట.  


(ఆసలు, 'మునుపెప్పుడో పడవల్లో ప్రయాణించే రోజుల్లో.....' అన్నట్టు--కాటేజ్ ల అద్దెలూ, గెస్ట్ హౌస్ ల అద్దెలూ లాంటి శాశ్వతాదాయ మార్గాలు లేని రోజుల్లో, స్వామి వారి ఆదాయం పెంచడానికి ఈ సేవలని ప్రవేశ పెట్టారు--అప్పట్లో, వాటి రుసుములు 'అణాల్లోనే' వుండేవి--ఒక్క కళ్యాణానికి తప్ప! ఇప్పుడివన్నీ పూర్తిగా రద్దు చేస్తే యేడిచేవాడెవడు?)  


3. ధర్మ దర్శనాన్ని ఉదయం 6.30 నించి నిరాటంకంగా సాగించి, ప్రత్యేక సేవల పేరిట క్యూను నిలిపి వేయ వద్దు అనిట.  


4. సెల్లార్, అర్చనానంతర, తదితర దర్శనం టిక్కెట్లని రద్దు చెయ్యాలిట. (సెల్లార్ దర్శనం వొక్కటీ వుంచచ్చు--మిగిలినవి రద్దు చేసి--ఆ క్యూ వేస్ట్ అయిపోతుంది కదా? ఈ టిక్కెట్లని జారీ చేసే అధికారమంటూ యెవరికీ కట్టబెట్టకూడదు--కొనుక్కొనే వాళ్ళందరికీ--రోజుకి ఇన్ని అని అమ్మాలి--అంతే!)  


5. వీ ఐ పీ, వీ వీ ఐ పీ దర్శనాలకు నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి--ఉదయం గంట, సాయంత్రం గంట! ఆ సమయం లోనే వారికి దర్శనం కల్పించాలిట.  


6. సోమవారం 'అష్టదళపద్మ ' సేవలూ, బుధవారం 'సహస్ర కలశాభిషేకాలూ' మూలవిరాట్టుకి కాకుండా ఉత్సవ బేరాలకి చేయిస్తే, అదనంగా 4-5 వేలమందికి దర్శనం దక్కుతుందట! (దీనివల్ల శ్రీ వారి మూలబేరం అరిగిపోవడం, రంగుమారడం లాంటివి జరక్కుండా వుంటాయి!)  


అన్నీ చక్కని సిఫార్సులే! మరి మండలి బాబులు (జనాలు తిట్టినా, ముఖ్య మంత్రి కళ్ళెర్రజేసినా చలించని చరిత్రగలవారు)యేంచేస్తారో--చూద్దాం!



శ్రీగిరి శ్రీపతి

డైరీ

తఱచుగా శ్రీవారికి భక్తులు సమర్పించే విలువైన కానుకల్ని తేదీలవారీగా ఈ డైరీలో అప్ డేట్ చేస్తూ వుంటాను. చదువరుల సౌకర్యం కోసం!

10-02-1513
శ్రీకృష్ణ దేవరాయల చే కెంపులు, పచ్చలు, నీలాలు, మాణిక్యాలు, వైడూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్ర కిరీటం

02-05-1513  నవరత్నఖచిత ఉడుధార, స్వర్ణ ఖడ్గం, భుజకీర్తులు, 30 తీగల పతకం
తంజావూరు రాజు పాండ్యన్ ఓ కిరీటం
మైసూరు మహారాజు, తదితరులు--108 బంగారు పుష్పాలు, 32 కిలోల సహస్రనామహారం, నాలుగు కిలోల చతుర్భుజ లక్ష్మీ హారం, 7 కిలోల రత్నాల మకరకంఠి 13.6 కిలోల నవరత్న కిరీటం, 500 గ్రాముల అరుదైన గరుడ మేరు పచ్చ ఆభరణం
రతన్ టాటా, అంబానీలు, విజయ్ మాల్యా, గోయెంకా మొదలైనవారు--1940 లో వజ్ర కిరీటం, 1954 లో వజ్రాల హారం, 1972 లో వజ్రాల శంఖు చక్రాలు, కర్ణపత్రాలు, 1974 లో కటిహస్తం
1986 లో 5 కోట్ల విలువైన వజ్రాల కిరీటం తి.తి.దే వారు చేయించారు.
ఇప్పటికి మూలబేరానికి 8 కిరీటాలు, ఉత్సవ బేరాలకి 7 కిరీటాలు వున్నాయి.  

13-11-2008

ఆపోలో ఆస్పత్రుల అధిపతి శ్రీ ప్రతాప్ సి. రెడ్డి చేత, 5 కిలోల బరువూ, 80 లక్షల విలువా చేసే—అభయ, కటి హస్తాలు.

18-11-2008

తిరుపతి శాసన సభ్యులు వెంకటరమణ--పద్మావతి అమ్మవారికి--ఇరవై లక్షల విలువైన 2 కేజీల బంగారంతో తాపడం చేసిన 'అశ్వ వాహనం'

(ఇంతకు ముందు రెండు మూడు రోజుల క్రితం, ఇంకో కానుక యెవరో ఇచ్చారు గాని, వివరాలు వెదక లేక పోయాను—అందుకే, ఇదే మొదటి నమోదు!)

17-1-2009

—ఫాబ్ టెక్ కంపెనీ వారు రూ. ఒక కోటి విరాళం.
ఇంతకుముందు రూ. రెండు కోట్లు విరాళమిచ్చిన స్విస్ మహిళ ఎలిజబెత్ జెయిగ్లర్.

09-03-2009

--వీరెంద్ర మహేష్ గౌడ్ అనే ఆయన ముంబాయి నించి--51 లక్షల నగదు--అన్నదానం ట్రస్టు కోసం వినియోగిస్తామని ఈ వో ప్రకటన!

(ఈ మధ్యలో కొన్ని కానుకలు వచ్చాయి గానీ, వాటిని యెప్పటికప్పుడు ఇందులో చేర్చలేకపోయాను! మీకెవరికైనా తెలిస్తే, నాకుచెప్పెనాసరే, కామెంట్ లో వ్రాసినా సరే!--మీ యిష్టం)

11-06-2009--కర్ణాటక ఎమ్మెల్యే, ఇనుపఖనిజం ఫేం 'గాలి జనార్దన రెడ్డి ', 45 కోట్ల ఖర్చుతో, ఓ సరికొత్త బంగారు,వజ్ర కిరీటం!

25-07-2009--నవీన్ జిందాల్ దంపతులు--రూ.46 లక్షల విలువ చేసే బంగారు శంఖుచక్రాలు,తిరుచానూరు పద్మావతీ అమ్మవారుకి ఎస్ ఆర్ కన్నన్ అనే ఆయన రూ.1.50 లక్షల విలువ చేసే బంగారు హారం.

15-10-2009--ఎం పీ మేకపాటి రాజమోహన రెడ్డి, కుటుంబ సభ్యులూ--20.785 కిలోల బరువుగల, 3.69 కోట్లు ఖర్చైన 'స్వర్ణ పీతాంబరం'

01-08-2009
న్యూఢిల్లీ కి చెందిన అజయ్ మోడీ దంపతులు ప్రతిపాదిత కంటి ఆస్పత్రి కోసం రూ. 50 లక్షలు విరాళం

{17-08-2009
 బెంగుళూరు నగరానికి చెందిన విమల తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం 16 లక్షల విలువైన 'కిలో బంగారాన్నీ 'అనంత స్వర్ణమయం' కోసం ఇచ్చారు.  ఇది శ్రీ వారి తరఫున 'ఆది కేశావుడి ' ముష్టి లో భాగం కాబట్టి, శ్రీ వారికి చెందని కానుక కాబట్టి అంత పెద్ద బ్రాకెట్టేశాను!}

{31-08-2009
మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి విజయ్వనిత్ తివారీ రెండు కిలోల బంగారాన్నీ, ఇంకో అఙ్ఞాత హైదరాబద్ భక్తుడు ఇంకో కీలో బంగారాన్నీ--'.........స్వర్ణమయం' కోసమే ఇచ్చారట.}