ధర్మ దర్శనం
మొన్నీమధ్యనే, సామాన్యులకి దర్శన సమయం 23.5 గంటలు పెరిగే ప్రతిపాదనలకి, పాలక సభ్యులు 'ససేమిరా' అన్నారు!
మళ్ళీ ఈ నెల మొదటివారం లో జరగబోయే పాలకమండలి సమావేశంలో 'కొన్ని కీలక నిర్ణయాలూ తీసుకోవచ్చట!
వాటికి ప్రాతిపదిక--తి తి దే మాజీ కార్య నిర్వహణాధికారీ, ప్రస్తుత సలహా సంఘ సభ్యుడూ శ్రీ పీ వీ ఆర్ కే ప్రసాద్ ఇచ్చిన నివేదికట.
ఆయన చెప్పిన (బుద్ధున్నవాడెవడైనా చెప్పే) విషయాలు--
1. తోమాల, అర్చన సేవల్లో పాల్గొనేవాళ్ళు--కూర్చొని కాకుండా, నిలబడి వుంటే, ఆ సమయం లో దాదాపు 5 వేల మందికి దర్శనం కల్పించవచ్చుట.
2. ఆర్జిత సేవలని తెల్లవారుజామున 3.30 నుంచి 6.30 లోపల పూర్తిచేసి, ఆ సమయం లోనే ప్రత్యేక దర్శనాలూ చేయించాలట.
(ఆసలు, 'మునుపెప్పుడో పడవల్లో ప్రయాణించే రోజుల్లో.....' అన్నట్టు--కాటేజ్ ల అద్దెలూ, గెస్ట్ హౌస్ ల అద్దెలూ లాంటి శాశ్వతాదాయ మార్గాలు లేని రోజుల్లో, స్వామి వారి ఆదాయం పెంచడానికి ఈ సేవలని ప్రవేశ పెట్టారు--అప్పట్లో, వాటి రుసుములు 'అణాల్లోనే' వుండేవి--ఒక్క కళ్యాణానికి తప్ప! ఇప్పుడివన్నీ పూర్తిగా రద్దు చేస్తే యేడిచేవాడెవడు?)
3. ధర్మ దర్శనాన్ని ఉదయం 6.30 నించి నిరాటంకంగా సాగించి, ప్రత్యేక సేవల పేరిట క్యూను నిలిపి వేయ వద్దు అనిట.
4. సెల్లార్, అర్చనానంతర, తదితర దర్శనం టిక్కెట్లని రద్దు చెయ్యాలిట. (సెల్లార్ దర్శనం వొక్కటీ వుంచచ్చు--మిగిలినవి రద్దు చేసి--ఆ క్యూ వేస్ట్ అయిపోతుంది కదా? ఈ టిక్కెట్లని జారీ చేసే అధికారమంటూ యెవరికీ కట్టబెట్టకూడదు--కొనుక్కొనే వాళ్ళందరికీ--రోజుకి ఇన్ని అని అమ్మాలి--అంతే!)
5. వీ ఐ పీ, వీ వీ ఐ పీ దర్శనాలకు నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి--ఉదయం గంట, సాయంత్రం గంట! ఆ సమయం లోనే వారికి దర్శనం కల్పించాలిట.
6. సోమవారం 'అష్టదళపద్మ ' సేవలూ, బుధవారం 'సహస్ర కలశాభిషేకాలూ' మూలవిరాట్టుకి కాకుండా ఉత్సవ బేరాలకి చేయిస్తే, అదనంగా 4-5 వేలమందికి దర్శనం దక్కుతుందట! (దీనివల్ల శ్రీ వారి మూలబేరం అరిగిపోవడం, రంగుమారడం లాంటివి జరక్కుండా వుంటాయి!)
అన్నీ చక్కని సిఫార్సులే! మరి మండలి బాబులు (జనాలు తిట్టినా, ముఖ్య మంత్రి కళ్ళెర్రజేసినా చలించని చరిత్రగలవారు)యేంచేస్తారో--చూద్దాం!
