Friday, May 30, 2014

శేషాద్రీ............


.............డాలర్లూ

చాలా కాలం తరవాత మళ్లీ ఈ బ్లాగులో వ్రాయవలసిన అవసరం కనిపిస్తూ వుంది.

మోడీ ప్రథాన మంత్రి కాబోతున్నాడని నిర్ధారణకాగానే, మన తి తి దే వారు, తట్టా, బుట్టా తో ఢిల్లీ వెళ్లిపోయి, ఆయనకి ఆశీర్వచనాలూ, శేష వస్త్రాలూ, ప్రసాద సమర్పణా చేసేసి వచ్చేశారు....ధూం ధాం గా....యెవరూ రమ్మనకపోయినా!

వాళ్లలో ప్రముఖుడు డాలరు శేషాద్రి!

(ఆయన మెడలో డాలరు యెప్పుడూ ధరిస్తాడు కాబట్టి అలా పిలుస్తారు అంటారు కొందరు. కాదు, శ్రీవారి డాలర్ల కుంభకోణం లో ఆయనకి సంబంధం వుంది కాబట్టి అంటారు ఇంకొందరు.)

ఆయన యెప్పుడో పదవీ విరమణ చేసినా, ప్రత్యేకం గా ఓ ఎస్ డీ (ఆఫీసర్ ఆన్‌ స్పెషల్ డ్యూటీ) కొనసాగుతున్నాడు. 

ఈయన చేసే "స్పెషల్ డ్యూటీ" యేమిటీ? 

కొండకి యెవరు యెప్పుడు రాబోతున్నారో అధికార సమాచారం ద్వారా గానీ, వాళ్ల తైనాతీల ద్వారాగానీ ముందే తెలుసులోవడం, అక్కణ్ణుంచీ వాళ్లకి "తగిన" యేర్పాట్లు చేయడం లో నిమగ్నం అవడం!

ఉదాహరణకి, ప్రథానమంత్రులూ, ముఖ్యమంత్రులూ వగైరాలకి "ఇస్తి కఫాల్, పుచ్చుకొంటి కఫాల్" లాంటి స్వాగతాలూ వగైరాలు; సినిమా వాళ్లకీ, అంబానీల్లాంటి వాళ్లకీ, రౌడీ మూకలకీ....ఇలా అందరికీ "తగిన" యేర్పాట్లు చేయడం; కొండొకచో, వాళ్ల బసల్లో భోజన, ఫలాహార, ఇతర యేర్పాట్లు చేయడం; అప్పటి తి ది దే ఛైర్మన్‌ ని బట్టి, పేరు చివర నాయుడు, రెడ్డి, రాజు అని వున్న వాళ్లందరికీ ఉచిత దర్శనాలూ వగైరా లు యేర్పాటు చేయడం--ఇలా.

అప్పుడెప్పుడో, కొన్ని అవకతవకలమీద దర్యాప్తు పూర్త్తయ్యేవరకూ ఆయన కొనసాగవలసిందే అన్నారు ప్రభుత్వం వారు. మరి అవి యెప్పుడు పూర్తవుతాయో.......లేక ఆయన కి అది జీవిత పదవో?

పాపం ఆయన "నేనింకా అద్దెకొంపలోనే నివశిస్తున్నాను.....యేమీ సంపాదించుకో లేదు.......పిల్లా పాపా లేరు......యెవరికోసం సంపాదిస్తాను......"అంటూ వాపోతాడు.

ఆయనకి శాశ్వత గృహం, జీవన భృతీ వగైరాలు యేర్పాటు చేసి, విశ్రాంతి ఇవ్వవలసిన అవసరం కనిపించడం లేదూ?

Friday, October 12, 2012

ఆపదమొక్కులవాడూ......



..........ఆగమ శాస్త్రమూ

అప్పుడెప్పుడో, శ్రీ రామానుజులవారు, ఆయన మరో ఆగమానికిచెందినా, స్వామికి మాత్రం అన్నీ "వైఖానస" ఆగమం ప్రకారమే జరగాలని శాసించారట. 

ఆ ఆగమం ప్రకారం, స్వామిని రోజూ కొంచెం సేపైనా నిద్రపుచ్చాలని ఇప్పుడు గుర్తొచ్చిందట పెద్దలకి. 

అందుకని ఇప్పుడు ప్రతీరాత్రీ 1-30 కి ఆయనకి పవళింపు సేవ జరిపి, "జో అచ్యుతానంద......." అంటూ నిద్రపుచ్చుతారట.....కనీసం ఓ గంటసేపు! 

ఇప్పుడు దర్శనాల్లో మూడు రకాలు--ఐ పీ లూ, వీ ఐపీ లూ, వీ వీ ఐపీ లూ--అని వున్నాయట, వాటిని ఇప్పుడు రెండే రకాలుగా విభజిస్తే చాలని ఒకాయన అంటే, ఇంకొకాయన కుదరదు, మూడూ వుండాల్సిందే అంటున్నాడట!

అసలు ఇలాంటివి యే ఆగమం ప్రకారం జరుగుతున్నాయో వాళ్లెవరూ చెప్పట్లేదు. 

ఆసలు ఆగమ శాస్త్రం ప్రకారం ఐతే, స్వామికి రాత్రి 8-30 కి ఏకాంతంలో తోమాలసేవా, అర్చనా అయ్యాక నైవేద్యం పెట్టి, మూడో గంట కొట్టాక, ఓ గంటసేపు ధర్మదర్శనానికి అనుమతి ఇచ్చి, 10-00 గంటలకల్లా పానుపు సేవ/పవళింపు సేవ (ఐదుగురికి రూ.13/- మాత్రమే వసూలు చేసి) జరిపించేవారు. మళ్లీ సుప్రభాత సేవ ఉదయం 6-00 గంటలకి. (ప్రతీ శనివారం రేడియోలో ప్రారంభ కార్యక్రమంగా రిలే చేసేవారు).

ఇంక ప్రసాదాల విషయానికొస్తే, మధ్యాహ్నం 12-00 కి నైవేద్యం అయి మొదటిగంట కొట్టాక, అందరికీ "ఉచితంగా" ముఖ్య ప్రసాదమైన, స్వామికి సమర్పింపబడిన "శ్రీచందనం"; కర్పూరనామానికి చెందిన "శ్రీపాదరేణువు" ఇచ్చేవారట. (ప్రతీ గురువారం పచ్చకర్పూరనామం తొలగించడం ఆచారం. ఆ కర్పూరమే శ్రీపాద రేణువు.)

ఇప్పుడు ప్రసాదం అంటే--లడ్డూలే--రోజూ ఇన్ని లక్షలు చేయిస్తున్నాము, బ్రహ్మోత్సవాలకి మరిన్ని లక్షలు చేయిస్తాము--ఇలా! 

పై ముఖ్య ప్రసాదం కాకుండా, భక్తులు నైవేద్యంగా సమర్పించే ప్రసాదాలని కూడా యాత్రికులకి ఉచితంగా పంచిపెట్టేవారు. (నైవేద్యం పెట్టేవాళ్లు ఆ ఖర్చుని భరించి, దేవస్థానానికి నిర్ణీత రుసుము చెల్లించి, రశీదు పొందేవారు.)

ఆ ప్రసాదాలు రెండు రకాలు--అన్న ప్రసాదాలు, "పడుల" ప్రసాదాలు అని.

1. దధ్యోదనము; 2. పులిహోర; 3. పొంగలి; 4. చక్కెర పొంగలి; 5. సాకర బాత్; 6. కేసరి బాత్; 7. పాయసము; 8. నీరా--ఇవీ అన్న ప్రసాదాలు.

1. లడ్డు; 2. వడ; 3. పోళి; 4. దోసె; 5. అప్పము; 6. తేనె తొళ; 7. సుఖియ; 8. మనోహరము; 9. జిలేబి; 10. ఊకాయ పచ్చడి (చేయించువారే కాయలు సప్లై చేయవలెను.)--ఇవీ పడుల ప్రసాదాలు. 

ఏ ప్రసాదానికి ఆ రుసుము చెల్లిస్తే, వారిపేరనే వైవేద్యం సమర్పించి, చేయించినవారికి కొంత ప్రసాదం ఇచ్చి, మిగిలినవి యాత్రికులకి ఉచితంగా పంచిపెట్టేవారు. 

ఒకవేళ పై నైవేద్యాలు సమర్పించలేనివారు అయితే, కలకండ; కొబ్బరి; జీడిపప్పు మొదలైనవానిని తగిన సొమ్ము స్వీకరించి, రశీదు ఇచ్చి, అవే నైవేద్యం పెట్టి, ప్రసాదాలుగా ఇచ్చేవారు. 

ఇప్పట్లో చాలామంది "భక్తులు" పై ప్రసాదాల పేర్లయినా విని వుండరు! ఈ సారి వెళ్లినప్పుడు, వీటి విషయమై "పారుపత్య దారు" ని ప్రశ్నించండి. 

ఇదివరకు లేని "బ్రేక్" దర్శనాలూ, సెల్లార్ దర్శనాలూ, ఏ ఆగమం ప్రకారం నిర్వహిస్తున్నారో అడగండి.

పీఠాధిపతులు కూడా, దేవాలయానికి యెదురుగా నిర్మించబడిన అతి పెద్ద "సత్రం"--110 కుటుంబాలకి వసతికి అనుకూలంగా చిన్ని గృహములుగా మార్చబడిన దానిని--పడగొట్టడం ఆగమ శాస్త్రానికి విరుధ్ధం అని వాదించకుండా, నిజంగా ఆగమానికనుగుణంగా సేవలూ అవీ జరిపించడానికి కృషి చెయ్యాలి.

దక్షిణ భారతంలోని అన్ని ఆలయాలూ, కోవెలలూ మధ్యాహ్నం, రాత్రీ నిర్ణీతవేళల్లో మూసేస్తారు. వాళ్లది వేరే ఆగమమేమో అని డబాయించినా, ఇక్కడా ఆగమం అనేది ఒకటి వుంది అని ఒప్పుకొని, జనాలు యెగబడుతున్నారు కాబట్టి వీలైనంత సొమ్ము చేసుకుందాం అనే ధోరణిని యెప్పుడు విడిచిపెడితే అప్పుడు తిరుమల కి మళ్లీ "పవిత్రత" చేకూరుతుంది. 

ఇవన్నీ జరగాలంటే--ఆ స్వామే పూనుకోవాలి!

{పైన వ్రాసిన విషయాలు అధికారికంగా తి తి దే 1956--దుర్ముఖి; ఆశ్వయుజంలో ప్రచురించిన, నాలుగణాల వెలగల "తిరుపతి" (తిరుమల యాత్ర వివరములు) అనే పుస్తకం నించి గ్రహించబడ్డాయి}

Saturday, November 5, 2011

శ్రీగిరి శ్రీపతి

లడ్డూల వితరణ 


తి తి దే వారి బుధ్ధి వెర్రితలలు వేస్తోంది అనడానికి ఇంకో వుదాహరణ--లడ్డూ విక్రయానికి "ఏ టీ ఎం"లు యేర్పాటు చేస్తారట! 

అదికూడా యెలాగ? 

చూపుడువ్రేలి ముద్రని "సేకరించి" ఆ చాయాచిత్రాన్ని భద్రపరుస్తారట. అక్కడే లడ్డూలకి నగదు చెల్లింపు కూడా చెయ్యాలట! 

అదయ్యాక, ఏటీఎం కి వెళ్లి, వ్రేలిముద్ర వెయ్యగానీ, అది లడ్డూలని "విసర్జిస్తుందట!" 

అదికూడా, పర్యావరణ హితం కోరి, "కాగితరహిత" విధానాన్ని ప్రవేశ పెట్టడానికేనట! 

యేమన్నా బాగుందా? 

లక్షలో, కోట్లో ఖర్చుపెట్టి, మరిన్ని కుంభకోణాలకి తెరలేపడానికి కాకపోతే.....? ఇంత దివ్యమైన అవిడియా ఇచ్చినవాళ్లకి యెవార్డు కూడా సిఫార్సు చేస్తారేమో! 

ఇప్పటి పధ్ధతిలో, ప్లాస్టిక్ కవర్లు బ్యాంకు కవుంటర్లలో కొనుక్కోవాలి. వాటిని లడ్డూ కవుంటర్లో ఇస్తే, వాటిలో లడ్డూలు నింపి, మన చేతికి ఇస్తారు. అంతకు ముందే, ఇంకో కవుంటర్లో నగదు చెల్లించి పొందిన రసీదుని వారికి ఇవ్వాలి. 

ఈ పధ్ధతిలో, చక్కగా కొన్నివేల లడ్డూల వితరణ జరుగుతోంది! ఇంకా త్వరగా జరగాలంటే, కవుంటర్లనీ, సిబ్బందినీ పెంచాలి. 

నాకు తెలీకడుగుతా, డబ్బు తీసుకొని, వ్రేలి ముద్ర సేకరించి, నిక్షిప్తం చెయ్యడానికి, (రసీదు ఇవ్వకుండా) యెంత సమయం పడుతుంది? 

ఏటీఎం లో లడ్డూలు ఒకదాని తరవాత ఒకటి విసర్జింపబడడానికి యెంత సమయం పడుతుంది? తీరా వస్తే, అవి యే షేపులో వుంటాయి? 

క్రింద "ట్రే" యే ఆకారంలో వుంటుంది? పడిన లడ్డూలు దొర్లుకొంటూ ఇంకో ట్రే లో పడతాయా? 

లేక మనం ఆ క్రింద తట్ట పట్టుకొని సిధ్ధంగా వుండాలా? 

నగదు వితరణ జరిగే ఏటీఎం లలోనే, ఖాతా నిల్వ సరిచూసుకోడానికీ, తరవాత నగదు పొందడానికీ, రసీదు, కార్డు పొందడానికీ యెంతలేదన్నా ఐదు నిమిషాల పైనే పడుతోంది. 

మరి ఈ ఏటీఎం లు రోజంతా పనిచేసినా, యెంతమందికి యెన్ని లడ్డూలు వితరణ చెయ్యగలవు? 

ఒకవేళ అవి "మొరాయిస్తే" దిక్కెవరు? 

ఇంకెవరు! యేడుకొండలవాడే......యెప్పుడూ మన భక్తులకి!

Saturday, September 3, 2011

దర్శనాలూ



తరించేలా సేవలూ

"శ్రీవారి భక్తులకి విశేషమైన సేవలందించి వారి ఆత్మీయతను అందుకుంటాను.
ఉడతాభక్తిగా శ్రీవారి సేవలో పాల్గొని యాత్రికుల కష్టాలను తొలగిస్తాను.
వసతి సౌకర్యం కల్పనలో ఎదురవుతున్న సమస్యలను తొలగిస్తాను.
భక్తులే దేవుళ్లుగా సేవలందిస్తానని హామీ ఇస్తున్నాను.
అలిపిరి నుంచి తిరుమలకి వచ్చి, శ్రీవారిని దర్శించి, తరించి, తిరిగి అలిపిరి చేరేవరకు నేను పూచీగా వుంటాను"
"ముఖ్యమంత్రి కి కు రె విశ్వాసాన్ని వమ్ముచేయకుండా నడుచుకుంటాను.
సోనియాగాంధీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాను"

......ఇవన్నీ క్రొత్తగా తి తి దే పాలకమండలి అధ్యక్షులుగా ప్రమాణస్వీకారం చేసిన బుగ్గమీసాల బాపిరాజుగారి వువాచలు!

మరి ఈయన వొరగబెట్టింది యేమిటి?

బంగారువాకిలిలోని గరుడాళ్వారు ముందు ప్రమాణస్వీకారం చేశాడు ఇతర సభ్యులందరితోనూ, ప్రతీ సభ్యుడి వెనకా మూకలతోనూ!

3 గంటలకి పైగా భక్తుల దర్శనాన్ని నిలిపేశారుట! భక్త దేవుళ్ల "సేవకి" అలా శ్రీకారం చుట్టాడన్నమాట!

200 మంది అనుచరగణం బంగారువాకిలి లోకి చేరుకొన్నారట. ఇంకో 400 మంది బయట వెండివాకిలివరకూ ఆక్రమించారట! అందరూ బంగారువాకిలిలో దూరడానికి తోసుకున్నారట. సిబ్బందితో వాగ్వాదం చేశారట. యెలాగైతేనేం, ప్రమాణస్వీకారం అయ్యాక, అందరూ లోపల చొరబడ్డారట!

అదీ శ్రీవారిమీద ఆయనకీ, అనుచరులకీ వున్న గౌరం, భక్తీ!

భార్యతో శ్రీవారి కళ్యాణోత్సవం లో పాల్గొన్నారట. రాత్రి మళ్లీ "అనుచరగణానికి" వీ ఐ పీ దర్శనానికి యేర్పాట్లు చేశారట! ఇదీవారి "ఉడతాభక్తి"!

పద్మావతి నగర్లో అతిథిగృహాలు ఖాళీలేకుండా పోయాయట!

ఇవీ ఆయన వసతి సౌకర్యాల కల్పనలో సమస్యలని తొలగించే, భక్తులే దేవుళ్లుగా సేవలందించే, దర్శించి తరించేవరకూ పూచీపడే--పధ్ధతులు! 

ఈవోగారిమీద ఇదివరకే యేవో ఆరోపణలున్నాయన్నారు. మరి ఇప్పుడు వీళ్లిద్దరూ కలిస్తే, యెన్నికొండలని కరిగించడానికి ప్లాన్లు వేస్తారో!

బాగుంది కదూ రాజుగారి పాలన!

Tuesday, August 23, 2011

శ్రీవారి ఆలయం-2



దర్శనాలూ

రావులపర్తి భద్రిరాజుగారేమో.....ఖచ్చితంగా నాకు తెలీదు....."యేడుకొండల శ్రీనివాసా......." అనే పాటలో వ్రాశారు.......

"కోటికీ పడగెత్తినా ధనవంతుడూ.....నీ గుడి ముంగిటా సామాన్యుడు....."(గుడి ముంగిట అన్నారుగానీ, గుడిలోపల అనలేదు చూడండి!)

"కూటికోసం శ్రమ పడే నిర్భాగ్యుడూ.....నీ కృపకెప్పుడు సమపాత్రుడు....." (కృపకి సమపాత్రుడు --అంటే అర్హత వున్నవాడు అన్నారుగానీ--ఆ కృపని అందుకుంటాడని గ్యారెంటీగా చెప్పలేదు!).

ఇవన్నీ యెంత నిజాలూ.....!

Monday, August 22, 2011

శ్రీవారి ఆలయం



దర్శనాలూ

మొన్నేదో "డయల్ యువర్ ఈవో" నో ఇంకేదో కార్యక్రమంలో, భక్తులు చెప్పినమేరకు, శ్రీవారి వెండివాకిలి నుంచి బంగారు వాకిలి వరకూ, భక్తుల నడక ఒకే యెత్తులో వుండేలా (మరి  ఇన్నాళ్లూ భక్తులు దేవుణ్నే చూశారా, తమకాళ్లు యెక్కడ వేస్తున్నమో చూసుకొంటున్నారా?) "చెక్క బెంచీల" యేర్పాటు చేస్తామని సెలవిచ్చారు. ఇన్నాళ్లూ చెక్కలు లేవా? వున్నాయి కానీ గుమ్మాలెక్కడం దిగడంలో యెగుడుదిగుడుగా--యెత్తుగా, వాలుగా, ఇంకోలా (జనాలు బోల్తా కొట్టేలా!)

ఇప్పుడు చేస్తామన్న యేర్పాటు బాగానే వుంది గానీ, ఇన్నాళ్లూ వారికి తెలియదా ఈ సంగతి? కొన్ని లక్షలో యెన్నో ఖర్చుపెట్టడానికి కాకపోతే, జనాల చెవుల్లో పువ్వులు పెట్టడానికి కాకపోతే, ఈ యేర్పాటు యెందుకు? మరి పాత చెక్కలు యేమి చేస్తారు?

వీటన్నింటికీ బదులుగా, వాకిళ్లని సన్నగా వుండే వాళ్లయితే ఇద్దరు, మీడియంగా వుండేవాళ్లయితే, 1న్నర మంది, కాస్త లావు వాళ్లయితే ఒక్కరే పట్టేలా మార్పు చేస్తే, ఇంక తోపులాటలు వుండవు కదా? దానికి ఖర్చు కూడా యెక్కువ కాదు--ఇంకా వెండి, బంగారు తాపడాల్లో బోళ్లు మిగులుతుంది!

చేస్తారా? చూద్దాం!

Wednesday, May 25, 2011

శ్రీవారి ఆలయం



సేవలూ, పురావస్తు

శ్రీసేవ "ప్రాజెక్ట్" నిపుణుల సూచనలు వివాదాస్పదమౌతున్న నేపధ్యంలో ప్రాజెక్టుని సమీక్షించి, తుదిమెరుగులు దిద్దడం, అనుమానాలని నివృత్తి చెయ్యాలని సాధికార మండలి భావిస్తోంది(ట) 07-02-2011 న.

శ్రీవారికి విరాళాలు ఇచ్చే 'భక్తులకు ' ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకు రావాలని "తి తి దే" (అంటే సాధికార మండలి అని కవి హృదయం!) నిర్ణయించింది(ట). దాతలనుంచి విరాళాలు అందినవెంటనే, వారికి ప్రత్యేక "పాసు పుస్తకాలు" జారీ చేస్తారు(ట). 

తిరుమలలో క్రొత్తగా నిర్మిస్తున్న నిత్య అన్నదాన సముదాయాన్ని ఉగాదినాటికి అందుబాటులోకి తేవాలని ప్రయత్నిస్తున్నారు(ట). "రోటీ"లు వడ్డించడానికి కూడా యేర్పాట్లు చేస్తున్నారు(ట). (పులిని చూసి నక్క వాతలు పెట్టుకొంటే, వాతలు లేని నక్కని చూసి పులి తన చారలు "డిటర్జెంట్" తో తొలగించుకుందామనుకుందిట!). అంటే, షిరిడీ & తిరుమల ఆర్ హేండ్ ఇన్ హేండ్! (మన బుర్రోవాదుల ఆలోచనలు ఇలాగే వుంటాయి మరి!)

"మూడువేలమంది" (ఇదేదో అప్పుతచ్చు అనుకుంటా!) భోజనం చేసే సౌకర్యం వున్న నేపధ్యంలో, ఆ మేరకు సిబ్బంది నియామకం పై కూడా 'సమీక్షించారు'(ట). 

ఇంతవరకూ బాగానే వుంది. 

శ్రీవారి ఆలయాన్ని పురావస్తు శాఖవారికి అప్పగిస్తాము అని నిశ్చయించిన, (మళ్లీ "థూ నా బొడ్డు" అనుకొన్నారు!) సందర్భంలో, పురావస్తు శాఖ సంచాలకుడు, "నిత్యపూజలూ, వుత్సవాల్లో తమ జోక్యం వుండబోదు" అని ప్రకటించారట--"వొకవేళ ఆ దేవాలయం తమ పరిథిలోకి వచ్చినా"--అని! (ఆలూ లేదు, చూలూ లేదు, కొడుకు పేరు....అన్నట్టు!)

ఒకవేళ అలా జరిగినా, "ఆలయంలో ఓ మేకు కొట్టాలన్నా, తమ అనుమతి తీసుకోవాలంటూ జరుగుతున్న 'ప్రచారంలో' యేమాత్రం నిజం లేదని కూడా చెప్పారట వారు. (పురావస్తు శాఖవారి అధీనంలో వున్న యే నిర్మాణంలో అయినా, యెవరైనా, వాళ్లిష్టం వచ్చినట్టు మేకులు కొట్టుకోవచ్చా? అనే విషయం యెవరూ ఆయనని అడగలేదు మరి.) 

ఇంకా, ఆలయ పాలకమండలి ఛైర్మన్లు మారినప్పుడల్లా వాళ్ల ఇష్టానుసారంగా ప్రాచీన నిర్మాణాలని 'ధ్వంసం' చేస్తున్నారనీ, వేయికాళ్లమంటపం, వాహన మండపాల కూల్చివేతే ఇందుకు నిదర్శనమనీ కూడా అన్నారు(ట).

.....తరువాయి మరోసారి.