Saturday, June 13, 2009

నీ కొండకు నీవే రప్పించుకో--7

నా శ్రీవారి దర్శనం! ఇక సీరియస్ గా దర్శనం, అనుభవం గురించి వ్రాస్తాను. గర్భగుడి ముందు క్యూ లోకి యెడమవైపు తిరిగినప్పటినుంచీ, నా ముందున్నవాళ్ళ తలల, మెడల పక్కనించీ స్వామిని చూడాలని అందరిలాగే ఆతృత! ముందు ‘సంజీవనీ పర్వతం యెడమచేత్తో పైకెత్తిపట్టుకుని, కుడిచేత్తో గదతో, వాలాన్ని తిప్పుతూ, గాలిలోకి యెగుస్తున్నట్టున్న’ ఆంజనేయ స్వామి ఆకారం గోచరించింది! ఒక్క క్షణం ఆశ్చర్యపోయి, దృష్టి కేంద్రీకరించి (నడుస్తూనే) చూడగా—ఓ షాక్ లాంటిది—స్వామి మూలబేరం రోడ్లు వెయ్యడానికీ, ఇళ్ళు కట్టేటప్పుడు కాంక్రీటు వెయ్యడానికీ వాడే కంకర మెటల్—దాన్నే ఇసుక రాయి (సాండ్ స్టోన్) అంటారనుకుంటా – తో తయారు చెయ్యబడ్డట్టు కనిపించింది! స్వామి వరద హస్తం, బేస్ బాల్ బౌలర్ కుడిచేతికి ధరించే తోలు ‘గ్లవ్’ అంత సైజులో, రేడియం లా మెరుస్తూ కనిపించింది! ఇక కటి హస్తం, చిన్నగా, రెండంగుళాల వెడల్పూ, నాలుగంగుళాల పొడవూ వున్న పచ్చ పొదగబడినట్టు, రేడియం లానే మెరుస్తూ, కనిపించింది! పాదాలు కనిపిస్తాయేమో అని వెతికాను! వాటికి వెండి తొడుగులేమీ లేవేమో, యెంత తీక్షణం గా చూసినా, కనిపించలేదు—ఆ మసక వెలుతురులో! స్వామివారికి ఇక యేవిధమైన అలంకారాలూ లేవు! ఇక, నా ముందున్నావిడని రక్షించి, నేను అందరికన్నా ముందున్నప్పుడు, స్వామివారి ‘నవ్వురాజిల్లెడు మోము’ చూద్దామని ప్రయత్నించా—శ్రీ నామం లో మధ్యవుండే యెరుపురంగు మాత్రమే కనిపించింది—ఇంకా బాగా వెతికితే, ఈ పక్కా, ఆ పక్కా నల్లటి రంగులో, కాటుక పెట్టినట్టు సగం నేత్రాలు గోచరమయ్యాయి—శ్రీనామం లో తెల్లటివి స్వామి రంగులో కలిసిపోయినట్టు అలవోకగా దర్శనమిచ్చాయనుకుంటా! ఈ లోపల మెట్టుదిగి యెడమవైపు మళ్ళడం, బయటికి నడవడం, మామూలే! నాకు తెలిసి, స్వామివారి విగ్రహం, నల్లని గ్రానైట్ రాయితో నిగనిగలాడుతూ వుండేది! అందరూ అదే చెప్పేవారు! మరి ఇప్పుడు, అనవసర అభిషేకాలతో, అరిగిపోయి, తెల్లబడిపోయిందా? వెంటనే ఓక నిజ నిర్ధారణ కమిటీని వేసి, రిపోర్టు తెప్పించాలి! అవసరమైతే, నిజరూప దర్శనాలూ, అభిషేకాలూ రద్దుచెయ్యాలి! స్వామి మూలబేరం కలియుగాంతం వరకూ సం రక్షింపబడాలి! ఇది నా ముఖ్య డిమాండ్! మిగిలిన ప్రజలు కూడా, తాము దర్శించినప్పుడు స్వామి యెలా గోచరించాడో, ఆత్మవంచన చేసుకోకుండా బయటపెట్టి, దేవస్థానం మీదా, ప్రభుత్వం మీదా వత్తిడి తేవాలి ఈ విషయం లో! నిజానికి స్వామివారిని అలా అలంకార రహితంగా నేనెప్పుడూ ఊహించుకోలేదు! మా చిన్నప్పుడు వచ్చినె ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ అనే సినిమాలో, చివరలో—శ్రీదేవి, భూదేవి—నారదుడితో అనుకుంటా మాట్లాడుతూ వుండగా, స్వామి నెమ్మదిగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ, యేడడుగులువేసి, కొండచివరికి చేరి, విగ్రహం గా వెలసినట్టు చూపించారు—అదే విగ్రహాన్ని—చాలా విగ్రహాలు తయారు చేయించి, సినిమా ప్రదర్శితమవుతున్న ప్రతీ హాలు ముందూ వుంచారు—జనాలందరూ కొబ్బరికాయలు కొట్టి, హారతులూ, ప్రసాదాలూ పెట్టి, భక్తి పరవశులైపోయేవారు! అప్పుడు చూడడమే స్వామిని—అలంకార రహితం గా! మరి ప్రతీ లక్ష్మివారం, స్వామిని ఇలాగే దర్శనం చేయిస్తున్నారట—యెప్పటి నించి మొదలుపెట్టారో తెలియదు!

Friday, June 12, 2009

నీ కొండకు నీవే రప్పించుకో--6

నేను వెనకనించి ‘ఇంక నడువమ్మా—లేక పోతే తోసేస్తారు—అక్కడ యెడమవైపుకి తిరుగుతూ, మెట్టుదిగు’—అని చెప్పి ఆవిడని రక్షించాను! ఆవిడ వెనకే నేనూ, వెనక మా ఆవిడా, మిగతావాళ్ళూ—రెండు నిమిషాల్లో బయటికి వచ్చేశాము. ఇక్కడ, 1979 లో మేము చేసుకున్న దర్శనం సమయం లో ఓ చిన్న సరదా విషయం! చెప్పానుగా, అప్పుడు శ్రీవారి గర్భగుడివరకూ వెళ్ళి, ఆ ద్వారం ముందు ఓ క్షణం నించొని కనులారా దర్శనం చేసుకొని, నమస్కరిస్తూనే, కుడివైపు తిరిగి వెనక్కి వచ్చేవాళ్ళం! కొంతమంది, ఇంకా తనివితీరక, వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ, నెత్తిమీద దణ్ణం పెడుతూ, తిరిగి వెళుతూండేవారు! అప్పుడు కూడా, ఆ రెయిలింగు వెనక, ఇద్దరు ముగ్గురు ‘ముండలూ, వెధవలూ’ వుండేవాళ్ళు! ముందు నేనూ, నా వెనకాల మా షేహితుడు, తరవాత మిగిలిన వాళ్ళూ—కదులుతూ వుండగా, ఒక ‘ముండ’ యెక్కడా ఆగకుండ అరుస్తూనేవుంది—‘కదలాలి, కదలాలి. ఒక్కొక్కళ్ళూ అంతసేపైతే కుదరదు—‘ అంటూ వాగుతూనే, మాముందు వెనక్కి వెళ్ళిపోతున్నవాళ్ళలో ఒకాయన వెనక్కి తిరిగి చూస్తూ వెళుతుంటే, ‘ఇదుగో! ఇంక అటు తిరుగు—నడువు—లేకపోతే మెడ అలాగే వుండిపోగలదు!’ అని వేళాకోళం చేస్తుంటే, నాకు వొళ్ళు మండింది. అప్పట్లో నేను సరదాగా ‘వెంట్రిలాక్విజం’ అభ్యసించేవాడిని, సరదాగా మా స్నేహితులదగ్గర నా విద్యని ప్రదర్శిస్తూండేవాడిని! నాకు వొళ్ళు మండగానే, అప్పటికి సరిగ్గా గర్భగుడి ముందునించి కుడివైపు తిరుగునున్నానేమో, గంభీరం గా, నా పెదవులు కదలకుండా, ‘నువ్వు నోరు ముయ్యవే!’ అన్నాను—గుడిలోని అర్చక స్వాములు కూడా ఆశ్చర్యంగా స్వామివారివైపు చూశారు!—సాక్షాత్తూ స్వామే మందలించారా అని! క్యూలో వాళ్ళందరూ ఒకసారి గొల్లున నవ్వు! నా వెనకున్న మా స్నేహితుడైతే, బయటికి వచ్చేవరకూ కిసుక్కూ, కిసుక్కూ నవ్వుతూనే వున్నాడు! ఆ ముండ కంగారు పడిపోయింది—యెవరు? యెవరూ? అని అరిచి ఒక్కసారి సైలెంట్ అయి పోయింది! మా స్నేహితుడు, బయటికి హుండీ వైపు వెళ్ళడానికి తిరగ్గానే, ‘మీరే కదూ! అవునా! భలే అన్నారండీ! అందరూ స్వామివారే అనుకున్నారు! భలే అన్నారండీ—నువ్వు నోరు ముయ్యవే!—అని!’ అని ఇమిటేట్ చేస్తుంటే, నేను ‘ష్!’ అన్నాను—యెక్కడ బయట పడిపోతానో అని! ఇప్పటిక్కూడా, మా స్నేహితుడు అది తలుచుకునీ, అందరికీ చెప్పీ, పడి పడి నవ్వుతూనే వుంటాడు! ‘నువ్వు నోరు ముయ్యవే!’ అని చక్కగా ఇమిటేట్ చేస్తూ!

Wednesday, June 10, 2009

నీ కొండకు నీవే రప్పించుకో--5

శ్రీవారి గర్భగుడి ముందు ఒక నడవాలా వుంటుంది. అందులో తిరగేసిన ‘U’ ఆకారం లో క్యూ లైను వెల్లేది. ఆ ‘U’ లో ముందు భాగం లో స్వామివారి గర్భగుడి ద్వారం వుంటుంది. లోపల అర్చక స్వాములు కర్పూర నీరాజనాలు అర్పిస్తూ, దేదీప్యమానంగా సర్వాలంకరణాలతో వెలిగిపోతున్న స్వామివారినీ, వారి పాదాలనీ, కటి, వరద హస్తాలనీ చూపిస్తూ, భక్తులకి వివరిస్తూండేవారు! ఇప్పుడవేవీ లేవు! లోపలికి ప్రవేశించగానే, చీకటి గుయ్యారం! యెడమవైపు తిరిగితే, స్వామివారి మూలబేరం కనిపిస్తుంది! అక్కడ సుమారు ఓ పది అడుగుల మేర క్యూ లైను! ఆ రెయిలింగుకి ఆనుకొని, జారబడి, ఓ పదిహేను, ఇరవై మంది ‘ఖాకీ’ యూనిఫారాలు వేసుకున్న ‘ముండలు’! వాళ్ళ మధ్య అణువంత యెడం కూడా లేదు! ఆ రెయిలింగు వెనకాల, గుహ గోడకి ముందు ఉన్న ఖాళీ స్థలం లో, ఇంకో నలుగురైదుగురు ‘ముండలు’ అదే యూనిఫారాలతో! కుడివైపు రెయిలింగు కి ఆనుకొని, నలుగురైదుగురు ‘వెధవలు’—అలాగే యూనిఫారాలు వేసుకొని! అక్కడ కుడి పక్కనించి, ఇంకేదో క్యూ—వాళ్ళు రాకుండా గొలుసు అడ్డం పెట్టేసి—అక్కడొక ఉద్యోగి!—ఇదీ సీను! (నా ప్రథమ కోపానికి నా మనసులో నాకు తెలిసిన పెద్ద తిట్లుగా ‘ముండలు’, ‘వెధవలు’ అని వాడాను గానీ, నిజంగా వాళ్ళు ‘విధవలూ’, ‘విధురులూ’ కాదన్న విషయం గమనించగోర్తాను!) గోడ పక్కన, (రెయిలింగు వెనక) ఉన్న ఓ ముండ అరుస్తోంది, నా ముందున్న ఓకావిడని ఉద్దేశించి—“యేమ్మా! నువ్వు కదులు—లేదా నీ వెనకున్నవాళ్ళు నిన్ను ‘దొబ్బుతారు’ చూడు—వినపడడం లేదా? నిన్నే! అదిగో! ఇప్పుడు దొబ్బుతారు చూడు” అని! (నిజం గా యెవరూ ‘దొబ్బక’ పోతే, వాళ్ళే రెయిలింగు క్రిందనించి కాళ్ళతో నడుస్తున్నవాళ్ళకి ‘బ్రేకులు’ వేసి, వాళ్ళు పడి పోయేలాగ చేస్తున్నారని నేను గమనించాను! అక్కడ స్వామి గర్భగుడి ముందు నడవా లోకి వెళ్ళకుండా, లైనుని యెడం వైపు తిప్పేస్తారు—అక్కడొక మెట్టులా వుంటుంది—క్రిందిక దిగాలి! వీళ్ళు తొయ్యడం వల్ల, అక్కడ కొంతమంది పడిపోతున్నారు!)

Tuesday, June 9, 2009

నీ కొండకు నీవే రప్పించుకో--4

మా యెడమపక్కన ఉన్న క్యూ లైన్ లో, గుళ్ళో పెళ్ళి చేసుకున్న దంపతులతోపాటు ఓ పది మందికనుకుంటా—సెల్లార్ దర్శనం అనుమతిస్తున్నారు—అలాంటివాళ్ళూ, కొండమీడికి నడిచి వచ్చే వాళ్ళకి వెంటనే సెల్లార్ దర్శనం అనుమతిస్తున్నారట—అలాంటివాళ్ళూ వెళుతున్నారు! రెండు క్యూ లైన్లూ పడమర మాడావీధి కనిపిస్తూండగా, పైకి మెట్లు యెక్కి వెళ్ళవలసివుంది. అక్కడ, పైకి యెక్కేసరికి, ఇంకా యెడమ పక్క వున్న క్యూ లైన్ నించి మా యెడమ పక్క క్యూలైన్ లోకి తెరుచుకొనే గేటు తెరిచారెవరో! ఆ క్యూలు రెండూ కొంతసేపు కలిసి పోవడమే కాదు, వాళ్ళ లైను త్వరగా కదిలి పోయింది! మా లైను ఓ పావుగంట కదల్లేదు! (ఆ గేటు ని యెవరో ‘మేనేజి’ చేసి వుంటారని మా లైన్లో అనుమానాలు!) అక్కడి నించి ఓ గదిలో ప్రవేశించి, మళ్ళీ మెట్లెక్కుతూ, కుడివైపు తిరుగుతాయి క్యూ లైన్లు. అక్కడ మాత్రం, చీమల బారుల్లా నెమ్మదిగానే కదిలాయి లైన్లు! ఆ తరవాత, మెట్లు క్రిందికి దిగి, మాడా వీధి గుండా క్యూ లైన్లు త్వర త్వరగానే కదిలి, దక్షిణ మాడా వీధికి మలుపు తిరిగి, త్వరలోనే మహర్ద్వారం దగ్గరికి చేరాము! ఈ లోపల, నా క్రితం దర్శనాల్లో, ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లూ, సెల్లార్ దర్శనాలూ లేవని, ముఖ్య ప్రాకారం చుట్టూ మాత్రమే క్యూ లైను (సర్వ దర్శనానికి) వుండేదనీ, అప్పటిలో పాతిక రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్ కొనుక్కున్న వారిని మహర్ద్వారం దగ్గర సర్వదర్శనం క్యూ లైన్ లో కలిపేవారనీ, మేము 1975 లో చేసుకున్న దర్శనం అదేననీ) (ఆ దర్శనం గురించి ఇంకో సంచలన నిజం తరవాత చెపుతాను!) ఆ క్యూ ప్రాకారం లోపల మళ్ళీ గోడ పక్కనే వెళుతూ, వెండివాకిలి దగ్గరకి చేరేదనీ, అప్పుడు వీఐపీ లని, మహర్ద్వారం గుండా బంగారువాకిలి దగ్గరకి తీసుకెళ్ళి, అక్కడ గర్భ గుడి దగ్గరదాకా వెళ్ళే జనరల్ క్యూ లో కలిపేవారనీ, బంగారు వాకిలి లోపల యెంతటివారైనా ఒకటే అనీ, (1979 లో నేను చేసుకున్నది వీఐపీ పాస్ దర్శనమే అనీ) నా ఙ్ఞాపకాలు చెప్పాను! ఇప్పుడు ప్రాకారం లోపల గోడ పక్కన క్యూలు లేవనుకుంటా! లేకపోతే, అదంతా గడిచి సర్వ దర్శనం వాళ్ళు వచ్చారో తెలీదుగాని, వెండి వాకిలి ముందు ఓ పెద్ద మంద చేరింది! అక్కడ నించి తోపులాటలు మొదలు! వెనకవాళ్ళు ‘గోవిందా! గోవింద!’ అంటూ ఒక్క తోపు తొయ్యడం, ముందువాళ్ళు ఇత్తడి కంచెలకి నొక్కుకు పోవడం! పాత ధ్వజ స్థంభం ముట్టుకోవడానికీ, కొత్త ధ్వజ స్థంభం (పాత ధ్వజ స్థంభం యెప్పటినించో లేదు--స్థంభ మూలం మాత్రమే వుంది! మరి అది వుండగా, ఇంకో కొత్తమూలం, ఇంకో ధ్వజ స్థంభం యే ఆగమ శాస్త్ర ప్రకారం నిర్మించారో వారికే తెలియాలి!) ముట్టుకోడానికి అదే తోపులాట! అక్కడికి నలిగి నలిగి, వెండి ద్వారం ముందుకి చేరాం! అక్కడొక ఇరవై నిమిషాలపాటు వుండిపోయాం! (పదకొండు గంటల నించీ—వికలాంగులకి, వయోవృద్ధులకీ ప్రత్యేక దర్శనాలు వుంటాయట—వాళ్ళు వెండివాకిలి గుండా తిరిగి వస్తూనే వున్నారు అంతసేపూ! (దేవస్థానం వాళ్ళు ఇలా ప్రత్యేక దర్శనాలకి కేటాయించడం చాలా ముదావహమని మాలో మేము సంతోషించాము!) ఇంతలో, మా కుడిపక్క ఇంకో ప్రత్యేక క్యూ వెలుస్తోంది—దేవస్థానం వుద్యోగుల తాలూకు ప్రత్యేక క్యూ అట అది—లోపలి వాళ్ళందరూ దాదాపు బయటకి వచ్చెయ్యగానే, వీళ్ళని లోపలకి వదిలేశారు! ఆ తరవాత మా క్యూలు (అంటే నిజంగా క్యూలు లేవు—మందలే!) వెండివాకిలి లోకి వదిలారు—మళ్ళీ వీలైనంతగా తోపులాట! అక్కడ మళ్ళీ చిన్న క్యూ లైను! అక్కడికి వైకుంఠ ద్వారం కనిపిస్తూ వుంటుంది! అక్కడనించి కుడివైపు లోపలికి (బంగారువాకిలి దగ్గరకి) క్యూ! చెప్పానుగా, అప్పటికే అన్ని క్యూలూ కలిసిపోయాయని! ఇక అక్కడ నించి ‘మహా లఘు’ లేదా ‘మహావీర లఘు’ దర్శనం!

Monday, June 8, 2009

నీ కొండకు నీవే రప్పించుకో--3

ఇక ఇతర విషయాల మీదకి మళ్ళింది సంభాషణ. నా ఇదివరకటి యాత్రల గురించి చెప్పగానే, రాజేష్, ‘మరీ ముఫ్ఫై యేళ్ళా! వడ్డీ భారం పెరిగి పోతుంది కదా సార్! నేను మాత్రం నెల విడిచి నెల ఠంచన్ గా వచ్చేస్తాను! ఏప్రిల్ 26 న వచ్చాను, మళ్ళీ ఇప్పుదు వచ్చాను! ఇలా వస్తూనే వుంటాను!’ అన్నాడు. నేను, ‘స్వామి వడ్డీ కడతానన్నాడు కుబేరుడికి—నేనైతే వడ్డి కూడా చెల్లించనని తెలుసాయనకి!’ అన్నాను. ఉమేష్ ‘నేను వచ్చి దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు అయ్యింది—మళ్ళీ ఇప్పుడు వచ్చాను’ అన్నాడు. తరవాత, అప్పటికీ, ఇప్పటికీ తేడాల మీద సాగింది సంభాషణ. కొండమీద టొల్ గేటు చేరగానే, మా గైడ్ మాకు యేమిచెయ్యాలి, దర్శనం అయ్యాక యెక్కడ కలవాలి, అన్నీ చెప్పి, మమ్మల్ని సెల్లార్ లో చేర్పించి, తను వెళ్ళిపోయాడు, మా టిక్కెట్ లు మాకిచ్చేసి. రెండునెల్లకోసారి వచ్చే రమేష్ పుణ్యమాని, మేము త్వర త్వరగా ఆ క్యూ లైన్ లో నడుచుకుంటూ, వెళుతున్నాము.

Sunday, June 7, 2009

నీకోండకు నీవే రప్పించుకో--2

మచిలీపట్నం—తిరుపతి ఎక్ష్ ప్రెస్ లో మా దంపతులతోపాటు వచ్చిన విజయవాడ వ్యాపారి (పేరు ‘ఉమేష్’ అందాం!) తో ముగ్గురం అంబాసిడర్ వెనక సీట్లో కూర్చున్నాము, ముందు సీట్లో గైడ్ పక్కన ఇంకో నవయువకుడు—ఈయన ఓ ఫ్రీలాన్స్ జర్నలిష్ట్ అట—ఇండియన్ ఎక్ష్ ప్రెస్ కి యెక్కువగా వ్రాస్తూ వుంటాడట! (పేరు ‘రమేష్’ అందాం!)—కూర్చొన్నారు. రమేష్ వేడి వేడిగా టాపిక్ మొదలు పెట్టాడు—‘కరుణాకరరెడ్డి శ్రీవారి ఆభరణాల ఎగ్సిబిషన్ పెడతానన్నాడు కదా? యెందుకు పెట్టలేదు? యెందుకు పెట్టనివ్వలేదు?—వాటిల్లోని ఖరీదయిన వజ్రాలని లేపేశారు సార్!’ అని. ‘అసలు కారణం అది కాదు! మనపోలీసులు తగిన రక్షణ కల్పించలేమన్నారు కదా? ఇది పైకి కనిపించే, చెప్పే కారణం! నిజం గా కూడా, అన్ని టన్నుల బంగారానికి ‘ఫోర్ట్ నాక్స్’ కి వున్నంత భద్రత కల్పించాలి మరి! ఇక అసలు కారణం, 1933 నించీ, శ్రీవారికీ, అమ్మవార్లకీ వచ్చినె కానుకలకి లెఖ్ఖా పత్రం లేదు—అందుకనీ’ అని నేనన్నాను. ‘అన్నీ యెందుకు, కనీసం శ్రీ కృష్ణదేవరాయలు ఇచ్చిన ఆభరణాలైనా ప్రదర్శించవచ్చుకదా? ఓ జర్నలిష్ట్ గా నాకు కొన్ని ప్రత్యేక సమాచార చానెళ్ళు వుంటాయి! అందుకే చెపుతున్నాను! తిరుపతిలో అతిపెద్ద బంగారు ఆభరణాల దుఖాణం యెవరిదో తెలుసా? అది అంత పెద్దది యెలా అయ్యిందో తెలుసా?’ అన్నాడు—రమేష్. ఉమేష్ కల్పించుకొని, ‘ఇది బహిరంగ రహస్యమే సార్! కరుణాకర్రెడ్డి 700 కోట్లు సంపాదించాడట!’ అన్నాడు. ‘మరి మళ్ళీ కరుణాకర్రెడ్డే దేవస్థానం చైర్మన్ అవుతాడంటున్నారు’ అన్నాన్నేను. ‘ఆది కేశవుల్నాయుడు అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకం గా వోటు వేసినందుకు, చైర్మన్ గిరీ, కొన్ని కోట్లూ సంపాదించుకున్నాడు! అతని అవసరం తీరి పోయింది కదా? అసలు అవిశ్వాస తీర్మానానికీ, ఎంపీలకి ముట్టిన డబ్బులకీ, ఐసీఐసీఐ బ్యాంకు కామత్ కీ యేమిటి సంబంధం? అంటే, అక్కడ నించీ డొంక కదుల్తుంది’ అన్నాడు, రమేష్. ‘సరే, మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటులు వచ్చేశాయిగదా! ఇప్పుడెలా వుంటుందో?’ అన్నాన్నేను. ‘గొప్ప విజయమే లెండి! ‘ఇన్ని’ సీట్లు వందలోపు మెజారిటీ తోనూ, ‘ఇన్ని’ సీట్లు 5 వందల లోపు మెజారిటీతోనూ, ‘ఇన్ని’ సీట్లు వెయ్యి లోపు మెజారిటీ తోనూ నెగ్గారు!’ అని స్టాటిస్టిక్స్ వల్లించిన రమేష్, ‘మొదటి విడత పోలింగు అవగానే, ఇంటలిజెన్స్ యేజన్సీలు ‘మెజారిటీలు బొటబొటీగా వుండబోతున్నాయి’ అని చెప్పాయిట. వెంటనే, కాంగ్రెస్ వారు, పోస్టల్ బ్యాలెట్ లని కొనేశారు! రాష్టృఅం లో 8 వందల పైచిలుకు పోస్టల్ బ్యాలెట్ లని కాంగ్రెస్ వాళ్ళు కొనేశారని పేపర్లలో వచ్చింది కదా? మరి అందుకే చిదంబరం, పొన్నాల లక్ష్మయ్యా, ఉండవిల్లి అరుణ్ కుమార్ మొదలైనవాళ్ళు నెగ్గారు!’ అన్నాడు రమేష్! ‘నిజమే కదా! ఆ మర్నాటివరకూ వీళ్ళందరూ వోడి పోయారనే అనుకున్నాను నేను’ అన్నాడు ఉమేష్.

Saturday, June 6, 2009

నీ కొండకు నీవే రప్పించుకో.....

కలియుగ దైవం పిలిచింది!
1975 జూన్ 19 న నా వివాహం అయ్యాక, మా మామగారి మొక్కుబడి తీర్చడం కోసం, పసుపుబట్టలతో ఆ నెల ఆఖరి వారం లో మా దంపతులం వెళ్ళాం—కలియుగ దైవం దర్శనానికి! తరవాత, 1979 లో మా స్నేహితుడి అన్న పెళ్ళికి చెన్నై వెళ్ళి, తిరిగి వచ్చేటప్పుడు, మా స్నేహితుడితో మరోసారి వెళ్ళాను ఆయన దర్శనానికి ఆ స్నేహితుడికి కంపెనీ కోసమని! మళ్ళీ మొన్న, 03-06-2009 న బయలుదేరాము—మా దంపతులం! (ఐ ఆర్ సీ టీ సీ వారి ప్యాకేజ్ పుణ్యమాని!) నా అనుభవాలు—వివరంగా—చదవండి! రైలు శ్రీపతి చేరుతుందనగా, వారి ప్రతినిధి నించి ఫోన్—ఒక్క ఐదు నిమిషాలు వేచి వుండండి ప్లాట్ ఫాం మీద—నేను వస్తున్నాను—అని! మేమిద్దరం కాకుండా ఇంకొక యువకుడు—వేచి వుండగానే, ఆ ప్రతినిధి వచ్చి, మాకు ఇవ్వవలసిన పత్రాలు ఇచ్చి, యేమి చెయ్యాలో చెప్పి, బయట టాక్సీ దగ్గరకి మమ్మల్ని తోడ్కొని వెళ్ళి, అక్కడ ఇంకొక ప్రతినిధి (గైడ్) కి మమ్మల్ని అప్పచెప్పి వెళ్ళిపోయాడు—మీరు తిరిగి వచ్చేటప్పటికి మీకోసం యెదురు చూస్తూ వుంటాను మళ్ళీ రైలు లో మిమ్మల్ని సాగనంపడానికి—అని చెప్పి! అప్పటికి ఉదయం 6.40 అయ్యింది. టాక్సీ లో మమ్మలని తీసుకెళ్ళి, ‘శ్రీనివాసం’ అతిథి గృహం లో మాకు బస యేర్పాటు చేసి, ఫలహారాలకి చీటీలు ఇచ్చి, ‘8.45 కల్లా సిద్ధంగా వుండండి—కొండపైకి వెళదాం’ అని చెప్పి, గైడ్ వెళ్ళాడు—మరొకర్ని స్వాగతించడానికి! మేము స్నానాలు, ఫలహారాలు కానిచ్చి, క్రిందకి వచ్చి, శ్రీనివాసం అతిథి గృహాన్ని ఓ సారి పరిశీలించి, సిద్ధంగా వుండగా, గైడ్, ‘ఇంకో ప్రయాణీకుడు వస్తున్న రైలు ఆలస్యం అయ్యింది సార్! ఇప్పుడే వచ్చింది! ఆయన కూడా సిద్ధం అవగానే, కలసి వెళ్ళిపోదాం—కొన్ని నిమిషాలు వేచి వుండండి’ అన్నాడు. మేము ముగ్గురం వేచి వుండగానే, నాలుగో ఆయన (ఇంకో నవ యువకుడు) రావడం, మేము నలుగురూ, గైడ్ తో కలిసి అయిదుగురం టాక్సీ యెక్కి—10.30 కి కొండపైకి బయలుదేరాము.