Friday, October 1, 2010

ఆర్జితపాపం

ఆరు పిడికెళ్లే

ఆర్జిత సేవల టిక్కెట్ల కుంభకోణం లో "ఆ ముగ్గురిదే" హవా అని దేవస్థానం నిఘా సంస్థ నిగ్గు తేల్చిందట. వీళ్ల హవా
కూడా--చైర్మన్ గారి తరవాతేట! (పాపం ఆయన్నేమీ అనకూడదట లెండి--వీళ్ల ముగ్గురిమీదే చర్యలు తీసుకోవాలట.)

గత రెండేళ్లలో 14 మంది బోర్డు సభ్యులకి విచక్షణకోటా క్రింద లభించే టిక్కెట్లలో, ఆది కేశవుడు 16,463 టిక్కెట్లు
మంజూరు చేయించుకోగా, సుబ్రహ్మణ్యం 8,800; అంజయ్య 8,539; యాదయ్య 6,962; మాత్రమే మంజూరు చేయించుకొని, యేజంట్ల ద్వారా అమ్ముకునేవారట.

వాళ్ల పీయే ల ద్వారా, యేజంట్లనించి ప్రతీ నెలా లక్షల్లో ముట్టేవట వీళ్లకి ఈ సేవా టిక్కెట్ల రూపం లో!

ఇక బ్రేక్ దర్శనాల్లో, ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రులు, ఎం పీలు, ఎమ్మెల్యేలూ వగైరా అందరి కోటా కలిపి 600 కి మించలేదట. కానీ సాయంత్రం బ్రేక్ కి మొత్తం 14 మంది సభ్యులూ 1,33,974 టిక్కెట్లు మంజూరు చేయించుకుంటే,
ఆదికేశవుడితో సహా ఈ ముగ్గురికీ 73,823 మంజూరయ్యాయట.

వుదయం బ్రేక్ కి అయితే, రెండేళ్లలో ఈ నలుగురి కోటాలోనూ వరుసగా 71,624; 31,779; 27,369; 24,611 మంజూరయ్యాయట!

వెంకన్నా! ఈ లెఖ్ఖలన్నీ అర్థమవుతున్నాయా? కుబేరుడికి వడ్డీ యెక్కువ కట్టేస్తున్నావేమో చూసుకో!

ఈ మధ్యనే సెంట్రల్ సర్వీసుకి వెళ్లడానికి వొప్పుకొన్న రాష్ట యెన్నికల ప్రథానాధికారి ఐ వీ సుబ్బారావు, గతం లో
దేవస్థానం ఈ వో గా పనిచేసిన అనుభవం తో, "సుదర్శన కంకణాన్ని తిరిగి ప్రవేశపెట్టాలనీ", "సుపథం పేరుతో
'కదిలే తివాచీ' యేర్పాటుచేసి, మహర్ద్వారం ముందుభాగం నించి సన్నిధిని కలుపుతూ తిరిగి వెలుపలకి చేరుకొనేలా
అమర్చాలనీ, అవసరాన్నిబట్టి వేగాన్ని తగ్గించడం పెంచడం చేయచ్చనీ," రెండు విలువైన సూచనలు చేశారు.

(ఇవన్నీ ఇదివరకు మనం అనుకున్నవేకదా?)

మరి ఆలకించేవాడేమంటాడో?

Friday, September 10, 2010

శ్రీగిరి శ్రీపతి

అదే తీరు


చిరుతపులి తన మచ్చల్ని మార్చుకోగలదా? 

యెడం చేయి తీసి పుర్ర చెయ్యి పెడితే యేమైనా తేడా వుంటుందా?

ముల్లూపోయి కత్తీ వచ్చే......లో యెన్ని పోతే కథ పూర్తవుతుంది?

పాలక మండలి పోయి, సాధికార మండలి వస్తే యేమైనా మారుతుందా?

యేమో మరి!

ఏకగవాక్ష విధానం కోసం "శ్రీ-సేవ" పేరుతో ఓ నాలుగంతస్తుల భవనాన్ని నిర్మిస్తారట. రాష్ట్రం లో వివిధ ప్రాంతాలతోపాటు, తమిళనాడు, కర్ణాటకల్లో మొత్తం ఓ 50 శ్రీ-సేవ కేంద్రాలు యేర్పాటు చేస్తారట!

కొండమీద ధ్యాన మందిరాలు కట్టిస్తారట!

(భద్రాచలం లో కొండమీదే ఆలయం ప్రక్కన కట్టిన "శ్రీ రామదాసు ధ్యాన మందిరం" ఇప్పటివరకూ యెందుకూ వుపయోగపడిన దాఖలాలు లేవు--అలాగే శిధిలం అయిపోతూంది.)

అయినా అభివృధ్ధికల్లా మూలం బిల్డింగులు కట్టడమేనా?

సరే--మహాలఘువుని రేపు ఒకటో తారీకు నించీ రద్దు చేశామని ఇప్పటికే ప్రకటించారు కదా? మళ్లీ ఇప్పుడు దర్శనాలపై "పునః సమీక్ష" చేస్తామనడం యేమిటి?

కొన్ని రోజుల్లోనే ఈ మార్పుకి కారణం యేమిటి?

యేమీ లేదు--వీళ్లు రోశయ్యగారితో సమావేశం లో పాల్గొన్నారట. ఇంకా అందులో మంత్రులు గాదె వెంకట రెడ్డి, దానం నాగేందర్, ప్రథాన కార్యదర్శి ఎస్ వీ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారట!

ఇదేదో విక్రమార్కుడి సిం హాసనం కథ లాగ.....!

అదండీ సంగతి!



Friday, September 3, 2010

శ్రీగిరి శ్రీపతి

సామాన్యుడికి కాస్త వూరట

కొన్ని నిర్ణయాలు క్షణాల్లోనే జరగాలి. సంవత్సరాల తరబడి లాక్కుంటూ, పీక్కుంటూ కూర్చుంటే ప్రయోజనం వుండదు.

సాధికార మండలి మొదటి సమావేశం లోనే మంచి నిర్ణయాలు వెలువడ్డాయి.

మొదటిది--మహాలఘు దర్శనం రద్దుచెయ్యాలని.

సామాన్యులకి మూడురకాల దర్శనాలు అమల్లో వున్నాయి ఇన్నాళ్లూ.

లఘు దర్శనం--అంటే, స్వామికి దగ్గరగా వుండే మొదటి ద్వారం కాకుండా, రెండో ద్వారం దగ్గర దర్శనం కలిగించి, పంపించెయ్యడం.

మహాలఘు దర్శనం--అంటే, రెండోది కూడా కాకుండా, జయ విజయులు కాపలా వుండే మూడో ద్వారం దగ్గరనించే పంపించివెయ్యడం.

మహావీర లఘు దర్శనం--అంటే, మూడో ద్వారం దగ్గరకూడా నిలబడనియ్యకుండా, నెట్టేయడం/ఈడ్చెయ్యడం.

ఇప్పుడు మహా లఘువుని రద్దు చేస్తే, మహావీర లఘువు కూడా ఆటోమేటిగ్గా రద్దవుతుంది.

ఇక మిగిలేది లఘువు మాత్రమే! 

చూద్దాం, ఇదెలా వుంటుందో!

ఇక ఆర్జితసేవల కరెంటు బుక్కింగ్ మొదలెడతారట రేపు ఒకటో తారీఖు నించీ.

సుప్రభాతం, కల్యాణోత్సవం, నిజపాద దర్శనం లకి, ఒక్కోదానికీ 100 చొప్పున 300 టిక్కెట్లు వుదయం 8.00 నించీ, ముందు వచ్చినవారికి ముందు పధ్ధతిలో జారీ చేస్తారట.

ఊంజల సేవకి 10, సహస్రదీపాలంకరణకి 70, ఆర్జిత బ్రహ్మోత్సవానికి 25, వసంతోత్సవానికి 25 వంతున 135 టిక్కెట్లు జారీ చేస్తారట.

గుడ్డిలో మెల్లగా, డబ్బులు చెల్లించగల సామాన్యులకి ఇది మేలేగా?

ఇక ఆన్ లైన్ బుకింగులు మామూలేననుకుంటా.

సాధికార మండలి కొంచెం ముందుకెళ్లి, ఈ సేవల్ని పూర్తిగా రద్దుచేసే రోజొస్తే బాగుండును.

ఇంకా, ఈ ప్రమాణ స్వీకారాలు గుడిలో జరగకుండా నిరోధిస్తే ఇంకా బాగుండును.

ఇలా చేస్తే, లఘువుని కూడా రద్దు చేసి, మొదటి ద్వారం (కులశేఖరపడి) నుంచే అందరికీ, వీ ఐ పీ లతో సహా, చక్కగా దర్శనం కల్పించవచ్చు.

స్వామి ఇంకెప్పుడు కరుణిస్తాడో సామాన్యుల్ని!

Friday, August 20, 2010

తితిదే పాలక మండలి

శుభవార్త

ఇప్పటికి రాష్ట్ర మంత్రి మండలి, ప్రస్తుత తితిదే పాలక మండలి గడువు ముగిశాక, కొత్తగా యెవరినీ నియమించకుండా, ఓ ప్రత్యేక అధికార సంస్థ (అథారిటీ) యేర్పాటు చెయ్యాలని  నిర్ణయించిందట.

ఇప్పటికిది శుభవార్తే మరి. ఆ సంస్థ యెలా వుంటుందన్నది తరవాత సంగతి.

ఈ లోగా ఆదికేశవుడు మొయిలీ దగ్గరనించి ప్రణబ్ వరకూ; అహ్మద్ పటేల్ నించి సోనియా వరకూ వినతిపత్రాలు ఇచ్చుకుంటూ వస్తున్నాడట--తనకి ఇంకో అవకాశం ఇవ్వాలని! (ఆయనకి పగ్గాలు అప్పగించిన ఆసలు ఒప్పందం లో ఒకసారి అని వుందో, రెండుసార్లు, లేదా ఆయన జీవితకాలం అని వుందో తెలియదు మరి)

ఇక, ఆర్జితసేవా టిక్కెట్ల కుంభకోణం లో--ఇది గత నాలుగేళ్లుగా సాగుతోందనీ, పాలక మండలి సభ్యులు యాదయ్య, అంజయ్య, సుబ్రహ్మణ్యం అనేవాళ్లతో సహా మొత్తం 54 మంది  దీనికి బాధ్యులు అని వారి విజిలెన్స్ శాఖ నిర్ధారించి, వారిమీద చర్యలు తీసుకోమని నివేదిక ఇచ్చిందట.

ఇందులో, యాదయ్య, అంజయ్య--బలహీన వర్గాలకి చెందినందువల్లే తమని ఇరికించారని ఆరోపించారట! మరి నివేదికలోని మిగిలిన పాలకవర్గ సభ్యుల కులాలేమిటో మనకు తెలియదు.

(ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థలేకాదు--మిగిలిన సంస్థల్లోకూడా, సహజం గా వాళ్ల విజిలెన్స్ శాఖలో, మేనేజిమెంటు యెవరిని నొక్కెయ్యమంటే వాళ్లని నొక్కేసే తొత్తులు వుంటారనుకోండి.)

నిజానిజాలు శ్రీవారికే తెలియాలి.

కొసమెరుపేమిటంటే, సూర్యనారాయణ రెడ్డి, కస్తూరి రంగన్ అనే తితిదే వుద్యోగులు ఈ తరహా కుంభకోణానికి పాల్పడుతున్నారని విజిలెన్స్ సంస్థ 2008 లోనే నివేదిక ఇచ్చినా, అప్పటి ఈవో అది బుట్టదాఖలు చెయ్యడమే కాకుండా, వాళ్లకి పదోన్నతులు ఇచ్చారని ఈ నివేదికలో పేర్కొన్నారట!

అదండీ సంగతి!

Monday, July 19, 2010

శ్రీగిరి శ్రీపతి

దర్శనాలు

ఆది కేశవుడు మళ్ళీ ఇంకో కాంగీరేసు నాయకుణ్ణి 'మహావీర స్పెషల్' దర్శనానికి తీసుకెళ్ళాడట. క్యూలైన్లు ఆపలేదుట లెండి.

ఆ నాయకుడికీ, వెనకాలో పదిహేను మందికీ మాత్రమే, అందరికీ శీఘ్ర దర్శనం టిక్కెట్లు తెప్పించి, (అక్షరాలా తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు--యెవరిచ్చారో!) వాళ్ళని ఆ లైన్లో రమ్మని, ఈయన మహర్ ద్వారం దగ్గర నించొని, వాళ్ళందరినీ తీసుకెళ్ళి, లఘు దర్శనం స్థానం లో వున్న తండులను తొలగించి, సన్నిధికి తీసుకెళ్ళి, నైవేద్యం గంట సమయం లో, ప్రత్యేక దర్శనం చేయించాడుట.

(మరి ఆ స్వామికి ఆ సమయం లో ఆ ప్రసాదం సహించిందో లేదో!)

ఈ దేవస్థానం పాలిటికి మోహన్ బాబొకడు. 

వేదపాఠశాలకెళ్ళి, 700 మంది విద్యార్థులు దారుణమైన మౌలిక వసతుల మధ్య వున్నారనీ, వాళ్ళ భోజన శాల పందులు తిరిగే ప్రదేశం లా వుంది అనీ, విలేకర్ల సమావేశం పెట్టి మరీ తగులుకున్నాడు.

ఈ వో గారు, "ఓ నెల లోపు" చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారట.

పాపం ఆ విద్యార్థుల గతేమౌతుందో!

మరి భక్తి చానెల్ వాళ్ళు, గంటకొట్టినంతసేపూ ఆడియో వినిపిస్తూ, గోపురం వీడియో చూపించేకంటే, ఇలాంటి పాఠశాలల్నీ వగైరాలని చూపిస్తే యెలా వుంటుందో.

 

Thursday, July 1, 2010

ఆభరణాల లెఖ్ఖలు

శ్రీ కృష్ణరాయాభరణీయం

నాకు గనక కార్టూన్లు గీయడం వస్తే, 'హా! హతవిథీ!' అని శ్రీ కృష్ణదేవరాయలు తల మొత్తుకుంటున్నట్టు కార్టూన్ గీసేవాడిని!

మరి ఆయన శ్రీవారికి సమర్పించిన ఆభరణాలేవీ ఇప్పుడు లేవట!

40 యేళ్ళ క్రితమే కరిగించివేసి వుండొచ్చు--అని తి తి దే వారి వువాచట!

ఇది మాత్రం పచ్చి అబధ్ధం! అప్పుడే నేను పత్రికల్లో చదివాను--"హుండీలోనూ వగైరా లభించిన చిన్నా, చితకా ఆభరణాల సంచులతో బొక్కసం నిండిపోతుంటే, వాటిని కరిగించి ఇటుకలు తయారు చెయ్యమని ప్రభుత్వ 'మింట్' కి పంపించారనీ, వాటిలో రాళ్ళని వేరే వేలం వేశారనీ!" (ఈ విషయం నా ఇదివరకు టపాల్లో స్పష్టం గా వ్రాశాను--వీటిలో ఖచ్చితం గా కంటెలూ, కాసుల పేర్లూ, కఠారులూ, కిరీటాలూ వగైరాలు లేవు!)

ఆభరణాల వివరాలకోసం నా క్రింది టపాని చూడండి--

http://krishnaagovindaa.blogspot.com/2009/10/blog-post_20.html


మొన్నీమధ్యనే ఓ కమిటీ శ్రీవారి ఆభరణాలన్నీ భద్రం గా వున్నాయనీ, వాటి విలువ కేవలం 52 కోట్లేననీ ప్రకటించింది!
(ఆ కమిటీకి తుర్లపాటి కుటుంబరావు దూరం గా వుండి వుంటే బాగుండేది అని నా అభిప్రాయం)

చూ|| http://krishnaagovindaa.blogspot.com/2009/11/blog-post_05.html

ఇక ఇప్పుడు రాయలు అసలు ఆభరణాలేవీ ఇవ్వలేదనీ, వూరికే పబ్లిసిటీ చేసుకున్నాడనీ ఆయన మీద పరువునష్టం దావా వేస్తుందేమో తి తి దే!

వీళ్ళిలాంటి వేర్రాలోచనలు చేస్తారని 500 యేళ్ళక్రితమే రాయలు వూహించి, రాళ్ళమీద శాసనాలు చెక్కించాడు!

అసలు ఈ శాసనాలని కనిపించకుండా చెయ్యడమే 'స్వర్ణమయం' వుద్దేశ్యమేమో!

నగరాల్లో 'కల్యాణోత్సవాల' పేరిట ప్రైవేటు వ్యక్తులు వీలైనంత దండుకున్న వార్తలు కూడా వచ్చాయి కదా?

ఇంకా వీళ్ళు యెన్నెన్ని వుపాయాలు కనిపెడతారో?

అందుకే అన్నారు "శతకోటి దరిద్రాలకి అనంతకోటి వుపాయాలు" అని!

(శతకోటి దరిద్రుల్లో వీళ్ళ శాతం యెంతో?)


Wednesday, June 23, 2010

అక్రమార్కులు

'......సేవలు'

కొంతమంది ఆర్జన కి మాత్రమే వుపయోగపడుతున్న ఆర్జిత సేవల టిక్కెట్ల కుంభకోణం లో, సుబ్బిరామిరెడ్డి హస్తం కూడా వుందట.

'ఓ ఇరవై లక్షలు పంపించాం! ఉదయాస్తమాన సేవ టిక్కెట్ కోసం--అవి లేవన్నారు, సరేపోనీ మిగిలిన సేవలకి ఓ 168 టిక్కెట్లో, 186 టిక్కెట్లో పంపించండి అన్నాం! వాళ్ళు వెంటనే పంపించారు' అని ఆయన భార్య వివరణ.

'ఇందులో యేమీ అక్రమాలు లేవు' అని ఆదికేశవుడి సమర్థన!

వీ ఐ పీ ల కోసం, గంటలతరబడి క్యూ లైన్లు ఆపెయ్యడం--'ఒక్క క్షణం కూడా ఆపలేదు' అని ఆదికేశవుడి బుకాయింపు!

లఘు, మహా లఘు, మహావీర లఘు దర్శనాలకి సామాన్యులకి అనుమతిస్తున్న ఓ సెకనో, రెండు సెకన్లో సమయం ప్రకారం రేటు కట్టి, వీ ఐ పీల దగ్గర అంత డబ్బూ యెందుకు వసూలు చెయ్యరు?

వాళ్ళు సేవలు చేస్తేనే స్వామి తరిస్తున్నాడా?

అసలు ఈ సేవల్ని యెందుకు రద్దు చెయ్యరు?