Friday, June 19, 2009

షిరిడీయో, శ్రీపతో......

‘……..యేమి చెయ్యాలి?’
లక్షలమంది వచ్చిపడిపోతుంటే యేమిచెయ్యాలి?
ఆది నించీ జనాలని గొఱ్ఱెలతో పోల్చారు! (ఇలా అంటే కోపమొచ్చే జనాలు కూడా వున్నారు!)
ఓ నలభై అయిదు—యాభై యేళ్ళ క్రితం చదువుకున్న కథ బాగా గుర్తు వుండి పోయింది! ఇది అందరికీ తెలిసిన కథే!
నాకు పూర్తిగా గుర్తులేదుగానీ—‘సైక్లోప్స్’ అనే రాక్షసుడు ఓ దీవిలో వుంటాడు. వాడికి నుదుటి మీద ఒక్క కన్నే వుంటుంది! వాడు రోజూ తన బోళ్ళన్ని గొర్రెలని తన నివాసమైన పెద్ద గుహలో రాత్రంతా బంధించి వుంచి, పగలు మేపడానికి బయటికి వదులుతూ వుండేవాడు. ఇంకెవరైనా పొరపాటున ఆ దీవికి వస్తే, వాళ్ళని కూడా ఆ గుహలో బంధించి, ఆకలేసినప్పుడు వండుకు తినేసేవాడు!
ఒక సారి, ‘యులిసెస్’ అనేవాడొకడు (ఇంకొంత మందితో అనుకుంటా) యెలాగో ఆ దీవి లో చిక్కుకుపోతాడు. ఇంక మర్నాడో యెప్పుడో వీడి వంతూ వస్తుందనగా, ఒకరోజు రాక్షసుడు నిద్రపోతూ వుండగా, కాలుతున్న కొఱకంచు తో వాడి ఒక్క కన్నునీ పొడిచేస్తాడు! తెల్లవార్లూ కష్టపడి, ఓ ప్లాను వేసి, వాడి బారినించి పొద్దున్నే తప్పించుకుంటాడు!
అది యెలాగంటే, గొఱ్ఱెలని ఒకదానిపక్క ఒకటిగా మూడేసి చొప్పున తీగలో యేవో వుపయోగించి కట్టేస్తాడు. (గుహ ద్వారం మూడు గొఱ్ఱెలు పక్క పక్కన వెళ్ళడానికే సరిపోతుంది!) తాను వాటిల్లో ఒక మూడింటి మధ్యన వుండే గొఱ్ఱె పొట్టకి క్రిందుగా తనను తాను కట్టేసుకుంటాడు! సైక్లోప్స్ పొద్దున్నే గుహద్వారం తెరిచి, ఓ పక్కగా కూర్చొని, గొఱ్ఱెల్ని బయటికి వదిలి, వాటి మీద యెవరూ బయటి పోవడం లేదు అని నిర్ధారించుకోవడానికి వాటి వీపులు తడుముతూండగా, మూడు వరసల్లో గొఱ్ఱెలన్నీ బయటికి నడవగానే, మనవాడు కట్లు విప్పుకొని ఒకటే పరుగు—సముద్రం చేరేదాకా—‘బ్రతుకు జీవుడా’ అనుకుంటూ!
తరవాత, ‘అతను జీవితాంతం సుఖం గా బ్రతికాడు’ (ట)!
ఇంతకీ, ‘ముగ్గురు నలుగురు పట్టే క్యూలు ’ అంటే, నాకు సైక్లోప్స్ గుహ ద్వారమే గుర్తుకు వస్తుంది! వాటిల్లోంచి, యెవరైనా (టెర్రరిష్టులతో సహా) తోసుకు పోవచ్చు కదా! అవసరమైతే ముందున్న వాళ్ళని క్రిందపడేసుకుంటూ, వాళ్ళ శరీరాల మీద నించి తొక్కుకుంటూ!
మరి ‘భద్రతా గురు ‘ లకి, సోకాల్డ్ ‘నిపుణులకి’ ఇంత చిన్న విషయం యెందుకు తట్టదో నాకైతే తెలియదు!
ఇంతకీ ‘యేం చెయ్యాలి?’ అంటారా! వస్తున్నానక్కడకే! వేచి వుండండి!

No comments: